శుక్రవారం, మే 22, 2020

ఎన్ హెచ్ 44: మానవత పరిమళించిన రహదారి






విశ్వమంతా విలయతాండవం చేస్తోన్న కారోనా వైరస్ మనకు చేసిన హెచ్చరిక ఏమిటి ? ఎవరి ఇళ్లల్లో వాళ్ళుఉండమని. ముక్కులు, మూతులు మూసేసుకుని, చుట్టూ గిరిగీసుకుని చేతులు ముడుచుకు కూర్చోమని!  రెండునెలలుగాప్రపంచమంతా అదే పని చేస్తోంది.  కానీ తెలంగాణా పౌరసమాజం మాత్రం అందుకు భిన్నంగా చేయీ, చేయీ కలిపి వలసకూలీలకు బాసటగా నిలబడింది. కన్యాకుమారి నుంచి కాశ్మీరు సరిహద్దుల దాకా తెలంగాణా గుండా నడిచివెళుతున్న నిర్భాగ్యులకు చేదోడు వాదోడుగా ఉండాలనుకుంది. గాలికి వదిలేసిన బరువును బాధ్యతగా తలకెత్తుకు మోస్తున్నది. చేతులున్నది కేవలం సబ్బునీళ్ళు, శానిటైజెర్లు పూసుకోవడానికి మాత్రమే కాదని, కష్టకాలంలో కన్నీళ్లు తుడవడానికి, కడుపునింపడానికి కూడా అనినిరూపిస్తున్నది. దాదాపు గడిచిన రెండు నెలలుగా జాతీయ రహదారుల మీద పొయ్యివెలిగించి సొంత దేశంలోనే  నిరాశ్రయులైన  వలస కూలీలఆకలితీరుస్తున్నది. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మొదలు మహారాష్ట్ర సరిహద్దు లో ఉన్న పెన్ గంగ వరకు జాతీయ రహదారి మొత్తాన్ని ఒక మానవహారంగా మలిచి బతుకు చెదిరిన బాటసారులకు బాసటగానిలుస్తున్నది. కాలేకడుపులను నింపడమే కాదు, కందిపోయిన కాళ్లకు చెప్పులు తొడుగుతోంది. చెదిరిపోయిన గుండెలకు సేదదీర్చి ఇంకా దేశంలో  మనుషులున్నారని,  మానవత్వం మిగిలే ఉందని భరోసా కల్పిస్తోంది.  వలస కూలీలు కాదు మీరు మా అతిధులని ఆదరిస్తుంది. 

 ఈ విషయాలు తెలిసిన తరువాత నేను మరికొందరు మిత్రులం 44వ జాతీయ రహదారిమీద నడిచివెళుతోన్న వారిని పలుకరించాలనుకున్నాం. అప్పటికే కొందరు ఉపాధ్యాయ మిత్రులు ఫోన్ చేసి వాళ్ళు చేస్తోన్న పనిని, ప్రజల స్పందనను మాతో పంచుకున్నారు. వారిని కూడా కలవాలనుకుని హైదరాబాద్ నుంచి దాదాపు 200 కిలోమీటర్లున్న ఆర్మూర్ పొలిమేరల్లోని పిర్కెట్ అనే ఊరికి బయలుదేరాం. మేడ్చల్ మొదలు పిర్కెట్ దాకా కాలినడకన, తరుక్కులమీద, సైకిళ్ళ మీదా ఒకటే జనం. ఎదో అంతర్యుద్ధం జరుగుతున్నట్టు, ప్రాణాపాయం తరుముతున్నట్టు భిక్ఖు బిక్కుమంటూ తరలి వెళుతోన్న జనం. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది.  ఈ దేశ సంపద సృష్టికర్తలైన వీళ్ళు ఎందుకిలా భయంలో, అభద్రతలో ప్రయాణిస్తున్నారు. ఇంత సంక్షోభాన్ని గుండెల్లో మోస్తూ వెళ్తోన్న వీళ్ళు కాలినడకన, అడవులు, కొండలు దాటి క్షేమంగా ఇల్లు చేరుతారా? మళ్ళీ తిరిగి వస్తారా? రాకపోతే ఈ దేశ ఆర్ధిక వ్యవస్థ ఏమవుతుంది. సమాధానాలు లేని అనేక ప్రశ్నలు. 

కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన తరువాత దాదాపు 50 రోజుల వరకు కూడా మనకు వ్యాధి తీవ్రత అర్థం కాలేదు. అప్పటికే వైరస్ బాధితుల సంఖ్య 300 దాటింది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన ప్రభుత్వం అప్పటికప్పుడు అనూహ్యమైన నిర్ణయం తీసుకుని దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించింది. వైరస్ తోదేశానికి పెనుప్రమాదం పొంచివుందని, ఎక్కడివాళ్ళు అక్కడే వుండాలని ఆదేశించింది. ఇది కోట్లాదిమందికి అశనిపాతం అయ్యింది. భారత దేశం నిత్యచలనశీలత కలిగి ఉండే దేశం. రెక్కాడితేగాని డొక్కాడని వాళ్ళే మనదేశంలో ఎక్కువ. ఇక్కడ పరిశ్రమలుఫ్యాక్టరీలే కాదు  అన్ని కార్యస్థలాలూ మూడుపూటలా పనిచేస్తాయి. రేయింబవళ్లు తేడాలేకుండా రోడ్ల మీద రవాణా వ్యవస్థ సరుకులనో, మనుషులనో మోస్తూ ఉంటుంది. దేశంలో కోట్లాదిమంది నిత్యం అవసరాల నిమిత్తం తమదికాని ప్రదేశాలకు, నగరాలకు, పట్టణాలకు వెళుతుంటారు. ముఖ్యంగా అసంఘటిత కార్మికులు, ఇల్లూవాకిలి వదిలేసి ఉపాధికోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్లి జీవిస్తుంటారు. వాళ్లందరికీ ఇదొక పిడుగుపాటు అయ్యింది.లాక్ డౌన్ వార్త వారిని కలవరపెట్టిందిరోడ్లమీదికి కోట్లాదిమంది ముల్లెమూటా సర్దేసుకుని రావడం తో దేశం ఒక రకంగా షాక్ కు గురయ్యింది. అప్పటివరకు దేశంలో ఎంతమంది వలసకూలీలు ఉన్నారో లెక్కలు లేవు, అంచనా లేదు. ఆర్ధిక పద్దుల్లో అసంఘటిత రంగం తెచ్చే ఆదాయపు లెక్కలుంటాయి, కానీ ఆ ఆదాయం సమకూర్చే మనుషుల లెక్క ఉండదు. లాక్ డౌన్ ప్రకటించే నాటికి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనే ఆలోచన కూడా రాలేదుఒక వైపు పొంచి ఉన్నవైరస్ ముప్పు, మరోవైపు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ జీవితాలు  ఇవి వారిలో భయాన్ని, అభద్రతను కలిగించాయి. ఆదేశ్ రవి ఆక్రోశించినట్టు ఆ క్షణం వాళ్లంతా పిల్లాజెల్ల గురించే పలవరించారు. తల్లి దండ్రులు వాళ్ళ కళ్ళల్లో మెదిలారు. ఎవరికైనా చావు భయంలో గుర్తొచ్చేది కుటుంబమే కదా! వాళ్ళ కోసమే కదా వీళ్లంతా ఊరొదిలి దేశంకాని దేశం వలస పక్షులై వచ్చింది. బతుకు దెరువు కోసం వచ్చిన చోటే బతుకు లేక, చావు తరుముతోందన్న హెచ్చరికల నడుమ వాళ్ళు నడకను నమ్ముకున్నారు. తమ  కాళ్ళను నమ్ముకున్నారు. తమ ఊళ్లను, తమ వాళ్ళను వెతుక్కుంటూ బయలుదేరారు. 

 
 నేపాల్ కు నడిచి వెళ్తామని బయలుదేరిన యువకులు 


ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా,  శిబిరాలు ఏర్పాటు చేసినా, కట్టడి చేసినా  అవన్నీ నిర్బంధాన్ని తలపించాయి తప్ప వారికి ఆత్మనిర్భరతను ఇవ్వలేక పోయాయి. అంతే ఎవరికీ వారు ఆక్షలను ధిక్కరించి, అన్ని భయాలను అధిగమించి వందలు, వేలమైళ్ల మహాప్రస్థానానికి పూనుకున్నారు. దేశంలోని విశాల రహదారులన్నీ కాలిబాటలైపోయాయిబహుశా భారతదేశం గతంలో ఎన్నడూ  కనీవినీ ఎరుగని జన ప్రయాణమిది. ప్రజలు ఇంతటి భయంతో, అభద్రతతో  దేశ విభజన సందర్బంగా కూడా ప్రయాణాలుచేయలేదని, చరిత్రలో ఇంతమంది ఇంత దూరం ఎన్నడూ నడిచివెళ్లలేదని సమాజ శాస్త్ర పరిశోధకులు అంటున్నారు. దేశవిభజన సందర్బంగా ఇలా తరలిపోయింది కేవలం కోటి, కోటిన్నర మంది, కానీ ఇప్పుడు అంతకంటే అనేక రెట్ల మంది రోడ్డు మార్గాల గుండా, రైలు పట్టాల వెంట  ప్రాణాలు ఫణంగా పెట్టి మరీ ప్రయాణాలు చేస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా కాళ్ళను నమ్ముకుని ప్రయాణిస్తున్నారు. అనేకమంది మార్గ మధ్యలోనే మృత్యువాత పడుతున్నారు. ఒకవేళ డబ్బులున్నా లొక్డౌన్ పుణ్యమా అని హోటళ్లు, తినుబండారాల దుకాణాలూ మూతపడిపోయాయి. అందుకే తిండికోసం పిండి మూటగట్టుకుని బయలుదేరారు. నిండు గర్భిణులు, పసిపిల్లలను వేసుకుని మండే ఎండల్లో కాందిశీకుల్లా కదిలిపోతున్నారు

 
దేశాన్ని రెండుగా విభజిస్తూ ఉత్తర దక్షిణ భారత రాష్ట్రాలను కలుపుకుంటూ వెళ్లే 44 నెంబరు జాతీయ రహదారి ఇప్పుడు వలసకూలీలకు కన్నీటి కాలి బాటగా మారి పోయింది. దారిగుండా రోజుకు లక్షలాది మంది కూలీలు దక్షిణం నుంచి ఉత్తర భారతానికి తరలివెళ్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ నుంచి నేపాల్ దాక ఇట్లా దేశమంతా ఇప్పుడు రహదారిలోనే నడిచి వెళ్తోంది. దేశంలోనే అత్యంత పొడవైన  రహదారిని, వాళ్ళ తాతలో, తాతల తాతలోవేసిఉంటారు. వీళ్ళు కూడా ఇదే దారిగుండా కూటి కోసం కూలీ పనులు వెతుక్కుంటూ వచ్చి ఉంటారు. ఇప్పుడు అదే వారికి ఇంటిదారి  చూపిస్తోంది. కోటి ఆశల్ని మూటగట్టుకుని వచ్చిన వారంతా ఉట్టి చేతుల్తో పుట్టెడు దుఃఖాన్ని మూటగట్టుకుని వెళ్తున్నారు. మూడు వేల  ఎనిమిది వందల కిలోమీటర్లకు పైగా పొడవున్న  రహదారి తెలంగాణలో దాదాపు ఐదువందల కిలోమీటర్లు విస్తరించి ఉంటుందిఒకరకంగా ఇది వలస దారి. పారిశ్రామిక పట్టణాలైన కోయంబత్తూరు, సేలం మొదలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, వంటి ఉపాధికల్పించే మహానగరాలను కలిపే మార్గమిది. భారతదేశ చిత్రపటానికి వెన్నెముకలా నిటారుగా సాగే జాతీయ రహదారి మరో ఏడు జాతీయ రహదారుల్నిమిళితం చేసుకుని పది రాష్ట్రాల గుండా వెళుతుందిఇప్పుడీ రహదారి కనీసం తెలంగాణలో మనుషుల్ని కలుపుతోంది.  మానవీయ విలువల ఊట చెలిమెలా దప్పిగొన్నగొంతులు తడుపుతోంది, కడుపులు నింపుతోంది. వారికి దారిదీపమై నడిపిస్తోంది

 
మనమంతా తలుపులు మూసుకుని,ఇంట్లో లొక్డౌన్ అయిన సమయంలోనే నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రజల హృదయాలు తెరుచుకున్నాయి. దారివెంబడి దీనంగా నడుచుకుంటూ వెళుతున్న వారిని చూసి చలించి పోయారు. వారిని తమ అతిధులుగా భావిచారు. ఆకలి తెలుసుకున్నారు, అక్కున చేర్చుకున్నారు. తాము వండుకునే వేళ మరో నాలుగు పిడికిళ్ల బియ్యాన్ని వాళ్ళకోసం కూడా వండారు,  తమ పిల్లలకు రెండు ముద్దలు తక్కువపెట్టి అందులోంచి వాళ్లకు పెట్టి ఆకలిని పంచుకున్నారు. ఇది దానమనో, అన్న దానంతో పుణ్యమొస్తుందనో వాళ్ళు అనుకోలేదు,  తమ ధర్మం అనుకున్నారు. తమ ఊరినుంచి, తమ ఇళ్ల ముందునుంచి కాళ్ళు ఈడ్చుకుంటూ నడిచివెళ్లేవాళ్లను తమ బంధువులని భావించారు. బాధ్యతగా నిలబడ్డారు. కానీ బంధువులు ఒకరో ఇద్దరో అయితేపరవాలేదు, కానీ రోజూ వేలాదిమంది తరలివస్తున్నారు. ఇది అక్కడి ఉపాధ్యాయులను ఆలోచనలో పడేసింది. మొదటినుంచీ సమాజంతో మమేకమై నడిచే తెలంగాణా ఉపాధ్యాయులకు సామాజిక స్పృహ ఎక్కువ, సంఘటిత చైతన్యం కూడా ఎక్కువే. తెలంగాణా ఉద్యమంతో పాటు అనేక ఉద్యమాలకు జవజీవాలు నింపింది వాళ్ళే. అనుభవాన్ని పునాది చేసుకుని అప్పటికప్పుడు జాతీయ రహదానిని ఆనుకుని ఉన్నబాల్కొండ, ముప్కాల్, మెండోరా  మండలాలకు చెందిన వందమంది ఉపాధ్యాయులు ఒక్కటై నిలబడ్డారుఉద్యమస్ఫూర్తితో ప్రజలతో మమేకమై ఆకలితీర్చేబాధ్యతను భుజాలకు ఎత్తుకున్నారు. వారికి తెలంగాణా ఉద్యమ సమయంలో రహదారుల మీద వంటా వార్పూ చేసిన అనుభవంతో పాటు, రోజూ పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి వడ్డించిన అనుభవం కూడా తోడయ్యింది. ప్రజలను భాగస్వాముల్ని చేసి ఆర్మూర్ మండలంపిర్కెట్  చౌరస్తాను కేంద్రంగా చేసుకుని మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ ఒక 'కమ్యూనిటీ కిచెన్' ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులంతా వాలంటీర్లుగా పనిచేస్తున్నారుఇప్పుడుఏ సమయంలో వెళ్లినా అక్కడ  వేలాదిమందికి భోజనం సిద్ధంగా ఉంటుంది. ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి సహాయం చేయడమే కాకుండా వారు పండించిన కూరగాయలు,పండ్లు అక్కడ పంచి పెడుతున్నారు. కొందరు వృద్ధులు దారిఖర్చులకోసం దాచుకున్న డబ్బులు ఇచ్చివెళ్తున్నారు. మరికొందరు మాస్కులు, చెప్పులుకొనితెచ్చి బాటసారులకు అందజేస్తున్నారు. దీనికికొందరు పోలీసులు, ఇతర అధికారులు కూడా తోడుగా నిలబడ్డారు. కాలినడకన వస్తున్నవారికి  కొన్నిచోట్ల మహారాష్ట్ర సరిహద్దులదాకా వాహన సౌకర్యం  కూడా కల్పిస్తున్నారు.

దీని స్ఫూర్తి తెలంగాణా జీవితంలో ఉంది. ఈ రహదారి గుండా తెలంగాణా పల్లెల్లోంచి అనేకమంది వలసెళ్లిపోయారు. పాలమూరు లేబర్ మొదలు ఉత్తర తెలంగాణా అంతటికీ అదే వలస దారి అయ్యింది. అంతే కాదు వలస కార్మికుల కన్నీళ్లతో ఇక్కడ ఇల్లిల్లూ తడిసి పోయి ఉంది. బొంబాయి , బొగ్గుబాయి, దుబాయి అన్న మాట ఇక్కడి బతుకుల్లోంచి వచ్చిందే. వాళ్లకు వలస కార్మికుల బాధలు తెలుసు, వేదన తెలుసు, కష్టకాలాలను ఎన్నింటినో చూసిన తల్లులు, తండ్రులు బహుశా ఈ బాటసారుల్లో తమ బిడ్డల్ని చూసుకుని వుంటారు.  ఆకలికి ఉగ్గపట్టి ఈడ్చుకు పోయిన ఆ కడుపుల్ని చూసి ఉంటారు. అందులోని ఆకలిని, ఆవేదనను గమనించి ఉంటారు. అందుకే తమ పిల్లలకు గోరుముద్దలు పెట్టినంత ప్రేమగా వాళ్లకు విస్తరాకులు పరిచి వడ్డింస్తున్నారు.  ఇక్కడ మండే ఎండల్లో ఆధ్ధ్యం ఇస్తోన్న ఉపాధ్యాయులు ఎదో ఒక దశలో ఆకలితో పోరాడిన వాళ్ళే. ఆఖరి యుద్ధంలో తెలంగాణాకోసం కొట్లాడిన వాళ్ళే. ఆకలి తో పోరాడిన వాడికి అన్నం విలువ తెలుసు. అందుకే వాళ్ళు ఆఖరి మనిషికి కూడా అంతే ప్రేమగా వండి పెడుతున్నారు.


ఇప్పుడుమేడ్చల్ మొదలు ఆదిలాబాద్ దాకా ఇందల్వాయి, పిర్కెట్,పోచంపాడ్, బుస్సాపూర్, మెండోరా గ్రామాల్లో ఇదే స్ఫూర్తి సాగుతోంది. ఇందులో మేడ్చల్ కొంత భిన్నమయింది. నగరానికి చేరువలో ఉండడం వల్ల హైదరాబాద్ నగరంలోని బుద్ధి జీవులు, కవులు, రచయితలు, పాత్రికేయులు కొన్ని ప్రజాసంఘాల మద్దతుతో దీన్ని నిర్వహిస్తున్నారు.వాళ్లకు వాళ్ళే చందాలు వేసుకుంటుంటున్నారు. భోజనం సమకూరుస్తున్నారు. సగౌరవంగా వారిని ఏదో వాహనం ఏర్పాటు చేసి క్షేమంగా సరిహద్దులదాకా సాగనంపుతున్నారు. ఇందులో సకల జనులున్నారు. సబ్బండ వర్ణాలున్నారు. మీడియా, సోషల్ మీడియా ఉపయోగించి దీనినొక సజీవ శిభిరంగా నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ నగరానికి చేరువగా ఉండడం మూలంగా అనేకమంది వారికి సంఘీభావం తెలుపుతున్నారు. 


కానీ మారుమూల గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో మాత్రం ఇవి అక్కడి స్థానిక చైతన్యంతోనే నిలదొక్కుకుంటున్నాయి. సాముదాయిక వంటశాలలకు సోషల్ మీడియా వెన్నుదన్నుగా నిలుస్తోందిఉమ్మడి నిజామాబాద్ ప్రజలు ఉపాధ్యాయుల చొరవను  గమనించిన అల్లపుల్ల గంగారెడ్డి అనే యువకుడు ఫేస్బుక్ లో పోస్ట్ చేసాడు. లండన్ లో ఎంబీఏ చదివి వచ్చిన గంగారెడ్డి చాలాకాలంగా తెలుగు సినిమా రంగంలో పనిచేస్తున్నారు. ఆయన  ఎప్పటికప్పుడు వీడియోలు, ఫోటోలు మిత్రులతో పంచుకుంటున్నాడు. దీనికి ఊహించని స్పందన వచ్చింది. కొందరు ఆర్ధిక సహాయంతో ముందుకు వస్తుంటే మరికొందరు అండగా నిలబడి బాగస్వాములవుతున్నారు. ఇప్పుడు లొక్డౌన్ వాతావరణం సడలుతోంది. మరోవైపు కరోనావైరస్  మనదేశం మీద తన పట్టును మరింత బిగిస్తోంది. ఇప్పుడు నగరాల్లో వలసకార్మికులు నివసించిన మురికి వాడలు ఖాళీ అవుతున్నాయి. రహదారులన్నీఉసూరుమంటూ కదులుతూనే ఉన్నాయి. పరిస్థితి ఇంకా నెలరోజులదాకా ఉండొచ్చు. కరోనాోవైరస్ తో  కలిసి బతకాల్సిందేనని అందరూ చెపుతున్నారు. కానీచావయినా బతుకైనా తమ ఊళ్ళల్లోనేనని వలసకార్మికులు ఇంటి బాటపట్టారు ప్రయాణం అప్పుడే ముగిసి పోయేలాలేదు. చివరిమనిషి సరిహద్దులు దాటేదాకా  ప్రయత్నాలు కొనసాగాలి. ఆఖరి కడుపు ఆకలి తీరేదాకా పొయ్యి ఆరిపోకుండా ఉండాలి. స్ఫూర్తిని తెలంగాణా పౌరసమాజం అలాగే నిలబెట్టాలి.  

ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి దినపత్రికలో 21 మే 2020 న  ప్రచురితం