శనివారం, మే 19, 2012

కోస్తా తీరాన్ని కొల్లగొట్టారు!




జగన్ అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ ను సి బీ ఐ అరెస్టు చేసింది. వాన్పిక్ పేరుతొ వేలాది ఎకరాలు అక్రమంగా కాజేసిందుకు ఆయన ఇప్పుడు చంచల్ గూడా జైలులో ఊచలు లెక్క బెడుతున్నారు. కానీ మా మిత్రుడు ఏడుకొండలు మాత్రం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయి పోతున్నాడు. ఏడుకొండలుకు నిమ్మగడ్డ తో వ్యాపార పరమైన వైరమేమీ లేదు, అసలు ఆయనతో పరిచయం కూడా లేదు. కాకపోతే ఆయన వాన్పిక్ విద్వంసానికి ప్రత్యక్ష సాక్షి. వాన్పిక్ వల్ల ఉపాదికోల్పోయిన పల్లెకారుల ప్రతినిధి. సింగోతు ఏడుకొండలుది ప్రకాశం జిల్లా చినగంజాం మండలం లో ఒక చిన్న పల్లె. ఆ పల్లెనిండా పల్లెకారులే! సముద్రాన్నే నమ్ముకుని చేపలుపట్టి ఉపాధి పోసుకోవడం పల్లెకారుల వృత్తి. వారిలో చదువుకునే వాళ్ళే అరుదు. అటువంటి కుటుంబంలో చీరాలలో డిగ్రీ దాకా చదివిన ఏడుకొండలు తండ్రి మరణంతో పైచదువులకు స్వస్తి పలికి సముద్రాన్ని ఈదే సాహసం చేయలేక పొట్ట చేతబట్టుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆశ్రయమిచ్చి ఆదుకుంది. ఉస్మానియా లో ఎం ఏ సైకాలజీ, బీ ఈ డీ, ఎం ఫిల్ చేసిన ఏడుకొండలు ఒకవైపు చదువుకుంటూనే చిన్నా చితకా పనులు చేసి ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసారు. బాధ్యతలన్నీ తీరిపోయాయనుకున్న సమయంలో వాన్పిక్ ఉప్పెన వాళ్ళ ఊర్లన్నీ ముంచేసింది. ఉన్న ఎకరం, అరెకరం కూడా మిగలకుండా పోయేసరికి చిన్నా చితకా కుటుంబాల పరిస్థితి ఆయనను కలవర పెట్టింది.


ఆ సమయంలో ఏడుకొండలు మా విశ్వవిద్యాలయం లో తాత్కాలికంగా పనిచేసేవాడు. తెలంగాణా ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న కాలంలో ఆయన ఉద్యమానికి తన పూర్తి మద్దతునిచ్చాడు. తాము కోస్తాలోనే ఉన్నా తమ పరిస్తితి తెలంగాణా లాగే ఉందని, అక్కడి సంపన్నులు తమని బతుకనిచ్చే పరిస్థితి లేదని వాపోయేవారు. వాన్పిక్ పేరుతో నిమ్మగడ్డ ప్రసాద్ సాగిస్తోన్న భూ సేకరణ బాగోతాన్ని వివరించి మమ్మల్ని వాళ్ళ ఊరికి ఆహ్వానించారు. నాతో పాటు పనిచేసే కొందరు అధ్యాపకులు, ఒకరిద్దరు జర్నలిస్టు మిత్రులం ఆయనతో పాటు వెళ్ళాం. రెండు రోజుల పాటు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో నిమ్మగడ్డ కబంద హస్తాల్లో చిక్కుకున్న పల్లెల్ని వాన్పిక్ విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. బంగారం పండే భూములు, పుష్కలంగా నీల్లున్నా సాగుచేయలేని స్థితిలో ఉన్న రైతులు, సముద్రం ఒడ్డునే ఉన్నా అందులో చేపలుపట్టే హక్కులు లేని స్థితిలో పల్లెకారులు, ఊళ్ళో వ్యవసాయ పనుల్లేక ఉపాధి కోల్పోయిన కూలీలు, దళితులు ఇట్లా ఆ పల్లెలు కన్నేరుపెట్టడం కనిపించింది. తిరుగు ప్రయాణంలో సర్ మనం వీళ్ళకోసం ఏమైనా చేయగలమా? అని ఏడుకొండలు మళ్ళీ అడిగాడు. అప్పటికి రెండేళ్లుగా తెలంగాణా ప్రజలంతా ఏకభిగిన పోరాడుతున్నా స్పందించని ప్రభుత్వం తానే విధ్వంసానికి దిగుతుంటే ఏం చేయగలం. అప్పటికే ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం వాన్పిక్ కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్నారు. అదొక్కటే పరష్కారం అనుకున్నాం. ఇప్పుడు అనుకోకుండా వాన్పిక్ అధినేత జైలు పాలు కావడం ఒప్పందాలు రద్దవుతాయన్న వార్తలు వస్తోన్న నేపద్యంలో ఏడుకొండలు కు ఫోన్ చేసాను. ఆయన స్వరంలో ఒక కొత్త ఆశ ద్వనించింది. ఇదే ఆశ ఇప్పుడు ప్రకాశం గుంటూరు జిల్లాల్లోని లక్షలాది మందిలో ప్రతిధ్వనిస్తోంది. అక్కడి రైతులు తమ భూములు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వాన్పిక్ ను రద్దుచేసి తీరాలని కోరుతున్నారు.


జగన్ అక్రమ ఆస్తుల కేసులో సి బీ ఐ విచారణ, నిమ్మగడ్డ అరెస్టు పుణ్యమా అని ఇవాళ ఆకడి ప్రజలకు ఆ ధైర్యం వచ్చింది. వాన్పిక్ అనే సంస్థకు జరిగిన భూ కేటాయింపులన్నీ 'క్విడ్-ప్రొ-కో" ప్రాతిపదికన జరిగినవేనని సి బీ ఐ అంటోంది. న్యాయ శాస్త్ర పరిభాషలో "క్విడ్-ప్రొ-కో" ఆంటే బదులుకు బదులు అని. ఆంటే దాదాపు ఇచ్చిపుచ్చుకోవడం లాంటిది. మీకు ఎవరైనా మేలుచేస్తే అందుకు ప్రతిగా మీరు అతనికి చేసే మేలు అన్నమాట. నిమ్మగడ్డ ప్రసాద్ తన సంపదలో దాదాపు ఎనిమిది వందల కొట్లు జగన స్థాపించిన పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడని సి బీ ఐ గుర్తించింది. ఆయన ఒక వ్యాపారవేత్తగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ అలా పెట్టుబడులు పెట్టినందుకు ప్రతిఫలంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలను ఆయనకు రాసిచ్చాడని, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో అలా భూములు కేటాయించే ముందు కనీస నిబంధనలు పాటించలేదని, మంత్రివర్గ ఆమోదం కూడా పొందకుండానే పనులు జరిగాయని, ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత లేదని ఇలా తవ్విన కొద్దీ అనేక పెంకులు అందులో దొరుకుతున్నాయి. సాక్షి, టీ వీ, చానెల్, పత్రికలో పెట్టుబడులు పెట్టినందుకు వంపిక్ అనే సంస్థకు భూ కేటాయింపు జరిగిందని చెపుతున్నారు. అందులో నిజమెంతో కోర్టులు తేల్చాల్సి ఉంది. అది పక్కన పెడితే వాన్పిక్ కోస్తాలో చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. అధికార బలాన్ని ఆసరా చేసుకుని ఆ ఆ సంస్థ అనేక అమానవీయ చర్యలకు పూనుకుంది.


వాన్పిక్ పూర్తి పేరు వాడరేవు అండ్ నిజాంపట్నం పోర్ట్ & ఇండస్త్రియాల్ కారిడార్. ప్రకాశం జిల్లాలోని చీరాల దగ్గర ఉన్న వాడరేవు అనే ఊరినుంచి గుటూరు జిల్లా నిజాంపట్నం వరకున్న కోస్తా తీరాన్ని రాజశేకర్ రెడ్డి గారి హయాంలో నిమ్మగడ్డ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ సంష్తకు కట్టబెట్టారు. ఈ ప్రాంతంలో ప్రపంచ స్థాయి ఓడరేవులు నిర్మిస్తానని, విద్యుత్ ఉత్పత్తికి పవర్ స్టేషన్ లు నెలకొల్పుతామని, పారిశ్రామిక వాడలు, ఆధునిక విమానాశ్రయం కడతామని నమ్మబలికి ఆయన ఇక్కడ భూసేకరణకు పూనుకున్నారు. ప్రభుత్వం అడ్డూ అదుపూ లేకుండా ఆయన కంపనీకి భూసేకరణకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆఘమేఘాలమీద దాదాపు 34 గ్రామాల్లో 15 వేల ఎకరాల భూమిని తీరప్రాంతంలో ఆయనకు కేటాయించింది. దీనిలో దళితులు గత ముప్పై సంవత్సరాలకు పైగా సాగు చేసుకుంటున్న భూములతో పాటు అటవీ  భూములు, సముద్రపు కోతను ఆపేందుకు   చెట్లనుపెంచే నేలలూ ఉన్నాయి.

ఇలాంటి భూములు కేటాయించడం పర్యావరణానికి ముప్పు అనీ, తీర ప్రాంతాల భూములు ప్రైవేటు కంపనీలకు ఇవ్వడం దేశ భద్రతకు ప్రమాదమని నిపుణులు చెప్పినా రెడ్డి గారు వినలేదు సరికదా మరింత భూమి ప్రయివేటు వ్యక్తులనుంచి, రైతులనుంచి సేకరించుకునే స్వేచ్చను ఆ కంపనీకి ఇస్తూ ఆదేశాలిచ్చారు. ఈ పనులన్నీ ఎలాంటి ఆటంకం లేకునా పూర్తిచేసేందుకు రైల్వే శాఖలో ఉన్న తన బంధువు బ్రమ్హానంద రెడ్డి ని ప్రత్యక అధికారిగా నియమించారు. ఇంకేముంది నిమ్మగడ్డ తన సామ్రాజ్యాన్ని ౩౦ వేల ఎకరాలకు విస్తరించాడు. అప్పటి కలెక్టర్లు మొదలు, రెవిన్యూ యంత్రాంగమంతా రెండేళ్ళ పాటు ఈ పనిలో తరించింది. వాన్పిక్ ఇచ్చిన పరిహారంతో పెద్ద భూస్వాములు, కమీషన్ లతో బ్రోకర్ లుగా పనిచేసిన చోటా మోటా రాజకీయ నాయకులు, ఎం ఎల్ ఏ లు, మంత్రులు కోట్లకు పడగలెత్తారు. లక్షలాది రైతులు, కూలీలు, సముద్ర తీరాన్ని రేవులను నమ్ముకుని బతికే మత్సకారులు వీధిన పడ్డాయి. దాదాపు నలభై గ్రామాలు స్మశానంగా మారే పరిస్తితి వచ్చింది. ఒక్క సి పీ ఐ మినహా అన్నిపార్టీల నాయకులను కంపనీ కొనేసి ప్రతిఘతిస్తోన్న ప్రజల గొంతులు వినిపించకుండా చేసేసాయి. ఆ ప్రాజెక్టును వ్యతిరేకించే వాళ్ళెవరూ అక్కడ అడుగుపెట్టకుండా పోలీసులతో దిగ్భందం చేసి భూసేకరణను జరిపారు. ఈ సందర్భంగానే సి పీ ఐ నాయకులు నారాయణ రహస్యంగా పడవలో ప్రయాణించి అక్కడికి చేరుకుంటే మీడియా అక్కడ ఆయన గాంధీ జయంతి రోజున చికెన్ తింటున్న దృశ్యాన్ని చిలువలు పలువలు చేసినంతగా అక్కడి పోరాటాన్ని ప్రచురించలేదు, ప్రసారం కూడా చేయలేదు. అలా అందరినీ కోనేయగల శక్తి కలిగిన నిమ్మగడ్డ ఇప్పుడొక చానెల్ కు అధిపతి మరొక చానెల్ కు పెట్టుబడి దారుడు! ఇప్పుడు నిమ్మగడ్డ అరెస్టు పత్రికా స్వేచ్చను హరించడమే అని కూడా ఎవరైనా అనవచ్చు!!


నిజానికి పత్రికా స్వేచ్చ ప్రస్తావన భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మన రాజ్యాంగంలో మనిషికి మించిన హక్కు మరెవరికీ లేదు. రాజ్యాంగం ప్రతి మనిషికి భావ ప్రకటన స్వేచ్చ ఉందన్తూనే ఆ తరువాతి పేరాలోనే దానికుండే పరిమితులను కూడా చెప్పింది. ప్రజల భావ ప్రకటన స్వేచ్చకు వాహికగా ఉన్నదే మీడియా కాబట్టి రాజ్యాంగం చెప్పిన పరిమితులకు లోబడే మీడియా పనిచేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం మీడియా స్వేచ్చను ప్రస్తావించక పోయినా మీడియాకు స్వేచ్చ ఉండాలన్నది ఒక ప్రజా స్వామిక ఆకాంక్ష. ఆ ఆకాంక్షను అనేక కోర్టులు నిర్ధారించాయి కూడా. అలాగే మీడియా స్వేచ్చ ఆంటే పాత్రికేయుల స్వేచ్చ. పత్రిక రచయితలు, ప్రచురణ కర్తల స్వేచ్చ అని అనేక సందర్భాల్లో కోర్టు లు తేల్చాయి. అంతే తప్ప యజమానుల స్వేచ్చ కాదని గుర్తించాలి. సాక్షి తెలుగు జర్నలిజం లో ఒక క్రియాశీలమైన పాత్ర పోషించింది. సాక్షి లో వచ్చిన వార్తల వల్ల ముఖ్యంగా ఈ రెండేళ్లలో నాణేనికి రెండో వైపు ఏముందో తెలిసి వచ్చింది. ఆ పత్రిక రాతలను, ప్రచురణను ఎవరైనా అడ్డుకోవడం ముమ్మాటికి పత్రికా స్వేచ్చ కిందికే వస్తుంది. ఇప్పుడు సి బీ ఐ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సాక్షి సిబ్బందిలో పాతకుల్లో ఆందోళన కు కారణం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పత్రిక ప్రచురణకు ఆటంకం కలిగించే విధంగా ఉంటున్నాయి. దాన్ని తప్పుపట్టవచ్చు. కానీ ఇదంతా నేరవిచారణలో భాగం అయినప్పుడు విచారణ జరిపే అధికారాన్ని ప్రశ్నించలేము. పత్రిక ప్రచురణకు, సిబ్బంది భద్రతకు భంగం కలుగకుండా ఏ విచారణయినా జరగాలి. పత్రికా స్వేచ్చ పేరుతో విచారణను అడ్డుకున్నా, విచారణ పేరుతో పత్రికా స్వేచ్చను హరిన్చినా న్యాయం కాదు. దీన్ని ప్రజాస్వామ్య వాదులెవరూ హర్షించ కూడదు. పత్రిక , చానల్ ఏదైనా ఒక ప్రయివేటు యాజమాన్యంలో నడిచే వ్యాపార సంస్థ, ఆ సంస్థ మూతపడితే దానికి యాజమాన్యం బాధ్యత వహించాలి. ఒకవేళ ప్రభుత్వం అన్యాయంగా మూత వేస్తే ప్రభుత్వం మీద జర్నలిస్టు సంఘాలు పౌరసమాజం ఒత్తిడి తెచ్చి దాన్ని తెరిపించాలి. అంతే  తప్ప ఇది పత్రిక కాబట్టి ఆ పత్రిక యజమానిమీద విచారణ వద్దన్నా, ఆ యజమాని తెచ్చిన పెట్టుబడులను ముట్టుకోవద్దన్నా భావ్యం కాదేమో ఆలోచించాలి. అదే న్యాయమని ఎవరైనా వాదిస్తే ఇక ముందు మనం ఏ పెట్టుబదిదారున్నీ విచారించాలేము. కాబట్టి పత్రికా స్వేచ్చను యజమానుల స్వేచ్చతో ముడిపెట్టి చూడకూడదు.


విచిత్రంగా కొందరు నిమ్మగడ్డ అరెస్టు ను పారిశ్రామిక ప్రగతికి అవరోధమని అంటున్నారు. సమాజంలో గౌరవ ప్రదమైన హోదాల్లో ఉన్న సంపన్నులను, పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్న పారిశ్రామిక వేత్తలను అరెస్టు చేస్తున్నారని వాపోతున్నారు. వీళ్ళంతా ఇప్పుడు విచారణలో ఉన్న ఈ పెద్దమనుషులు ఈ రాష్ట్రంలో వేలాది కుటుంబాల్లో విధ్వంసం స్తుష్టించారన్న సంగతి దాచిపెడుతున్నారు. వాళ్ళ భూదాహానికి పాలమూరు జిల్లా పోలేపల్లి పేద రైతులతో సహా లక్షలాది జీవితాలు చిందర వందరైన సంగతి మరిచిపోతున్నారు. ప్రజల పోట్టలుగొట్టి పెట్టుబడులు పెట్టే ఇటువంటి పారిశ్రామిక వేత్తలేనా మనకు కావాల్సింది ఆన్న విషయాన్ని ఏ ఒక్కరూ ప్రస్తావించక పోవడం మన సంకుచిత అభివృద్ధి ఆకాంక్షకు పరాకాష్ట. ఇప్పుడు వాన్పిక్ ఒప్పందాన్ని రద్దుచేసి ఆ భూములను తిరిగి అక్కడి రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అలాగే ఏమార్, పోలేపల్లి మొదలు చంద్ర బాబు హయాం నుంచి రాజశేఖర్ రెడ్డి రాజ్యందాకా సాగిన భూ పందేరాలన్నిటి మీదా విచారణ జరగాలి. ఇప్పుడు కోస్తాలో మొదలవుతున్నావాన్పిక్ భూస్వాధీన పోరాటం తెలంగాణా ఉద్యమానికి కూడా ఒక మోడల్ కావాలి. అక్కడైనా ఇక్కడయినా ఆక్రమణ దారుడు ఒకడే! లంకోహిల్ల్స్ , ఏమార్ , పోలేపల్లి అన్నీ అక్రమాలేనని విచారణలో తేలుతున్నది. వీటి మీద తెలంగాణా వాదులు దృష్టిపెట్టాలి. అక్రమంగా తీసుకున్న భూములన్నీ ప్రజలకు చెందాలి. ప్రజల ఆమోదంతోనే భూకేటాయింపులు జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం ఉన్నట్టు లెక్ఖ, లేకపోతే మన మాటలు, రాజకీయాలు, ఉద్యమాలు అన్నీ క్విడ్-ప్రొ-కో అనే భావించాల్సి ఉంటుంది

2 కామెంట్‌లు:

  1. ప్రజలలో చైతన్యం వొస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు. ప్రభుత్వాలు అలాంటి అల్ప సంఖ్యాకులైన చైతన్యపరులైన ప్రజలనే నక్షలైటులు అన్న పేరుతో తుపాకీ తూటాలకు బలి చేస్తున్నారు. మీ లాంటి రచయితలు విశ్లేషకుల పుణ్యమా అని ప్రజలలో అధిక సంఖ్యాకులు చైతన్యవంతులు కాగలిగినప్పుడు ప్రభుత్వాలు తోకలు ముడిచే అవకాశం ఉంది. దయచేసి మీ రచనలను విద్యావంతులైన ప్రజలకు అధిక సంఖ్యాకులకు అందుబాటులోకి వొచ్చేట్లుగా చెయ్యగలిగితే, సంఘానికి మీ వంతు సేవ ఎనలేనిదిగా కొనియాడబడుతుంది. జై తెలంగాణా.

    "చంద్ర బాబు హయాం నుంచి రాజశేఖర్ రెడ్డి రాజ్యందాకా సాగిన భూ పందేరాలన్నిటి మీదా విచారణ జరగాలి. ఇప్పుడు కోస్తాలో మొదలవుతున్నావాన్పిక్ భూస్వాధీన పోరాటం తెలంగాణా ఉద్యమానికి కూడా ఒక మోడల్ కావాలి. అక్కడైనా ఇక్కడయినా ఆక్రమణ దారుడు ఒకడే! లంకోహిల్ల్స్ , ఏమార్ , పోలేపల్లి అన్నీ అక్రమాలేనని విచారణలో తేలుతున్నది. వీటి మీద తెలంగాణా వాదులు దృష్టిపెట్టాలి. అక్రమంగా తీసుకున్న భూములన్నీ ప్రజలకు చెందాలి. ప్రజల ఆమోదంతోనే భూకేటాయింపులు జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం ఉన్నట్టు లెక్ఖ."

    రిప్లయితొలగించండి
  2. అన్యాయం జరిగినప్పుడు.... ఏదిరించే శక్తిలేని ప్రజల తరుపున పోరాడుతున్న మీలాంటి వాళ్లు ఉండడం వారి అదృష్టం సార్. ప్రజలకోసం... ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు, ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ఏంటీ సార్. వ్యవస్థ మారాదా...? పేదల కడుపుకోట్టి వారికున్న కొద్దొగొప్పో భూములను ప్రభుత్వంమే బలవంతంగా లాగేసుకోవడం ప్రజాస్వామ్య దౌర్భంగా నేనే అనుకుంటున్నా.

    రిప్లయితొలగించండి