తెలంగాణా- ఉద్యమం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలంగాణా- ఉద్యమం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, జులై 06, 2012

రాయల తెలంగాణ రాగం వెనుక..?!



ఈసారి నైరుతి రుతుపవనాలు బలంగా ఉన్నాయని, వీటి ప్రభావంతో తెలంగాణ అంతటా భారీ వానలు కురుస్తాయని వాతావరణశాఖ నెలరోజుల క్రితం సాధికారికంగా ప్రకటించింది. అది నిజమేనన్నట్టు ఆకాశం నిండా మేఘాలు కమ్ముకుని మురిపించింది. వేడి తగ్గింది. మబ్బు లు కమ్ముకున్నాయి. మబ్బులు చూసి ఈసారైనా సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండుతాయని తెలంగాణ రైతులు ఆశ పడ్డారు. కానీ ఆయి టి పూని నెల దాటుతున్నా ఒక్క చినుకు లేదు. మబ్బులు అలాగే ఉన్నాయి. ప్రతిరోజూ నేడో రేపో అన్నట్టు కమ్ముకు వస్తున్నాయి. మనలో ఆశలు ఎన్ను న్నా ఇలా నెలలు గడుస్తున్నా అవి ఇప్పుడిప్పుడే కురిసే అవకాశాలు మాత్రం కనిపించడంలేదు.

శుక్రవారం, జూన్ 29, 2012

అన్నీ డమ్మీ తుపాకులే సార్..!


ట్రిగ్గర్ ఎప్పుడు నొక్కాలో తెలుసుకోవడమే రాజనీతి అంటారు. రాజనీతికి అత్యున్నత దశగా, ఒక ఆదర్శంగా విప్లవాన్ని అభివర్ణించే వాళ్ళు ట్రిగ్గర్‌ను అప్రమత్తతకు ప్రతీకగా భావిస్తారు.యుద్ధరంగంలో ఉన్న యోధుపూప్పుడూ ట్రిగ్గర్‌పై వేలు ఉంచి దాడికి, ప్రతిఘటనకు సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు కోదండరాం అదే ప్రతీకను వాడుతున్నాడు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం దశాబ్ది ఉత్సవాల్లో ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రపతి ఎన్నికను తెలంగాణ సాధనకు ట్రిగ్గర్‌గా వాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రధానమైన భూమికను పోషించిన టీజేఎఫ్ సభలో కీలక ఉపాన్యాసం చేసిన సందర్భంగా నేను రాష్ట్రపతి ఎన్నికల ప్రస్తావన తెచ్చాను. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠకు కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ముందుకు తేవాలన్నది నా సూచన. నిజానికి తెలంగాణవాదుపూవ్వరూ అధికార కూటమి తరఫున రాష్ట్రపతి ఎన్నికల రంగంలోఉన్న ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వకూడదన్నది నా అభివూపాయం.

గురువారం, మే 31, 2012

దేవుడు చేసిన మనుషులు!



దేవుడు ఉన్నాడా లేడా ఆన్న చర్చ ముగిసి చాలాకాలమే అయ్యింది. నమ్మే వాళ్ళు ఉన్నాడని, నమ్మనివాళ్ళు  లేడని  నిర్ధారించుకున్నాక చర్చకు కాలం చెల్లింది. కానీ ఇప్పుడు అదే చర్చ మళ్ళీ తెరమీదికి వస్తోంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడని అనుకున్నవాళ్ళకు  లేడేమోనని, లేనే లేడని వాళ్లకు ఉన్నాడేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి దేవుడు ఉన్నాడా లేదా ఆన్న సంశయానికి కారణం మనుషులే తప్ప దేవుడు కాదు. ఎవరైనా తప్పులు చేసినప్పుడు, అన్యాయంగా ప్రవర్తించినప్పుడు, వాటిని ఎదిరించే శక్తి, ధైర్యం లేనప్పుడు  దేవుడు ఉంటే బాగుండునని కోరుకుంటారు.

శనివారం, మే 19, 2012

కోస్తా తీరాన్ని కొల్లగొట్టారు!




జగన్ అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ ను సి బీ ఐ అరెస్టు చేసింది. వాన్పిక్ పేరుతొ వేలాది ఎకరాలు అక్రమంగా కాజేసిందుకు ఆయన ఇప్పుడు చంచల్ గూడా జైలులో ఊచలు లెక్క బెడుతున్నారు. కానీ మా మిత్రుడు ఏడుకొండలు మాత్రం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయి పోతున్నాడు. ఏడుకొండలుకు నిమ్మగడ్డ తో వ్యాపార పరమైన వైరమేమీ లేదు, అసలు ఆయనతో పరిచయం కూడా లేదు. కాకపోతే ఆయన వాన్పిక్ విద్వంసానికి ప్రత్యక్ష సాక్షి. వాన్పిక్ వల్ల ఉపాదికోల్పోయిన పల్లెకారుల ప్రతినిధి. సింగోతు ఏడుకొండలుది ప్రకాశం జిల్లా చినగంజాం మండలం లో ఒక చిన్న పల్లె. ఆ పల్లెనిండా పల్లెకారులే! సముద్రాన్నే నమ్ముకుని చేపలుపట్టి ఉపాధి పోసుకోవడం పల్లెకారుల వృత్తి. వారిలో చదువుకునే వాళ్ళే అరుదు. అటువంటి కుటుంబంలో చీరాలలో డిగ్రీ దాకా చదివిన ఏడుకొండలు తండ్రి మరణంతో పైచదువులకు స్వస్తి పలికి సముద్రాన్ని ఈదే సాహసం చేయలేక పొట్ట చేతబట్టుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆశ్రయమిచ్చి ఆదుకుంది. ఉస్మానియా లో ఎం ఏ సైకాలజీ, బీ ఈ డీ, ఎం ఫిల్ చేసిన ఏడుకొండలు ఒకవైపు చదువుకుంటూనే చిన్నా చితకా పనులు చేసి ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసారు. బాధ్యతలన్నీ తీరిపోయాయనుకున్న సమయంలో వాన్పిక్ ఉప్పెన వాళ్ళ ఊర్లన్నీ ముంచేసింది. ఉన్న ఎకరం, అరెకరం కూడా మిగలకుండా పోయేసరికి చిన్నా చితకా కుటుంబాల పరిస్థితి ఆయనను కలవర పెట్టింది.


ఆ సమయంలో ఏడుకొండలు మా విశ్వవిద్యాలయం లో తాత్కాలికంగా పనిచేసేవాడు. తెలంగాణా ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న కాలంలో ఆయన ఉద్యమానికి తన పూర్తి మద్దతునిచ్చాడు. తాము కోస్తాలోనే ఉన్నా తమ పరిస్తితి తెలంగాణా లాగే ఉందని, అక్కడి సంపన్నులు తమని బతుకనిచ్చే పరిస్థితి లేదని వాపోయేవారు. వాన్పిక్ పేరుతో నిమ్మగడ్డ ప్రసాద్ సాగిస్తోన్న భూ సేకరణ బాగోతాన్ని వివరించి మమ్మల్ని వాళ్ళ ఊరికి ఆహ్వానించారు. నాతో పాటు పనిచేసే కొందరు అధ్యాపకులు, ఒకరిద్దరు జర్నలిస్టు మిత్రులం ఆయనతో పాటు వెళ్ళాం. రెండు రోజుల పాటు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో నిమ్మగడ్డ కబంద హస్తాల్లో చిక్కుకున్న పల్లెల్ని వాన్పిక్ విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. బంగారం పండే భూములు, పుష్కలంగా నీల్లున్నా సాగుచేయలేని స్థితిలో ఉన్న రైతులు, సముద్రం ఒడ్డునే ఉన్నా అందులో చేపలుపట్టే హక్కులు లేని స్థితిలో పల్లెకారులు, ఊళ్ళో వ్యవసాయ పనుల్లేక ఉపాధి కోల్పోయిన కూలీలు, దళితులు ఇట్లా ఆ పల్లెలు కన్నేరుపెట్టడం కనిపించింది. తిరుగు ప్రయాణంలో సర్ మనం వీళ్ళకోసం ఏమైనా చేయగలమా? అని ఏడుకొండలు మళ్ళీ అడిగాడు. అప్పటికి రెండేళ్లుగా తెలంగాణా ప్రజలంతా ఏకభిగిన పోరాడుతున్నా స్పందించని ప్రభుత్వం తానే విధ్వంసానికి దిగుతుంటే ఏం చేయగలం. అప్పటికే ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం వాన్పిక్ కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్నారు. అదొక్కటే పరష్కారం అనుకున్నాం. ఇప్పుడు అనుకోకుండా వాన్పిక్ అధినేత జైలు పాలు కావడం ఒప్పందాలు రద్దవుతాయన్న వార్తలు వస్తోన్న నేపద్యంలో ఏడుకొండలు కు ఫోన్ చేసాను. ఆయన స్వరంలో ఒక కొత్త ఆశ ద్వనించింది. ఇదే ఆశ ఇప్పుడు ప్రకాశం గుంటూరు జిల్లాల్లోని లక్షలాది మందిలో ప్రతిధ్వనిస్తోంది. అక్కడి రైతులు తమ భూములు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వాన్పిక్ ను రద్దుచేసి తీరాలని కోరుతున్నారు.


జగన్ అక్రమ ఆస్తుల కేసులో సి బీ ఐ విచారణ, నిమ్మగడ్డ అరెస్టు పుణ్యమా అని ఇవాళ ఆకడి ప్రజలకు ఆ ధైర్యం వచ్చింది. వాన్పిక్ అనే సంస్థకు జరిగిన భూ కేటాయింపులన్నీ 'క్విడ్-ప్రొ-కో" ప్రాతిపదికన జరిగినవేనని సి బీ ఐ అంటోంది. న్యాయ శాస్త్ర పరిభాషలో "క్విడ్-ప్రొ-కో" ఆంటే బదులుకు బదులు అని. ఆంటే దాదాపు ఇచ్చిపుచ్చుకోవడం లాంటిది. మీకు ఎవరైనా మేలుచేస్తే అందుకు ప్రతిగా మీరు అతనికి చేసే మేలు అన్నమాట. నిమ్మగడ్డ ప్రసాద్ తన సంపదలో దాదాపు ఎనిమిది వందల కొట్లు జగన స్థాపించిన పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడని సి బీ ఐ గుర్తించింది. ఆయన ఒక వ్యాపారవేత్తగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ అలా పెట్టుబడులు పెట్టినందుకు ప్రతిఫలంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలను ఆయనకు రాసిచ్చాడని, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో అలా భూములు కేటాయించే ముందు కనీస నిబంధనలు పాటించలేదని, మంత్రివర్గ ఆమోదం కూడా పొందకుండానే పనులు జరిగాయని, ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత లేదని ఇలా తవ్విన కొద్దీ అనేక పెంకులు అందులో దొరుకుతున్నాయి. సాక్షి, టీ వీ, చానెల్, పత్రికలో పెట్టుబడులు పెట్టినందుకు వంపిక్ అనే సంస్థకు భూ కేటాయింపు జరిగిందని చెపుతున్నారు. అందులో నిజమెంతో కోర్టులు తేల్చాల్సి ఉంది. అది పక్కన పెడితే వాన్పిక్ కోస్తాలో చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. అధికార బలాన్ని ఆసరా చేసుకుని ఆ ఆ సంస్థ అనేక అమానవీయ చర్యలకు పూనుకుంది.


వాన్పిక్ పూర్తి పేరు వాడరేవు అండ్ నిజాంపట్నం పోర్ట్ & ఇండస్త్రియాల్ కారిడార్. ప్రకాశం జిల్లాలోని చీరాల దగ్గర ఉన్న వాడరేవు అనే ఊరినుంచి గుటూరు జిల్లా నిజాంపట్నం వరకున్న కోస్తా తీరాన్ని రాజశేకర్ రెడ్డి గారి హయాంలో నిమ్మగడ్డ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ సంష్తకు కట్టబెట్టారు. ఈ ప్రాంతంలో ప్రపంచ స్థాయి ఓడరేవులు నిర్మిస్తానని, విద్యుత్ ఉత్పత్తికి పవర్ స్టేషన్ లు నెలకొల్పుతామని, పారిశ్రామిక వాడలు, ఆధునిక విమానాశ్రయం కడతామని నమ్మబలికి ఆయన ఇక్కడ భూసేకరణకు పూనుకున్నారు. ప్రభుత్వం అడ్డూ అదుపూ లేకుండా ఆయన కంపనీకి భూసేకరణకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆఘమేఘాలమీద దాదాపు 34 గ్రామాల్లో 15 వేల ఎకరాల భూమిని తీరప్రాంతంలో ఆయనకు కేటాయించింది. దీనిలో దళితులు గత ముప్పై సంవత్సరాలకు పైగా సాగు చేసుకుంటున్న భూములతో పాటు అటవీ  భూములు, సముద్రపు కోతను ఆపేందుకు   చెట్లనుపెంచే నేలలూ ఉన్నాయి.

ఇలాంటి భూములు కేటాయించడం పర్యావరణానికి ముప్పు అనీ, తీర ప్రాంతాల భూములు ప్రైవేటు కంపనీలకు ఇవ్వడం దేశ భద్రతకు ప్రమాదమని నిపుణులు చెప్పినా రెడ్డి గారు వినలేదు సరికదా మరింత భూమి ప్రయివేటు వ్యక్తులనుంచి, రైతులనుంచి సేకరించుకునే స్వేచ్చను ఆ కంపనీకి ఇస్తూ ఆదేశాలిచ్చారు. ఈ పనులన్నీ ఎలాంటి ఆటంకం లేకునా పూర్తిచేసేందుకు రైల్వే శాఖలో ఉన్న తన బంధువు బ్రమ్హానంద రెడ్డి ని ప్రత్యక అధికారిగా నియమించారు. ఇంకేముంది నిమ్మగడ్డ తన సామ్రాజ్యాన్ని ౩౦ వేల ఎకరాలకు విస్తరించాడు. అప్పటి కలెక్టర్లు మొదలు, రెవిన్యూ యంత్రాంగమంతా రెండేళ్ళ పాటు ఈ పనిలో తరించింది. వాన్పిక్ ఇచ్చిన పరిహారంతో పెద్ద భూస్వాములు, కమీషన్ లతో బ్రోకర్ లుగా పనిచేసిన చోటా మోటా రాజకీయ నాయకులు, ఎం ఎల్ ఏ లు, మంత్రులు కోట్లకు పడగలెత్తారు. లక్షలాది రైతులు, కూలీలు, సముద్ర తీరాన్ని రేవులను నమ్ముకుని బతికే మత్సకారులు వీధిన పడ్డాయి. దాదాపు నలభై గ్రామాలు స్మశానంగా మారే పరిస్తితి వచ్చింది. ఒక్క సి పీ ఐ మినహా అన్నిపార్టీల నాయకులను కంపనీ కొనేసి ప్రతిఘతిస్తోన్న ప్రజల గొంతులు వినిపించకుండా చేసేసాయి. ఆ ప్రాజెక్టును వ్యతిరేకించే వాళ్ళెవరూ అక్కడ అడుగుపెట్టకుండా పోలీసులతో దిగ్భందం చేసి భూసేకరణను జరిపారు. ఈ సందర్భంగానే సి పీ ఐ నాయకులు నారాయణ రహస్యంగా పడవలో ప్రయాణించి అక్కడికి చేరుకుంటే మీడియా అక్కడ ఆయన గాంధీ జయంతి రోజున చికెన్ తింటున్న దృశ్యాన్ని చిలువలు పలువలు చేసినంతగా అక్కడి పోరాటాన్ని ప్రచురించలేదు, ప్రసారం కూడా చేయలేదు. అలా అందరినీ కోనేయగల శక్తి కలిగిన నిమ్మగడ్డ ఇప్పుడొక చానెల్ కు అధిపతి మరొక చానెల్ కు పెట్టుబడి దారుడు! ఇప్పుడు నిమ్మగడ్డ అరెస్టు పత్రికా స్వేచ్చను హరించడమే అని కూడా ఎవరైనా అనవచ్చు!!


నిజానికి పత్రికా స్వేచ్చ ప్రస్తావన భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మన రాజ్యాంగంలో మనిషికి మించిన హక్కు మరెవరికీ లేదు. రాజ్యాంగం ప్రతి మనిషికి భావ ప్రకటన స్వేచ్చ ఉందన్తూనే ఆ తరువాతి పేరాలోనే దానికుండే పరిమితులను కూడా చెప్పింది. ప్రజల భావ ప్రకటన స్వేచ్చకు వాహికగా ఉన్నదే మీడియా కాబట్టి రాజ్యాంగం చెప్పిన పరిమితులకు లోబడే మీడియా పనిచేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం మీడియా స్వేచ్చను ప్రస్తావించక పోయినా మీడియాకు స్వేచ్చ ఉండాలన్నది ఒక ప్రజా స్వామిక ఆకాంక్ష. ఆ ఆకాంక్షను అనేక కోర్టులు నిర్ధారించాయి కూడా. అలాగే మీడియా స్వేచ్చ ఆంటే పాత్రికేయుల స్వేచ్చ. పత్రిక రచయితలు, ప్రచురణ కర్తల స్వేచ్చ అని అనేక సందర్భాల్లో కోర్టు లు తేల్చాయి. అంతే తప్ప యజమానుల స్వేచ్చ కాదని గుర్తించాలి. సాక్షి తెలుగు జర్నలిజం లో ఒక క్రియాశీలమైన పాత్ర పోషించింది. సాక్షి లో వచ్చిన వార్తల వల్ల ముఖ్యంగా ఈ రెండేళ్లలో నాణేనికి రెండో వైపు ఏముందో తెలిసి వచ్చింది. ఆ పత్రిక రాతలను, ప్రచురణను ఎవరైనా అడ్డుకోవడం ముమ్మాటికి పత్రికా స్వేచ్చ కిందికే వస్తుంది. ఇప్పుడు సి బీ ఐ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సాక్షి సిబ్బందిలో పాతకుల్లో ఆందోళన కు కారణం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పత్రిక ప్రచురణకు ఆటంకం కలిగించే విధంగా ఉంటున్నాయి. దాన్ని తప్పుపట్టవచ్చు. కానీ ఇదంతా నేరవిచారణలో భాగం అయినప్పుడు విచారణ జరిపే అధికారాన్ని ప్రశ్నించలేము. పత్రిక ప్రచురణకు, సిబ్బంది భద్రతకు భంగం కలుగకుండా ఏ విచారణయినా జరగాలి. పత్రికా స్వేచ్చ పేరుతో విచారణను అడ్డుకున్నా, విచారణ పేరుతో పత్రికా స్వేచ్చను హరిన్చినా న్యాయం కాదు. దీన్ని ప్రజాస్వామ్య వాదులెవరూ హర్షించ కూడదు. పత్రిక , చానల్ ఏదైనా ఒక ప్రయివేటు యాజమాన్యంలో నడిచే వ్యాపార సంస్థ, ఆ సంస్థ మూతపడితే దానికి యాజమాన్యం బాధ్యత వహించాలి. ఒకవేళ ప్రభుత్వం అన్యాయంగా మూత వేస్తే ప్రభుత్వం మీద జర్నలిస్టు సంఘాలు పౌరసమాజం ఒత్తిడి తెచ్చి దాన్ని తెరిపించాలి. అంతే  తప్ప ఇది పత్రిక కాబట్టి ఆ పత్రిక యజమానిమీద విచారణ వద్దన్నా, ఆ యజమాని తెచ్చిన పెట్టుబడులను ముట్టుకోవద్దన్నా భావ్యం కాదేమో ఆలోచించాలి. అదే న్యాయమని ఎవరైనా వాదిస్తే ఇక ముందు మనం ఏ పెట్టుబదిదారున్నీ విచారించాలేము. కాబట్టి పత్రికా స్వేచ్చను యజమానుల స్వేచ్చతో ముడిపెట్టి చూడకూడదు.


విచిత్రంగా కొందరు నిమ్మగడ్డ అరెస్టు ను పారిశ్రామిక ప్రగతికి అవరోధమని అంటున్నారు. సమాజంలో గౌరవ ప్రదమైన హోదాల్లో ఉన్న సంపన్నులను, పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్న పారిశ్రామిక వేత్తలను అరెస్టు చేస్తున్నారని వాపోతున్నారు. వీళ్ళంతా ఇప్పుడు విచారణలో ఉన్న ఈ పెద్దమనుషులు ఈ రాష్ట్రంలో వేలాది కుటుంబాల్లో విధ్వంసం స్తుష్టించారన్న సంగతి దాచిపెడుతున్నారు. వాళ్ళ భూదాహానికి పాలమూరు జిల్లా పోలేపల్లి పేద రైతులతో సహా లక్షలాది జీవితాలు చిందర వందరైన సంగతి మరిచిపోతున్నారు. ప్రజల పోట్టలుగొట్టి పెట్టుబడులు పెట్టే ఇటువంటి పారిశ్రామిక వేత్తలేనా మనకు కావాల్సింది ఆన్న విషయాన్ని ఏ ఒక్కరూ ప్రస్తావించక పోవడం మన సంకుచిత అభివృద్ధి ఆకాంక్షకు పరాకాష్ట. ఇప్పుడు వాన్పిక్ ఒప్పందాన్ని రద్దుచేసి ఆ భూములను తిరిగి అక్కడి రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అలాగే ఏమార్, పోలేపల్లి మొదలు చంద్ర బాబు హయాం నుంచి రాజశేఖర్ రెడ్డి రాజ్యందాకా సాగిన భూ పందేరాలన్నిటి మీదా విచారణ జరగాలి. ఇప్పుడు కోస్తాలో మొదలవుతున్నావాన్పిక్ భూస్వాధీన పోరాటం తెలంగాణా ఉద్యమానికి కూడా ఒక మోడల్ కావాలి. అక్కడైనా ఇక్కడయినా ఆక్రమణ దారుడు ఒకడే! లంకోహిల్ల్స్ , ఏమార్ , పోలేపల్లి అన్నీ అక్రమాలేనని విచారణలో తేలుతున్నది. వీటి మీద తెలంగాణా వాదులు దృష్టిపెట్టాలి. అక్రమంగా తీసుకున్న భూములన్నీ ప్రజలకు చెందాలి. ప్రజల ఆమోదంతోనే భూకేటాయింపులు జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం ఉన్నట్టు లెక్ఖ, లేకపోతే మన మాటలు, రాజకీయాలు, ఉద్యమాలు అన్నీ క్విడ్-ప్రొ-కో అనే భావించాల్సి ఉంటుంది

శుక్రవారం, మే 11, 2012

తెలంగాణ గళంలో కాషాయ గరళం!



బీజేపీ గురించి తరం నాయకుల్లో చాలామంది కంటే డా. దాసోజుశ్రావణ్కే ఎక్కువగా తెలుసు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరోలో క్రియాశీలంగా ఉన్న యువనేత పూర్వాక్షిశమం లో కరుడుగట్టిన కాషాయ కరసేవకుడు. శ్రావణ్ మాతో పాటు ఉస్మానియా యూనివర్సిటిలో చదువుతున్నప్పుడు అఖిల ఏబీవీపీ మిలిటెంట్ నాయకుల్లో ముఖ్యుడు.ఆయన ఏబీవీపీనుంచి ఆర్ట్స్కాలేజీ విద్యార్థిసంఘం ప్రధానకార్యదర్శిగా గెలుపొందారు. 1985-90 మధ్యకాలంలో కొన్ని వామపక్ష విద్యార్ధిసంఘాలను ప్రభుత్వం నిషేధించింది. మరికొన్నిటిని నిర్మూలించడానికి ఏబీవీపీ ప్రయత్నించేది. వామపక్ష, దళిత బహుజన విద్యార్ధి సంఘాలు, భావజాలంతో పనిచేసే విద్యార్థుల మీద ఏబీవీపీ ఆధ్వర్యం లో అనేక దాడులు జరిగేవి. ఆయనకు ఆకాలంలో అగ్రక్షిశేణి బీజేపీ నాయకులతో సన్నిహిత సంబంధాలుండేవి.

అదే శ్రావణ్ ఇప్పుడు బీజేపీ రాజకీయాలను ఏవగించుకుంటున్నాడు. మతతత్వ, ప్రాంతీయ అవకాశవాద పార్టీ అని, నిండుకుండ లాంటి తెలంగాణ ఉద్యమంలో విషపుచుక్క అని బీజేపీపై విరుచుకుపడ్డారు. శ్రావణ్ మాటలను రాజకీయ ప్రేలాపనలుగా కొట్టిపారేయలేము. ఎందుకంటే ఆయన సంప్రదాయ రాజకీయ వాదికాదు. ఎంబీఏతో పాటు ఎంఏ, పీహెచ్డీ చేసిన శ్రావణ్ కొంతకాలం ఆధ్యాపకుడుగా ఉన్నా డు. తరువాత ప్రముఖ కార్పొరేట్ కంపనీలలో పనిచేసేవాడు.సామాజిక న్యాయం నినాదానికి ఆకర్షితుడై ప్రజారాజ్యంలో చేరిన శ్రావణ్ ఇప్పుడు తెలంగాణాతోనే అది సాధ్యమని నమ్ముతున్నాడు. నమ్మకంతోనే ఎన్ని ఒడిదుడుకులున్నా టీఆర్ఎస్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. బీజేపీ కుల, మతవాద ధోరణి తెలంగాణవాదానికీ, సామాజిక న్యాయానికి పెనుముప్పుగా మారిందని అంటున్నారు.ఆయనొక్కరే కాదు, జాతీయవాద పార్టీగా బీజేపీని అభిమానిస్తోన్న వాళ్ళు, సంఘ్ పరివార్ పట్ల గౌరవం ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ రాజకీయ ఎత్తుగడలపట్ల ఆందోళన చెందుతున్నారు. ఇది బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు, ఆయన శిష్యుడు కిషన్రెడ్డి రాజేసిన కుంపటి అని వారి వాదన. కుంపటి ఇప్పుడు తెలంగాణ జేఏసీలో పొగపెడుతోంది. ఇది చాలా మంది తెలంగాణ వాదులను కలవరపెడుతోంది.

బీజేపీ పన్నెండేళ్ళ క్రితం కాకినాడలో కాగితంమీద రాసి పెట్టడం మిన హా సంస్థాగతంగా తెలంగాణ కోసం ఎన్నడూ పోరాడింది లేదు. 2004 దాకా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్నడూ తెలంగాణ ఊసే ఎత్తలేదు. తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా పార్టీ అగ్రనాయకత్వం భావించింది.తెలంగాణ ఉద్యమం 2009 లో ఊపందుకున్న తరువాత పార్టీ గుంపులో గోవింద అన్నట్టుగా ఉద్యమానికి జైకొట్టింది. అడపాదడపా పార్టీ శ్రేణులను బహిరంగ సభలకు తరలించి బలోపేతం అయ్యే ప్రయత్నాలు చేసింది. బీజేపీకి ఎన్నడూలేని జనామోదం లభించడానికి పార్టీ సొంత ఎజెండా పక్కకుపెట్టి తెలంగాణ జేఏసీలో చేరడం కారణమయింది. తెలంగాణ జేఏసీకి ఉన్న విశ్వసనీయత మొత్తం తెలంగాణ సమాజాన్ని కులమతాలకు అతీతంగా, రాజకీయ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అందరినీ ఏకం చేయడానికి దోహదపడింది. సిద్ధాంతపరంగా బద్ధ శత్రువులుగా ఉండే నక్సలైటు పార్టీలు, ప్రజాసంఘాలతో బీజేపీ చేతులుకలిపి పనిచేయాల్సిన పరిస్థితి తెచ్చింది. అప్పటిదాకా మతతత్వ రాజకీయాలు నడిపే పార్టీగా ఉన్న బీజేపీ, తెలంగాణ ఉద్యమ పార్టీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

చాలా మంది పార్టీని అంగీకరించే స్థితికి వచ్చారు. కేవలం తెలంగాణ సాధనే తప్ప మరో ఎజెండా లేని నాయకత్వం, దానికోసం సంఘటిత శక్తిగా కదిలిన ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, పౌర సమాజం వెన్నెముకగా ఉంటూ జేఏసీని నిలబెట్టాయి. పార్టీ తెలంగాణ కోసం చిత్తశుద్ధిగా పోరాడుతున్నదని నమ్మడం వల్లే నిజామాబాద్లో డి.శ్రీనివాస్ను కాదని ముస్లింలు కూడా జేఏసీ పై విశ్వాసంతో బీజేపీకి పట్టం కట్టారు. పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మినారాయణ ముస్లిం వీధుల్లో తలపై టోపీ పెట్టుకుని కేసీఆర్, కిషన్డ్డితో కలిసి ఊరేగితే ప్రజలు నిజంగానే నమ్మారు. కానీ జేఏసీ కార్యక్షికమాల్లో, ప్రజా ఉద్యమ క్షేత్రంలో బీజేపీ కదలికలను నిశితంగా గమనించిన వారికి బీజేపీ పట్ల పెద్ద నమ్మకం ఎప్పుడూ లేదు.

బీజేపీ కూడా టీడీపీ లాగే రెండు కళ్ళ సిద్ధాంతాన్నే పాటించింది. పార్టీ తరపున రాజేశ్వర్రావు, విద్యాసాగర్రావు, దత్తావూతేయ, లక్ష్మణ్లాంటి వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడితే కిషన్రెడ్డి మాత్రం వెంకయ్యనాయు డు కనుసన్నల్లో పనిచేస్తూ వచ్చారు. ఉద్యమం ఉధృతంగా ఉన్నరోజుల్లో బీజేపీ ఒకవైపు జేఏసీలో ఉంటూనే కార్యక్షికమాలకు దూరంగా ఉన్న సందర్భాలూ ఉన్నాయి. బతుకమ్మ ఆడడంలో ఆసక్తిగా పాల్గొన్న బీజేపీ శ్రేణులు సహాయ నిరాకరణ, సకలజనుల సమ్మె సందర్భంగా ప్రత్యక్ష కార్యాచరణకు దూరంగా ఉన్నాయి. రైల్రోకో సందర్భంగా టీఆర్ఎస్, టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర నాయకులు అరెస్ట్ అయినప్పుడు బీజేపీ అగ్రనాయకులు ఎక్కడా కనిపించలేదని ఉద్యమాన్ని పరిశీలించిన వారికి అర్థమవుతోంది. అలాగే జేఏసీ పిలుపు మేరకు అందులో భాగస్వామ్య పక్షాల ప్రతినిధులంతా రాజీనామా చేసిన సందర్భంలో కూడా కిషన్డ్డి రాజీనామా చేయలేదు.

జగన్ నిజామాబాద్ వచ్చినప్పుడు ఆయనను నిలదీయాలన్నా, చంద్రబాబును పాలకుర్తి రాకుండా అడ్డుకోవాలన్నా బీజేపీ స్పందించలేదు. పైగా అది తమ విధానం కాదని తప్పించుకున్నది. మహబూబ్నగర్ ఎన్నికలకు ముందు యాత్రచేసే దాకా ఆయన పెద్దగా ఉద్యమంలో లేరు. కనీసం ఉద్యమంలో పాల్గొని కేసుల పాలయిన వారిని విడిపించడంలో, నిరాశతో ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు మనోధైర్యం నింపడంలో పార్టీ నిర్లిప్తతే దీనికి నిదర్శనం. ఆంధ్రాలో జై ఆంధ్రా నినాదంతో ముందుకు వెడతామని చెప్పిన పార్టీ మూడేళ్ళు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది.నిజానికి జై ఆంధ్రా ఆపార్టీ విధానం అయితే ఇప్పటికే అటువంటి నిర్మాణం, కార్యాచరణకు పూనుకుని ఉండాలి. భావ సారూప్యం ఉన్న రాజకీయ సంస్థలు, పౌర సమాజంతో అక్కడ కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుని ఉండాల్సింది. కనీసం అక్కడ ఆంధ్ర రాష్ట్రంకోసం పోరాడుతున్న దళిత బహుజన సంఘాలకు బాసటగా ఉండాల్సింది. కొవ్వూరులో పోటీ చేసి తమ వాదనను వినిపించి ప్రజలను ఆదిశగా చైతన్యవంతులను చేయాల్సింది. ఆప్రాంతంలో తన కులంలో ఆదరణ ఉన్న వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఒక మహాకూటమి ఏర్పాటు చేయాల్సింది.ఇవేవీ పార్టీ చేయలేదు. విషయంలో సీపీఐని, ఆపార్టీ అధినేత నారాయణను అభినందించాలి. ఆయన ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకే నాలుకతో మాట్లాడారు. జేఏసీలో భాగం కాకపోయినా అన్ని సందర్భాల్లోనూ సీపీఐని ప్రజలపక్షాన నిలబడేలా చూశారు. ఇలాంటి విమర్శలు వచ్చిన ప్రతిసారీ బీజేపీ సుష్మాస్వరాజ్ పార్లమెంటు ప్రసంగాన్ని గురించి చెపుతుంటారు.

అది నిజమే, ఆమెకు స్పీకర్ అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ సమస్యను అద్భుతంగా ఆవిష్కరించి అందరినీ ఆకట్టుకున్నది. అందు కే ఆమె తెలంగాణ ప్రజలకు దగ్గర కాగలిగారు. కానీ అన్నా హజారే అవినీతి అజెండాకోసం నెలలతరబడి పార్లమెంటు జరుగకుండా అడ్డుకున్న పార్టీ తెలంగాణ కోసం నిరవధికంగా పార్లమెంటును ఎందుకు స్తంభింప చేయలేక పోయింది? బీజేపీ ఎంపీల్లో వందమంది ఒక్కసారిగా లేచి నిలబడితే నిజంగానే ప్రభుత్వానికి ముచ్చెమటలు పడతాయి. కానీ ఆపార్టీ అలా చేయలేదు. 2014 దాకా చేయదు కూడా! ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలలాగే సమస్య 2014 దాకా మిగిలి ఉండాలని కోరుకుంటోంది. 2014ఎన్నికల్లో తెలంగాణలోని అన్నిస్థానాల్లోఒంటరిగానే పోటీ చేస్తాం అని పార్టీ నేత కిషన్డ్డి ప్రకటించారు. మహబూబ్నగర్ విజయం తరువాత ఆయనలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది.నిజానికి అప్పటినుంచే పార్టీ తప్పటడుగులు మొదలయ్యాయి. మహబూబ్నగర్ గెలుపు పూర్తిగా తనదేనని బీజేపీ భ్రమ పడుతున్నది. మహబూబ్నగర్లో బీజేపీ బలం కన్నా ఎన్నం శ్రీనివాసడ్డికి ఉన్న బలగం ఎక్కువ ప్రభావం చూపింది. శ్రీనివాసడ్డి పోటీ చేసే నాటికి ఆయనకు బీజేపీ సభ్యత్వం కూడా లేదు. ఆయన కరుడుగట్టిన తెలంగాణావాది. కేంద్రప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో చేరి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. కేసీఆర్తో విభేదించి బయటకు వెళ్ళినా పార్టీ శ్రేణులతో సాన్నిహిత్యం కొనసాగిం చారు. టీఆర్ఎస్ పట్ల అక్కడక్కడా ఉన్న అసంతృప్తిని కూడా అనుకూలంగా మలుచుకున్నారు.

ఆయనకు అక్కడ సామాజికంగా పెద్ద బలగమే ఉన్నది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న ఎన్నంను బీజేపీఅభ్యర్థిగా ఎంచుకుంది. ఇదే మహబూబ్నగర్ జేఏసీ రెండుగా చీలిపోవడానికి కారణం అయింది. అక్కడి జేఏసీలో వామపక్ష భావాలున్న విద్యావంతులు ఉన్నట్టే ఆధిపత్య కులరాజకీయాలు నడిపే వాళ్ళూ ఉన్నారు. బీజేపీ శ్రీనివాసరెడ్డి బలంతో పాటు ఆయన కులాన్ని కూడా ఆయుధంగా వాడుకున్నది. అక్కడ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఆయన ఒక్కరే రెడ్డి కావడం కలిసి వచ్చింది. ఇక రెండోది మతం.టీఆర్ఎస్ ముస్లిం అభ్యర్థిని రంగంలో దింపే సరికి బీజేపీ తన పాత మతవాదానికి పదునుపెట్టింది. కాషాయం పులుముకుని కిషన్రెడ్డి కాస్తా లాల్కిషన్ అద్వానీగా మారిపోయా రు. ఎన్నికను ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్తో పోల్చారు.ఆయనకు ముస్లిం సోదరుల్లో రజాకార్లు కనిపించారు. ఎన్నికల్లో గెలిచారు కానీ రెండేళ్లపాటు బీజేపీ నేతలు ఉద్యమంలో ఉంటూ పార్టీకి సమకూర్చిన సరికొత్త ఉదార రూపాన్ని మాత్రం చెరిపేసుకున్నారు. ఇప్పుడు ఆపార్టీ తెలంగాణ సాధనకు, ఉద్యమ సామాజిక న్యాయ ఎజెండాకు భిన్నంగా నడుస్తోంది. అందుకే పరకాలలో మరో శ్రీనివాసడ్డి కోసం గాలిస్తోంది. ఇప్పుడు పార్టీ చిన్నాచితక నేతలు కూడా సకల జనుల సమ్మె విరమణను తప్పుపడుతున్నారు. ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ రాదనే వాదన లేవనెత్తుతున్నారు. శాసనసభకు జరిగే ఉపఎన్నికల్లో జాతీయ పార్టీ అవసరం ఏమిటో అర్థం కాదు. లోక్సభలో 114 మంది సభ్యులున్నా ఏమీ చేయలేకపోతున్న పార్టీ ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీలో నాలుగో సభ్యుడు గెలిస్తే తడాఖా చూపిస్తామని చెప్పడం నమ్మశక్యంగా లేదు. బీజేపీ వైఖరి తెలంగాణవాదుల్లో ఆందోళన కలిగిస్తున్నది. భాగస్వామ్య పార్టీల ఆధిపత్య పోరు జేఏసీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇంతకాలం మీడియా గుసగుసలకే పరిమితమైన విభేదాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. బీజేపీ, టీఆర్ఎస్ మాటల యుద్ధమే దానికి అద్దంపడుతోంది.

మహబూబ్నగర్ లో బీజేపీ ప్రదర్శించిన దూకుడే ఇప్పుడు పరకాలలో టీఆర్ఎస్ ప్రదర్శిస్తున్నది. కచ్చితంగా వరంగల్ జిల్లా టీఆర్ఎస్కు, తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు. మహబూబ్నగర్లో జేఏసీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన బీజేపీ ఇప్పటికైనా పరకాల నుంచి విరమించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిమీదయినా పోటీకి దిగొచ్చు. కానీ జేఏసీలో చేరిన పార్టీలు సమష్టిగా తెలంగాణ కోసం ఉద్యమిస్తామని, ఉద్యమ వ్యతిరేక శక్తులమీద యుద్ధం చేస్తామని చెపుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఒకరిమీద ఒకరు యుద్ధానికి దిగి ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి. ఇంతకాలం తమకు నీడనిచ్చిన చెట్టును తామే నరికేసుకుంటున్నాయి. జేఏసిని రద్దు చేస్తారని, కోదండ రామ్ను చైర్మన్ పదవినుంచి తప్పిస్తారని వార్తాకథనాలు వ్యాపిస్తున్నాయి. జేఏసీ అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిఫలించే వేదిక. దాన్ని రద్దు చేయడమంటే తెలంగాణ ఉద్యమాన్ని రద్దు చేయడమే. హక్కు ఒక్కరికీ ఉండదు.

సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నా తెలంగాణ సమష్టి, జన ఆకాంక్షకు అధికారిక ప్రతినిధిగా నిలబడ్డ వ్యక్తి కోదండ రామ్. ఆయన జేఏసీ ఏర్పడ్డాక ఉద్యమంలోకి వచ్చిన వ్యక్తికాదు. మలిదశ ఉద్యమానికి పునాది వేసిన వారిలో ఒకరు. కీలకమైన సమయంలో ఉద్యమ రథానికి సారధిగా ఉన్న కోదండరామ్ను తొలగించే అధికారం కూడా ఎవరికీ లేదు. పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు జేఏసీ సూచన మేరకు నడుచుకోవాలి. లేదంటే ఎవరిదారి వాళ్ళు చూసుకోవాలి. ఉద్యమాన్ని విషతుల్యం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు

శుక్రవారం, ఏప్రిల్ 27, 2012

గాంధీ, అంబేద్కర్, రాజ్యాంగ వ్యవస్థ


 గాంధీ, అంబేద్కర్, రాజ్యాంగ  వ్యవస్థ 


ద్యమాలు చాలా విషయాల పట్ల మన అవగాహనను పడునేక్కిస్తాయి. అపోహలను తొలగిస్తాయి. వాస్తవాలను అర్థం చేయిస్తాయి. అదే ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది. తెలంగాణా ప్రజలు ఉన్నట్టుండి ఇప్పుడు తమ పెద్దలందరినీ పేరుపేరునా తలుచుకున్తున్నారు. ఒక అలిశెట్టి ప్రభాకర్ ను, ఒక సాహూను వారి మిత్రులు స్మరించు కున్నట్టే  కొమురం భీమ్ జయంతిని ఉస్మానియా యూనివర్సిటిలో విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. నాలుగు దశాబ్దాల తరువాత ఆనాటి తెలంగాణా యువతరం కథానాయకుడు జార్జి రెడ్డిని మళ్ళీ జనంలోకి తెచ్చి యువతరానికి వీరులంటే ఎలావుంటారో పరిచయం చేసారు. అదేవిధంగా ఈ సారి డా. అంబేద్కర్ ను కూడా స్మరించుకున్నారు.  గత రెండేళ్ళ నిరంతర పోరాటం అంబేద్కర్ గురించిన అవగాహనను పెంచింది.  అంబేద్కర్ జయంతి రోజు ట్యాంక్ బండ్ పరిసరాలు మరో గణేష్ నిమజ్జనాన్ని గుర్తుకు తెచ్చింది. అది ప్రతి ఏడాదీ ఉన్నదే అయినా ఈ సారి హైదరాబాద్ లో అంబేద్కర్ జయంతి జాతరను తలపించింది. దానికి తెలంగాణా వాదం కూడా ఒక కారణమని అనుకోవచ్చు. అంబేద్కర్ ఆంటే కేవలం దళితుల నాయకుడు మాత్రమే ఆన్న ప్రచారం, ఆయన బతికున్న కాలంలోనే మొదలై ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఆయనను చదువుతున్నవాళ్ళు ఆ ఆలోచనలనుంచి బయటపడుతున్నారు. అందులో తెలంగాణా ప్రజానీకం కూడా ఉండడం ఒక మంచి పరిణామం. 


తెలంగాణా ఉద్యమం వల్ల ప్రజలకు కొద్దో గొప్పో రాజ్యాంగ పరిజ్ఞానం కూడా అబ్బింది. ఇప్పుడు మన ఊళ్ళల్లో మూడో తరగతి చదివే పిల్లలకు కూడా రాజ్యాంగంలోని మూడవ ఆర్టికల్ లో ఏముందో తెలిసిపోయింది.  అంబేద్కర్ చిన్న రాష్ట్రాల గురించి ఏమన్నాడో వాళ్ళు చెప్పేస్తున్నారు.  ఈ అవగాహన  వల్లే ప్రజలు ఇంకా రాజ్యాంగం మీద చట్టసభల  నమ్మకంతో ప్రత్యేక  రాష్ట్రం  కోసం అలసటలేని పోరాటం చేస్తున్నారు. అది అంబేద్కర్ ఆచరణలో చూపిన  మార్గం. ఆ మార్గాన్నే ఇప్పుడు తెలంగాణా ఉద్యమం అనుసరిస్తోంది. బహుశ అదే శాసన సభ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించాలనే డిమాండ్ కు కారణం అయ్యింది. ఈ డిమాండ్ ను తెలంగాణా వాదులు తెరమీదికి తేవడానికి   ఆయన పట్ల తెలంగాణా ప్రజలకు ఏర్పడ్డ గురి కూడా ఒక కారణం కావొచ్చు. విగ్రహాలతో సమాజంలో మహనీయుల పట్ల గౌరవం పెరుగుతుందన్న భ్రమలు నాకేమీ లేకపోయినా తెలంగాణా ఉద్యమం విగ్రహాలను ఆత్మ గౌరవ ప్రతీకలుగా మార్చివేసిన సందర్భంలో అంబేద్కర్ విగ్రహం కోసం డిమాండ్ చేయడం న్యాయమైనదని నమ్ముతున్నాను.


అయితే  రాజకీయ నాయకులు చెబుతున్నట్టుగా  అంబేద్కర్ కేవలం దళిత వర్గాలకే  నాయకుడని నేననుకోను. ఆయన తరతరాలుగా దాస్యంలో మగ్గిన భారతీయ మహిళలకు విముక్తిని ప్రసాదించిన దార్శనికుడు.  ఈ దేశంలో పుట్టిన ప్రతి శిశువుకూ నిర్భంద ఉచిత విద్య ఉండాలని వాదించిన మేధావి. కార్మికులకు కనీస హక్కులున్దాలని, వాటి సాధనకోసం సంఘటితమయ్యే అవకాశాలు ఉండాలని చట్టాన్ని రూపొందించిన శ్రామిక వర్గ పక్షపాతి. భారదేశంలో సమానత్వం రావాలంటే భూములను జాతీయం చేసి వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలని ప్రతిపాదించిన ధీశాలి. భారత దేశం బుద్ధుడు ప్రవచించిన సమానత్వం, సౌభ్రాతృత్వం, శాంతి సౌభాగ్యాలతో సమసమాజంగా విలసిల్లాలని కలలుగన్న స్వాప్నికుడు. ఆ కలలను నిజం చేసేందుకు తన అనుభవాన్ని, అధ్యయనాన్ని కలబోసి సమగ్రమైన రాజ్యాంగాన్ని అందించి ఇచ్చిన శాసనకర్త!   ఇలా చెప్పుకుంటూ పోతే అంబేద్కర్ స్పృశించని రంగమేదీ మిగలదు.   ఈ దేశంకోసం, దేశంలోని ప్రజలకోసం, భవిష్యతు కోసం అంబేద్కర్ అంతగా శ్రమించి, రాజ్యాంగ శాసన వ్యవస్థలను ప్రభావితం చేసిన  నాయకుడు  ఇంకొకరు పుట్టలేదు. తన నలభయ్యేళ్ళ రాజకీయ జీవితంలో ఇరవయ్యేళ్ళు గతాన్ని సవరించడానికి మరో ఇరవయ్యేళ్ళు భవిష్యత్తును నిర్మించడానికి ఆయన వెచ్చించారు.  అంబేద్కర్  ఈ దేశపు రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఆ రాజ్యాంగ వ్యవస్థకు ప్రతిరూపమైన చట్టసభల ముందు అంబేద్కర్ విగ్రహం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకంటే ఇప్పుడున్న చట్ట సభలైన    పార్లమెంటు, శాసన సభల రూపురేఖలు, విధివిధానాలు రూపొందించింది ఆయనే కాబట్టి. ఒక రకంగా ఈ దేశ చట్టసభలు అంబేద్కర్ నిర్మించిన శాసన సౌధాలు. వాటిముందు అసలైతే ఒక్క అంబేద్కర్ విగ్రహం మాత్రమే ఉండాలి!



కానీ హైదరాబాద్ నగరపు నడిబొడ్డున ఉన్న ఆంధ్ర్తప్రదేశ్ శాసన సభ ముందు  గంభీర మౌనముద్రలో కూర్చున్న గాంధీ విగ్రహం కనిపిస్తుంది.  ఇరవైరెండు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1988  లో ఏర్పాటు చేసారు. దీనికోసం ఆ కాలంలో 55 లక్షల రూపాయలు  ఖర్చుచేశారు. ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా  గాంధీకి శాసన సభకు ఉన్న సంబంధం ఏమిటి అన్న అనుమానం కలుగుతుంది. రాజ్యాంగానికి, శాసన వ్యవస్థకు, చట్టబద్ధ పరిపాలనకు రూప శిల్పి  అయిన అంబేద్కర్ విగ్రహాన్ని శాసన సభ ఆవరణలో పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తోన్న వ్యతిరేకత చూసిన తరువాత ఈ ప్రశ్న లేవనెత్తక  తప్పడం లేదు. హైదరాబాద్ తో పరిచయంగానీ, ఈ ప్రాంతంతో సంబంధం గానీ లేని అనేక మంది విగ్రహాలు టాంక్ బండ్ మీద ఉన్నట్టే చట్టసభాలతో పరిచయం గానీ, వాటిల్లో ప్రవేశానుభావంగానీ కనీసం చట్టలపత్ల్అ గౌరవం గానీ లేని గాంధీ విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఉండడంలో ఔచిత్యం అర్థం కాదు.గాంధీజీ  ఖచ్చితంగా గొప్ప నాయకుడే, కాదనలేం. స్వాతంత్ర పోరాటంలో ఆయనది కీలకమైన పాత్ర, జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తుల్లో ఆయన ముఖ్యులు. భారత దేశం నలుమూలలా పర్యటించి జాతీయ భావాన్ని విస్తరించడంలో గాంధీజీ  పాత్ర విస్మరించ వీలు లేనిది. అందుకే ఆయనను జాతిపిత అన్నారు. ఎవరు ఒపుకున్న ఒప్పుకోకున్నా ఆయన పేరుమీద దేశంలో అనేక వీధులు, వాడలు, రహదారులు మొదలు మహానగరాలే వెలిశాయి. అలాగే ఆయన విగ్రహాలు వీధివీధినా కనిపిస్తాయి. కానీ గాంధీ గారికి శాసన వ్యవస్థకు ఎలాంటి సంబంధమూ లేదు. అసలు ఆయనకు ఇప్పుడున్నరాజ్యాంగ వ్యవస్థ పట్ల గౌరవం కూడా లేదు.  గాంధీ ఇప్పటి పార్లమెంటరి ప్రజాస్వామ్యం  కంటే ధర్మకర్తల్లాంటి పాలకులుండే ఆదర్శవాద గ్రామ స్వరాజ్య నమూనాను కలగన్నాడు. ఆ రకమైన పాలనా వ్యవస్థ ఉండాలని మాత్రమే కోరుకున్నాడు. కానీ అప్పటి గ్రామీణ వ్యవస్థ కొందరికే స్వరాజ్యం లా ఉండేది. అనేక అసమానతల నడుమ, కుల, మత, ఆధిపత్య , భూస్వామ్య ధోరణులతో నిండి ఉంది అనేక మందికి అదొక నరక ప్రాయమైన వ్యవస్థగా ఉండేది. దళితులు, ఇతర పీడిత వర్గాలు, సేవా కులాలు, వృత్తులకు కనీస గౌరవంలేని సనాతన విలువలతో ఉండేది.


డా. అంబేద్కర్  అటువంటి వ్యవస్థ స్థానంలో స్వేచ్చ తో పాటు సమ భావన, సౌభ్రాతృత్వం సాధించే దిశగా నూతన  భారత రాజ్యాంన్గాన్ని రూపొందించారు. పాత సాంప్రదాయిక విలువల స్థానంలో నూతన లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగం ద్వారా పునాదులు వేసే ప్రయత్నం చేసారు. ప్రభుత్వం ఎలా నడవాలి, పౌరులు ఎలా నడుచుకోవాలో రాజ్యాంగం ఇర్దేశించింది. ఒక మనిషికి ఒక ఓటు, ఒకే విలువ అని చెప్పడం ద్వారా సామాజిక ఆర్ధిక అసమానతలు, అంతస్తుల అంతరాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, అధికారాలు ఉండే వ్యవస్థకోసం రాజ్యాంగం కృషి చేసింది. భారత ప్రజలందరికీ సమానమైన, సముచితమైన  ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం రాజ్యాంగం చేసింది. గాంధీ గ్రామీణ వ్యవస్థలో పెత్తందారీ  కర్రపెత్తనం ఉండాలనుకున్నాడు కానీ సార్వత్రిక ఓటింగు ను సమర్థించలేదు. ఆయన పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడ్డాడు. ప్రజాస్వామ్యం గ్రామంలో పెద్దమనుషులను ఎన్నుకుంటే, ఆ పెద్దమనుషులు పై స్థాయి పాలకులను ఎన్నుకోవాలని కోరుకున్నాడు. కానీ ఆ పెత్తందారీ వ్యవస్థను తుతునియలు చేసే సాధనంగా డా. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మలిచాడు.  రాజ్యాంగం అమాలౌతున్నడా లేదా  అన్నది వేరే చర్చ కానీ ఇప్పటికీ ప్రభుత్వాలకు, ఆ ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేసి నడిపించేది రాజ్యాంగమే! రాజ్యాంగ రచన కోసం డాక్టర్ అంబేద్కర్ దాదాపు మూడు సంవత్సరాల తన విలువైన జీవిత కాలాన్ని వెచ్చించాడు. రాజ్యాంగ రచనా సంఘ సారధిగా ఆయన రాత్రింబవళ్ళు కృషి చేసారు. వివిధ దేశాల రాజ్యన్గాలను ప్రరిశీలించి మనదేశానికి అవసరమైన పాలనా సూత్రాలను రాజ్యాంగ రచనా సంఘం ముందు చర్చకు పెట్టారు. అనేక విమర్శలు, అవమానాలు  అధిగమించి మొత్తంగా భావితరాలకు దిక్సూచిగా నిలువగలిగే ఒక అత్యుతమ రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించారు. కానీ గాంధీ గారు నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ ఆయన వారసులమని చెప్పుకునే వారు ఇప్పుడు దాన్నొక చిత్తుకాగితంగా మార్చేసారు.


రాజ్యాంగ రచనా కాలంలో గాంధీ గారు బతికే ఉన్నారు, ఆ కాలంలో దేశవ్యాప్తంగా పర్యటించడం, భజనలు, ప్రార్థనా సమావేశాల్లో కాలక్షేపం చేయడం చేసే వారు తప్ప ఏ ఒక్కరోజుకూడా రాజ్యాంగ రచనా సంఘానికి తన సలహాలో  సూచనలో చేయలేదు. గాంధీ గారు రాజ్యాంగం ఎలా ఉండాలో తెలియజేస్తూ 1946 లో కాంగ్రెస్ పార్టీకి ఒక నివేదిక ఇచ్చారని రెండో సారి   ఆయన హత్యకు గురవడానికి ఒకరోజు ముందు కూడా నూతన రాజ్యాంగానికి సంబంధించి ఒక ముసాయిదా రూపొందించారని చెపుతారు. అందులో కేంద్రీకృత పార్లమెంటరి ప్రజాస్వామ్యం కాకుండా , గ్రామ స్వరాజ్యం దిశగా వికేంద్రీకరణ జరగాలని, కాంగ్రెస్ పార్టీని రద్దుచేసి దానినొక సేవా సంస్థగా మార్చివేయాలని,  ఆ సంస్థద్వారా దేశవ్యాప్తంగా పంచాయతీలను అనుసంధానం చేయాలని సూచించారని అంటారు. అదే జరిగితే జవహార్ లాల్ నెహ్రూ అప్పుడు ప్రధాని కాలేక పోయేవారు. సోనియా గాంధీకి ఇప్పుడు తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానిని చేయలేక పోయానన్న చింత ఉండేది కాదు!  అది వేరే సంగతి!!. 

డా. అంబేద్కర్ శాసనం ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్రజలకు అనుకూలంగా మలచాలని ప్రయత్నించాడు.  పెత్తందారీ ధర్మకర్తలకంటే చట్టం, న్యాయం మాత్రమే ధర్మాన్ని నిలబెడుతుందని నమ్మాడు. ముఖ్యంగా అప్పటి బ్రిటీష్ పాలకుల మీద తన ఒత్తిడిని పెంచి   పాలనా వ్యవస్థను ప్రజాస్వామ్యీకరించే ప్రయత్నం చేసాడు. బ్రిటీష్ వాళ్ళు పరిపాలిస్తోన్న కాలంలో అప్పటి పాలకులకు ఈ దేశం గురించి, దేశంలోని ప్రజల సమస్యల గురించి, ప్రాధమిక అవసరాల గురించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి, చేయాల్సిన చట్టాల గురించి మొట్టమొదటి సారిగా సమగ్రంగా నివేదించిన వారిలో డా. అంబేద్కర్ ఆద్యుడని చెప్పుకోవాలి. డా. అంబేద్కర్ సమకాలికుల్లో చాలామంది బ్రిటీష్ పాలకుల ప్రాపకంలో పెరిగారు. వాళ్ళ ప్రమేయంతో, వాళ్ళ కొలువులో చేరడానికి వాళ్ళ సొమ్ములతో లండన్ వెళ్లి ఉన్నత చదువులు చదువుకున్నారు. వచ్చాక కొందరు బ్రిటీష్ కొలువులో చేరి పాలకులుగా మారిపోతే  మరికొందరు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలంగా పాల్గొన్నారు తప్ప భారతీయ పరిపాలనా వ్యవస్థను మానవీకరించాలని గానీ, రాజకీయ వ్యవస్థను ప్రజా స్వామ్యీకరించాలని గానీ ఏ ఒక్కరూ ఆలోచించలేదు. ఆ మాటకొస్తే గాంధీ లండన్ లో చదువు పూర్తిచేసుకుని తిరిగిరాగానే దేశం గురించి ఆలోచించలేదు. రాజ్కోట్ కోర్టులో ప్రాక్టీసు మొదలుపెట్టాడు. అది సరిగా నడవక పోయేసరికి దక్షిణాఫ్రికా లో గుజరాతీ షావుకార్ల తరపున వాదించడానికి డర్బన్ వెళ్లి అక్కడే దాదాపు ఇరవై ఏళ్ళకు పైగా ప్రాక్టీసు చేస్తూ స్థిరపడ్డాడు.

అంబేద్కర్ అలా చేయలేదు. దేశీయ పాలకుల సహాయంతో విదేశాలకు వెళ్లి చదువు పూర్తికాగానే తిరిగి  వచ్చిన వెంటనే సామాజిక వ్యవస్థ ప్రక్షాళనకు నడుం కట్టాడు. అందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నాడు. దాదపు ఇరవయ్యేళ్ళ పాటు న్యాయవాదిగా, పాత్రికేయుడిగా,  ప్రొఫెసర్ గా ఉంటూ అనేక ఉద్యమాలను నిర్మించాడు. సమాజంలో పేరుకు పోయిన దురాచారాలను చట్టాలద్వారా రూపుమాప గలమని నమ్మాడు. అందుకోసం బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించి బ్రిటీష్ పాలకులను ఆలోచించే విధంగా చేసాడు.  మొదటిసారిగా 1919 లో అప్పటి బ్రిష్ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన మాంట్-ఫోర్డ్ కమిటీ   అంబేద్కర్ ను సంప్రదించింది. అంటరాని సమాజంలో బొంబాయి రాష్ట్రంలో డిగ్రీ వరకు చదివిన ఒకే ఒక్క వ్యక్తిగా అంబేద్కర్ ను తన ఆలోచనలు చెప్పమని అడిగింది. కమిటీ ముందు ఆయన  ప్రత్యేక నియోజకవర్గాలు, సార్వత్రిక ఓటింగ్ గురించే కాక భారతీయ సమాజంలో ఉన్న అసమానతలు, విద్యావకాశాల ఆవశ్యకత, సాంఘీక సంస్కరణలు, తేవాల్సిన శాసనాల గురించి సమగ్రమైన నివేదిక అందించారు. భారత దేశానికి చట్టాలు చేసేముందు సమాజాన్ని అర్తంచేసుకోవాలన్న ప్రతిపాదన చేసారు.  ఆ తరువాత  1925  లో భారత దేశ ద్రవ్య వినిమయ విధానంలోని సమస్యలను అధ్యయనం చేయడానికి వచ్చిన  రాయల్  కమీషన్ ముందు హాజరై తన ఆలోచనలు  పంచుకున్నాడు. అప్పుడే ఆయన ఉమ్మడి వ్యవసాయం, భూమిశిస్తు విధానం, భూసంస్కరణల   గురించి ప్రతిపాదనలు చేసారు.  అదే కాలంలో ఆయన  బొంబాయిలో చట్టసభలో క్రియాశీలమైన పాత్ర పోషించాడు.

ఆ తరువాత భారతదేశంలో చట్టబద్ధమైన పరిపాలనను అందించే రాజ్యాంగ నిర్మాణం కోసం 1928  లో వచ్చిన సైమన్ కమీషన్ ను బహిష్కరించాలని గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అప్పటికి కాంగెస్ స్వాతత్ర్యం కోసం తీర్మానం చేయలేదు. అయినప్పటికీ కమీషన్ లో భారతీయులకు ప్రాతినిధ్యం లేదని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన లేవదీసింది. అంబేద్కర్ మాత్రం పూనాలో కమీషన్ ముందు హాజరై భారత దేశంలో శాసన రాజ్యాంగ వ్యవస్థ ఎలా ఉండాలో ఒక నివేదిక అందించారు. అందులో సార్వత్రిక ఓటు హక్కుతో పాటు, అస్ప్రుష్యులకు ప్రత్యేక ప్రాదేశిక నియోజక వర్గాల ప్రస్తావనఒకటి. కమీషన్ అంబేద్కర్ సూచనలేవీ పరిగణలోకి తీసుకోక పోవడంతో ఆయన లండన్ లో నిర్వహించిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరై తన వాదనలు వినిపించాడు. దాదాపు అయిదు సంవత్సరాల పాటు పోరాడి అంబేద్కర్ కొద్దో గొప్పో అణగారిన వర్గాలను ప్రజాస్వామ్య శాసన నిర్మాణ వ్యవస్థలో బాగాస్వాములను చేయాలని ప్రయతిన్స్తే గాంధీ దాన్ని అడ్డుకోవడానికి ఎరవాడ జైలులో నిరాహార దీక్షకు దిగి చివరకు ఆ అవకాశాలు అందకుండా చేసాడు. ఈ ఒక్క విషయంలోనే కాదు గాంధీజీ కి తన మీద, తన నాయకత్వం, ఆలోచనల మీద ఉన్న నమ్మకం చట్టాల మీద ఎన్నడూ లేదు. అనేక సార్లు ఆయన శాసన బద్ధమైన పాలననువ్యతిరేకించాడు.  గాంధీ స్వయంగా శాసనాలను ఉల్లంఘించాడు. శాసనోల్లంఘనకు పిలుపునిచ్చాడు. 1922 - 42 మధ్యకాలంలో గాంధీ జీ  అనేక సార్లు చట్టాలను ఉల్లంఘించి జైలు కు వెళ్ళాడు. ఇదంతా స్వాతంత్రం కోసమే అని మనం సరిపెట్టుకోవచ్చు. కానీ చట్టం ముందర ఆయన మాత్రం దోషిగానే నిలబడ్డారు.

మరోవైపు ఇదే  కాలంలో ఒకవైపు సమాజాన్నిమానవీకరించే ప్రయత్నం చేస్తూనే అంబేద్కర్ భారత దేశంలో రాజ్యాంగబద్ధమైన పాలనకోసం, శాసన వ్యవస్థకోసం ఎనలేని కృషి చేసారు. బ్రిటీష్ ప్రభుత్వం భారత దేశంలో రాజ్యాంగ సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సబ్యుడిగా 1932 -34 మధ్య కాలంలో విశేషమైన సేవలు అందించి, భారత దేశంలో ప్రజాస్వామిక పాలనకు బ్రిటీష్ కాలంలోనే బీజాలు వేసారు. అదే 1935 లో భారత ప్రభుత్వ చట్టం పేరుతొ  భారత ప్రభుత్వ పాలనా వ్యవస్థకు స్వయంప్రతిపత్తి కల్పించి స్వతంత్ర అధికారాలను ఇచ్చింది. దేశంలో చట్టబద్ధ పాలనకు ఆస్కారం కలిగించింది. 1941 లో బ్రిటిష్ ప్రభుత్వంలో రక్షణ సలహా మండలి సభ్యుడిగా, వైస్రాయ్ కౌన్సిల్ లో లేబర్ మెంబర్ గా ఆయన అనేక చట్టాలకు రూపకల్పన చేసారు. అప్పటి భారత దేశంలో కార్మిక సంఘాల చట్టాన్ని  రూపొందించింది కూడా డా. అంబేడ్కరేనన్న సంగతి చాల మందికి తెలియక పోవచ్చు. ఆ తరువాత భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర, ఆ తరువాత నెహ్రూ ఆహ్వానం మేరకు భారతదేశ తొలి న్యాయశాఖా మంత్ర్హిగా ఆయన కృషి పార్లమెంటరి వ్యవస్థకు వన్నె తెచ్చే విధంగా ఉండింది. భారత దేశంలోని మహిళలను మనుషులుగా గుర్తించి వాళ్ళ హక్కులకు పూచీగా నిలబడ్డ హిందూ కోడ్ బిల్ ను రూపొందించిన అంబేద్కర్ చివరకు ఆ శాసనాన్ని గౌరవించని ఆధిపత్య ధోరణులకు నిరసనగా పదవిని వదులుకుని చట్టసభల నుంచి పూర్తిగా వైదొలిగారు. 
  
అంబేద్కర్ జీవితంలో ఎప్పుడూ విగ్రహాలను నమ్మలేదు. విగ్రహారాధననే వద్దనుకున్నాడు. కానీ తన విగ్రహాలే భవిష్యత్తులో  చైతన్య ప్రతీకలుగా నిలబడతాయని, కోట్లాది మందిని  ఆత్మ గౌరవంతో నిలబెడతాయని ఆయన ఊహించి ఉండదు. డా. అంబేద్కర్ జీవితం, పోరాటం, ఆదర్శాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అంబేద్కర్ ను గుండెల్లో నిలుపుకోవడానికి, ఆయన ఆశయాలను చిరస్థాయిగా, సజీవంగా నిలబెట్టడానికి ఇప్పుడు దేశంలో కోట్లాది మంది సిద్ధంగా ఉన్నారు. అందులో ఇప్పుడు తెలంగాణా ప్రజలు కూడా కులమతాలకు అతీతంగా ఆ జాబితాలో చేరిపోయారు. ఆయన విగ్రహాలు పార్లమెంటు మొదలు గ్రామ సచివాలయం దాకా అన్ని రాజ్యాంగ వ్యవస్థల ముందు ఉండాలని కోరుకోవడం న్యాయమయిందే.  కానీ ఆ చట్ట సభలే ఇప్పుడు రాజ్యాంగ లక్షాలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నాయి. చట్ట వ్యతిరేక శక్తులకు, అసాంఘీక కార్యకలాపాలకు కేంద్రాలయిపోతున్నాయి. వాటిముందు వేలెత్తి నిలదీసే అంబేద్కర్ లాంటి ఆదర్శ మూర్తి కంటే మౌనముద్రలో కూర్చుండే ఉత్సవ విగ్రహాలు ఉండడమే మంచిదేమో!  

ప్రొ. ఘంటా చక్రపాణి 
రచయిత సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు  
  ఈ మెయిల్ : ghantapatham@gmail.com