భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ -కృతిమ మేధో సదస్సు- ఒక ప్రయివేటు యూనివర్సిటీ పటాటోపం మూలంగా అబాసు పాలయ్యింది. భారత దేశ సాంకేతిక కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికి దేశీయ AI వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లడానికి,సాంకేతిక స్వయం సమృద్ధి, సార్వభౌమాధికారాన్ని, సమగ్రత జోడించి ప్రపంచంలో పోటీపడగలిగే AI వ్యవస్థను నిర్మించడానికి 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్'పేరుతో భారత ప్రభుత్వం (ఫిబ్రవరి 16-21, తేదీల మధ్య) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సదస్సు నిర్వహిస్తోంది. కానీఆ లక్షణానికి భిన్నంగా ఢిల్లీ పక్కనే నోయిడా లో ఉన్న గోల్ గో టియాస్ యూనివర్సిటీ (Galgotias University') చైనా తయారు రోబోటిక్ శునకాన్ని తమ సృష్టిగా చూపించడం వల్ల ఈ వివాదం తలెత్తింది. ఇప్పుడు మన గ్లోబల్ సమ్మిట్ పక్కకు పోయి ఆ చైనా లోకల్ కుక్క ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
నిజానికి
ఈ శునక రోబోను నేను గతే ఏడాది ఆగస్టు లో కలిసాను. దానితో కాసేపు
ఆడుకున్నాను. అలాగే పాఠాలు బోధించే రోబోలతో, ట్యూషన్స్ చెప్పే పొట్టి
రోబోలతో, మనుషులకు సహాయపడే హుమానాయిడ్ రోబోలతో కూడా కాసేపు గడిపాను. పోయిన
ఏడాది ఆగస్టు మూడో వారంలో బీజింగ్ స్మార్ట్ ఎడ్యుకేషన్ సదస్సులో ఈ రోబోలు
అందరి దృష్టినీ ఆకర్షించాయి. కొందరు ఎంపిక చేసిన వైస్
ఛాన్సలర్లను ఇంటర్నేషనల్ అసోసియేషన్ అఫ్ యూనివర్సిటీస్ (IAU) రెండు రోజుల
పాటు AI పరిశోధన కేంద్రాలు ప్రధానంగా ఆ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న
బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ క్యాంపస్ టూర్ నిర్వహించింది. అందులో భాగంగా ఈ
రోబోలను కలవడం జరిగింది.
Galgotias University' తనదని చెప్పుకున్న ఈ Unitree Go2 నాలుగు కాళ్లతో నడిచే డాగ్ రోబోలు చైనాలో అతి సాధారణం. అమెజాన్ తో సహా అన్ని ఆన్లైన్ మార్కెట్లలో లక్ష రూపాయలనుంచి ఐదు లక్షల వరకు అందుబాటులో ఉన్న ఈ రోబోలు మనిషికి అన్ని పనుల్లో తోడుగా రక్షణగా ఉంటాయి. ఈ రోబో మేము ఆ పరిశోధన, తయారీ సంస్థకు వెళ్ళినప్పుడు మమ్మల్ని కుక్కలాగే స్వాగతం చెప్పింది. పలుకరించింది. నమస్కారం చెప్పడం, చేతులు అందించి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆనందంతో గంతులేయడం ఉద్వేగంతో కింద పది దొర్లడం వంటి పెంపుడు కుక్కలు చేసే అన్ని పనులు చేసింది. ఇవి మార్నింగ్ వాక్ లో మనిషికి తోడుగా వెళతాయి, అలాగే కాపలా ఉంటాయి.
ఆటోమొబైల్
ఫ్యాక్టరీలలో ప్రమాదకరమైన వెల్డింగ్, పెయింటింగ్ తో పాటు ఇప్పుడు మొత్తం
కార్ల తయారీ అంతా రోబో లే చేస్తున్నాయి. భారీ పరిశ్రమల్లో భారమైన పనులు,
ప్రమాదకర పనులు రోబో లే చేస్తున్నారు.దీనితో సహజంగానే ఉత్పత్తి వేగం
పెరుగుతుంది, మానవ తప్పిదాలు తగ్గుతాయి, నాణ్యత మెరుగుపడుతుంది. ఇప్పుడు
కొన్ని రోజులు పెట్టె పనిని కొన్ని గంటల్లో, నిమిషాల్లో చేసి
పెడుతున్నాయని అక్కడి స్టాల్ నిర్వాహకుడు చెప్పారు. ఇంతో పనులు చేయడం,
ఊడ్చడం, తుడవడం, బట్టలు ఉతకడం, చివరకు బట్టలు కుట్టడం, టైలరింగ్ వంటి
వాటికి కూడా రోబోలు వాడుతున్నారు. ఈ పనుల కోసం చైనా తయారు చేసిన రోబోలు
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి.
చైనా రోబోటిక్స్ రంగంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను మార్చుతున్నాయి. పరిశ్రమల నుంచి సేవల వరకు, విద్య నుంచి వృద్ధుల సంరక్షణ వరకు—ప్రతి రంగంలో రోబోలు చైనాకి కొత్త వేగం, కొత్త సామర్థ్యం తో దూసుకు వెళ్తోంది. చైనా—ప్రపంచ రోబోట్ల ఫ్యాక్టరీగా మారింది. ప్రతి ఏడాది ఆరు నుంచి ఏడు లక్షల రోబోలను చైనా తయారు చేస్తోంది. ఇది ప్రపంచ రోబోల ఉత్పత్తిలో 50 శాతంకంటే ఎక్కువ, అలాగే వినియోగంలో కూడా. రోబోటిక్ వాణిజ్యంలో చైనా ఏటా 50–60 బిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే దాదాపు ఐదులక్షల కోట్లు సంపాదిస్తోంది. ప్రపంచం మొత్తం మార్కెట్ 108 బిలియన్ డాలర్లు కాగా కాగా, దాంట్లోసగానికంటే ఎక్కువ చైనా వల్లే వస్తోంది. 2030 నాటికి ఈ విలువ 300 బిలియన్ డాలర్లకు పెంచాలని చైనా ఉవ్విళ్లూరుతోంది. దానికి అనుగుణంగా AI లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. పరిశోధనలు చేస్తోంది.సాంకేతిక పరిజ్ఞానాన్ని అవపోసనపట్టి కొత్త ఆవిష్కరణలతో ఒక సాంకేత బానిస శ్రామిక వర్గాన్ని చైనా తయారు చేయబోతోంది.


