గురువారం, జులై 31, 2014

విధానం చెప్పకుండా వితండవాదం!


ఎన్నికల సభల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటో కథ ఒకటి చెప్పేవారు. తెలుగుదేశం పార్టీ తదితర పరాయి వాళ్ళను ఉద్దేశించి తెలంగాణ అస్తిత్వ రాజకీయపార్టీ అయిన టీఆర్ఎస్ను కాదని వేరే పార్టీకి ఓటు వేయడం మన ఆత్మగౌరవాన్ని చులకన చేసుకోవడమే అని చెప్పడానికి కథ చెప్పేవారు. పార్ట్టీలో ఉండడం అన్నా, పార్టీకి ఓట్లు వేయడం అన్నా తమ ఇంట్లో సొంత తల్లిదండ్రుల ఫోటో తొలగించి పక్కింటివాళ్ళ ఫోటో పెట్టుకున్నట్టే అని పిట్టకథ ద్వారా చెప్పేవారు. ఇది చాలామందిని ఆకట్టుకుంది. ఇలాంటి కథలు అనేకం ప్రజలను టీఆర్ఎస్వైపు ఆకర్షించాయి. ప్రజలు నిజంగానే టీఆర్ఎస్ పార్టీని సొంతం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీని ఒక పరాయిపార్టీగా భావించారు. కాబట్టే పార్టీకి హైదరాబాద్ మినహా ఉత్తర-దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సీట్లు సింగిల్ డిపాజిట్ దాటలేదు. పార్టీల నాయకులను ఎన్నుకుంటే వాళ్ళు సామంతులైపోతారు తప్ప స్వతంత్రులుగా ఉండలేరని, వాళ్ళు తెలంగాణ నాయకులుగా ఉండలేరని, ఆంధ్రా నాయకుల అనుచరులుగా మాత్రమే మిగిలిపోతారని ఆయన తన ఉపన్యాసాల్లో పదేపదే చెప్పేవారు. ఇప్పుడు అదే నిజమవుతోంది. టీడీపీ నాయకుల కసరత్తు చూస్తుంటే వాళ్ళు స్పష్టంగా తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా తమ ఆంధ్రా నాయకులకు అండగా నిలబడుతున్నారు. పోలవరం మొదలు ఫీజు రీయింబర్స్మెంటు దాకా విషయం తీసుకున్నా మూడు పార్టీల వైఖరి ఏమిటో, వాళ్ళు ఎవరివైపో అర్థం కాని అయోమయం తెలంగాణలో నెలకొన్నది

ప్రజలను తికమకపెట్టడంలో చంద్రబాబు దిట్ట. ఆయన ఒక సమస్య పరిష్కరించడానికి బదులు ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త సమస్యలు సృష్టిస్తుంటాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలమంతా ఇలాంటి ఎత్తులతోనే కాలయాపన చేశారు. ఇప్పుడూ అదే చేయాలని చూస్తున్నాడు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఆయన నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ఆయన తన రాష్ట్రంలో చదువుతున్న పిల్లలతో పాటు తెలంగాణ ప్రాంతంలో చదువుతున్న ఆంధ్రా విద్యార్థుల బకాయీలు కూడా చెల్లించాల్సి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజుల్లో ఒక విడత ఇంకా పెండింగులో ఉన్నది. దీనికి సంబంధించి ప్రైవేటు విద్యాసంస్థల ఒత్తిడి ప్రభుత్వాల మీద ఉంది. ప్రైవేటు కాలేజీల్లో అందరూ కార్పొరేటు వ్యాపారులు కాదు. వారిలో కొందరు నిజాయితీగా దీన్నొక వృత్తిగా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఫీజు బకాయీలు చెల్లించకపోతే కాలేజీలు నడిపించలేమని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేమని కాలేజీలు అంటున్నాయి. కానీ చంద్రబాబు దీన్ని పట్టించుకోవడంలేదు. బకాయీలతో పాటు ఏడాది కాలేజీల్లో చేరేవారికి ఫీజు చెల్లిస్తారో లేదో చెప్పడం లేదు.

తెలంగాణ ప్రభుత్వం విషయంలో స్పష్టంగానే ఉంది. తెలంగాణ విద్యార్థులందరికీ కచ్చితంగా ఫీజులు చెల్లించేందుకు తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పోరుతో ఒక కొత్త విధానాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కానీ చంద్రబాబు మాత్రం ఇంకా ఎటువంటి విధి విధానాలు ప్రకటించలేదు. పాత బకాయిల విషయంలో పెదవి విప్పడం లేదు. ఇదిలాఉంటే ఆయన పార్టీ శాసన సభ్యులు కొందరు సత్వరమే ప్రైవేటు కాలేజీలకు ఇవ్వాల్సి ఉన్న బకాయిలను చెల్లించాలని రోడ్లెక్కారు

బకాయిల వసూలుకు మధ్యవర్తులు, సెటిల్మెంట్లు చేసేవాళ్ళు అవసరంలేదు. కాలేజీ యాజమాన్యాలు నేరుగా ప్రభుత్వ అధికారులతో, కుదరకపోతే రెండు రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రి తో మాట్లాడుకొని వసూలు చేసుకోవచ్చు. అక్కడా సమాధానం రాకపోతే కోర్టుకు వెళ్ళవచ్చు. యాజమాన్యాలు పనిలో ఉన్నాయి కూడా. ఇప్పుడు ఆందోళన లేవదీస్తున్న మధ్యవర్తులు కూడా రెండు ప్రభుత్వాలను కలిసి నిలదీయవచ్చు. కానీ వాళ్ళు చంద్రబాబును పల్లెత్తు మాట అనడం లేదు. ఆంధ్రా సెక్రటేరియట్లో అడుగుపెట్టడం లేదు. టీవీ చానెళ్ళ ముందు, పత్రికల ముందు తెలంగాణ ప్రభుత్వాన్ని తూర్పారపట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇది ఒక్క తెలంగాణ సమస్య మాత్రమే కాదు. ఆంధ్రా కాలేజీల సమస్య కూడా. రెండు ప్రభుత్వాలు ఎవరెవరి విద్యార్థులు ఎంతమంది ఉన్నారో లెక్కలు వేసుకుని చెల్లింపులు చేయాలి. ఆంధ్రాలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల పాత బకాయిలను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలోని ఆంధ్రా విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం చెల్లించాలి. లెక్కలు సాంఘిక సంక్షేమశాఖ దగ్గర ఇప్పటికే ఉన్నాయి. కానీ బాబు గారు లెక్కలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణలో చదువుతున్న విద్యార్థుల్లో ఆంధ్రా నివాస ధృవీకరణ పత్రాలతో నలభై శాతం ఉన్నట్టు తేలడంతో వాళ్లకు బకాయిలు కట్టలేక కుదేలైపోతున్నారు. ఆంధ్రా పిల్లల ఫీజులు కూడా తెలంగాణ ప్రభుత్వమే చెల్లించాలని కోరుకుంటున్నారు. తన పిల్లలకు పక్కింటి వాడు ఫీజులు కట్టాలని కోరుకుంటే నలుగురూ నవ్విపోతారు. తిట్టిపోస్తారు. అందుకే ఆయన సంగతి తెలంగాణ తమ్ముళ్ళకు వదిలేశాడు. ఏం ఆశ చూపించాడో కానీ ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం నేతలు ఆంధ్రా పిల్లలకు తెలంగాణ ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలని, పాత బకాయిలు కూడా మనమే ఇవ్వాలని జులుం చేస్తున్నారు. ఆంధ్రా వాళ్ళ కంటే ఆరాకులు ఎక్కువ చదివిన వీళ్ళ ప్రవర్తన చూస్తే నిజంగానే వీళ్ళు తెలంగాణ వాళ్ళేనా అన్న అనుమానం కలుగుతున్నది

పాత బకాయిల మాటెత్తకుండా మరోవైపు చంద్రబాబు ఏడాది కొత్త అడ్మిషన్ల ప్రక్రియకు దొడ్డి దారి తెరిచి రాద్ధాంతం చేస్తున్నారు. కౌన్సిలింగ్ జరగడానికి ముందే ప్రభుత్వాలు ఫీజుల విషయంలో స్పష్టత ఇవ్వాలి, జీవో విడుదల చేయాలి. ఏయే కాలేజీలకు ఫీజులు చెల్లిస్తారో నోటిఫై చేయాలి. కాలేజీల అఫ్లియేషన్ పునరుద్ధరిస్తూ సంబంధిత విశ్వవిద్యాలయాలు ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. కౌన్సిలింగ్ నాటికి ఇవన్నీ ఉంటేనే అడ్మిషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఇదేదీ చేపట్టకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్మిషన్ ప్రక్రియ మొదలవుతున్నట్టు ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ఏయే కాలేజీల్లో ఎటువంటి వసతులు ఉన్నాయో పరిశీలించి నాణ్యతా ప్రమాణాలను బట్టి అన్ని వసతులు ఉన్న కాలేజీలకే అనుమతులు పునరుద్ధరించే విధంగా ప్రయత్నాలు ప్రారంభించింది. పని కొనసాగుతున్నందున కౌన్సిలింగ్కు మరికొంత సమయం కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్ట్లో ఒక పిటీషన్ కూడా వేసింది. విషయంలో కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వివరణ కోరింది. ఒకవైపు కోర్టులో విచారణ కొనసాగుతుండగానే ఒక ఎత్తుగడగా ఉన్నత విద్యామండలి ద్వారా ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్కు నోటిఫికేషన్ ఇచ్చింది.

ఉన్నత విద్యామండలి పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉన్నది. మండలి కార్యాలయం హైదరాబాద్లో ఉన్నందున అది తెలంగాణకు చెందుతుందని, ఏడాదిలోగా ఆంధ్రా ప్రభుత్వం అక్కడ కొత్త మండలిని ఏర్పాటు చేసుకోవాలని చట్టం చెపుతోంది. అప్పటిదాకా మండలి తెలంగాణ ప్రభుత్వ అజమాయిషీలో ఉంటూ రెండు ప్రాంతాల అవసరాలు తీర్చాలి. కానీ మండలి అధ్యక్ష ఉపాధ్యక్షులు ఇద్దరూ అక్కడివాల్లె కావడంతో వాళ్ళు చంద్రబాబు ఆడించినట్టు ఆడుతున్నారు. ఆయన చెప్పినట్టే నోటిఫికేషన్ ఇచ్చారు. కోర్టు ఆదేశాలు రాకుండానే తెలంగాణ ప్రభుత్వం వద్దన్నా వినకుండా ఎంసెట్ ఎంట్రెన్స్ నిర్వహించిన జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనుమతి లేకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలేజీల జాబితా లేకుండానే, ఫీజుల విషయం తేల్చకుండానే అడ్మిషన్ ప్రక్రియ మొదలుపెడుతున్నట్టు ప్రకటించారు.

ఇది తెలంగాణ విద్యార్థులను గందరగోళపరిచే ప్రయత్నం మాత్రమే కాదు చట్ట విరుద్ధం కూడా. నిజానికి ఇలా చేసే అడ్మిషన్లు చెల్లవు. కాలేజీలు ప్రభుత్వ అనుమతితో నడుస్తాయి. కౌన్సిల్ కేవలం ప్రభుత్వం సృష్టించిన కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమే. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా అది కార్యక్రమం చేపట్టే అవకాశం లేదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తమ ప్రభుత్వం అని కౌన్సిల్ భావిస్తే కేవలం ఆంధ్ర ప్రాంతానికే అడ్మిషన్లు ఇవ్వాలి తప్ప తెలంగాణ ప్రాంతంలో కౌన్సిలింగ్ చేస్తే కుదరదు

వీటిని ప్రస్తావించకుండా ఆంధ్రా మంత్రులు, మీడియా పదేపదే 1956ను ప్రస్తావిస్తూ తప్పుదారి పట్టిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1956ను స్థానికతకు ప్రామాణికం చేస్తూ ఇవ్వబోయే ఉత్తర్వులు సవాలు చేస్తామని అంటున్నారు. అది రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టికల్ 371-D కి విరుద్ధమని వితండవాదం చేస్తున్నారు.

రాజ్యాంగం ప్రకారం ఒక భౌగోళిక ప్రాంతమే స్థానికతకు ప్రామాణికం. షెడ్యూల్ ఏరియా చట్టాన్ని సవాలు చేసిన సందర్భంలో దీన్ని సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. ఒక ప్రాంతాన్ని స్థానిక ప్రాంతంగా ప్రకటించుకుని, ప్రాంతానికి రాయితీలు ఇచ్చుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని ఉన్నత న్యాయస్థానాలు అనేక సందర్భాల్లో స్పష్టం చేశాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఒక రాయితీ మాత్రమే తప్ప హక్కు కాదు. ఇక పోతే 371-D అంటున్నారు, నిజానికి 371-D ప్రకారమైతే 15 శాతం సీట్లు మాత్రమే ఉమ్మడిగా ఓపెన్లో ఉంటాయి, కానీ ఇప్పుడు ఆంధ్రా ప్రాంత విద్యార్థులు అంతకంటే రెండు మూడు రెట్లు అధికంగా తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రా ధృవీకరణ పత్రాలతో ఉన్నవాళ్ళు తెలంగాణ ప్రాంతంలో 40 శాతం దాకా ఉన్నారని ప్రభుత్వం అంటోంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 371-D కి విరుద్ధంగా 40 శాతం సీట్లు ఆంధ్రా విద్యార్థులకు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వమే ఫీజులు కట్టాలని న్యాయమూర్తి కూడా చెప్పే సాహసం చేయడు. చేసినా అది న్యాయం కాదు

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంది. లోకల్ పేరుతో సాగుతున్న లూటీ ఆపాలని చూస్తున్నది. కొంత సంయమనం పాటిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అయిది విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో చంద్రబాబు ఆయన తెలంగాణ సామంతులు సాగిస్తున్న ప్రచార ప్రభావం ఉండే అవకాశం ఉంది. పైగా మీడియా మొత్తం ఇంకా ఏకపక్షంగానే ఉన్నది. కానీ అర్థసత్యాలే ప్రచారం చేయడానికి అలవాటుపడ్డ ఆంధ్రా మీడియా చంద్రబాబు అసలు ఎత్తులు ఏమిటో తెలియకుండా జాగ్రత్తగా కథనాలు అల్లుతున్నది. గత వారంరోజులుగా వీలైనంత ఎక్కువ ఉద్వేగాలు పెంచే ప్రయత్నం మీడియాలో ఈనాడు కొనసాగుతున్నది. దీన్ని తిప్పికొట్టాలి.

తెలంగాణ విద్యాశాఖామంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇప్పటికే విషయం మీద పలు ప్రకటనలు చేశారు. ఇంకా భరోసా కలిగించే చర్యలు చేపట్టాలి. అలాగే అడ్మిషన్ల ప్రక్రియకు కావాల్సిన ముందస్తు చర్యలు వేగవంతం చేయాలి, ముఖ్యంగా ఫాస్ట్ పథకంలో ఆర్థిక సహాయానికి అవసరమైన మార్గదర్శకాలు త్వరగా పూర్తి చేసి, విద్యార్థులకు స్థానిక నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేయడంలో జాప్యం జరగకుండా చూడాలి. ఇవన్నీఫాస్ట్గా జరిగినప్పుడే గందరగోళానికి తెరపడుతుంది.