శుక్రవారం, నవంబర్ 23, 2012

చుప్ ..! నోరు మూసుకు బతకండి..!




మీకు ఈ ఘంటాపథం నచ్చితే మౌనంనే ఉండండి. మనసులోనే అభినందించండి. దయచేసి నోరు విప్పకండి. ఇంకెవరికీ ఆ మాట చెప్పకండి. నేను పేస్ బుక్ లో పోస్ట్ చేసినా సరే 'లైక్' ని క్లిక్ చెయ్యకండి. ఇప్పుడు నోరు విప్పాలంటేనే భయపడాల్సిన రోజులు వచ్చేసాయి.  మన మాటలను, చర్యలను, చేష్ట లనే  కాదు మన ఆకాంక్షలను, ఆలోచనలను చివరికి భావోద్వేగాలను కూడా మనలోనే సమాధి చేసుకోవాల్సిన రోజుల్ని మనం చూస్తున్నాం. అలా చేసుకోకుండా మొండిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి, మీ మనసుతో మీరు ఆలోచించి, మీకు మీరుగా మీ భావాలను బయట పెట్టాలనే ప్రయత్నంలో గొంతెత్తి గట్టిగా అరవాలని నోరుతేరిచారో  అంతే సంగతులు. మీరు తల దించుకుని బతకాల్సి వస్తుంది. మళ్ళీ తలేత్తుకోవాలంటే ఒకటికి  పది సార్లు క్షమాపణలు కోరుకోవాల్సి  ఉంటుంది. అయినా ఎవ్వరూ వినరు. మిమ్మల్ని ముట్టడిస్తారు. మీ వెంటపడి  నిరంతరం వేధిస్తారు. అవసరం అనుకుంటే ఎదో ఒక చట్టం లో బుక్ చేసి మిమ్మల్ని అరెస్టు చేసి బొక్కలో తోసేస్తారు. అట్లా మన ఆలోచనలను, ఆకాంక్షలను, అభిప్రాయాలను కట్టడి చేసే కొత్త తరం దొరలు, నయా నిఘా వర్గాలు, మన ఆలోచనలను అరెస్టు చేసే 'థాట్ పోలీసులు',మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో చెప్పే తత్వ బోధకులు ఇప్పుడు తయారుగా ఉన్నారు. వాళ్ళందరికీ మన పాలక వర్గాలు పహారా కాస్తుంటాయి. అవసరమైతే పాదపూజ చేస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజ్యం నిలబడింది, నిలబడాలని కలగంటోంది అలాంటి వాళ్ళ కాళ్ళ మీదే!


మొన్నకు మొన్నబొంబాయిలో ఎవరో ఒకరుచనిపోయారు. అదికూడా దాదాపు ఎనభై ఏళ్లకు పైగా బతికి సహజంగానే చనిపోయాడు తప్ప మరొక రకంగా కాదు. జనన  మరణ గణాంకాల ప్రకారం అలాదేశంలో ప్రతి సెకనుకు ఒకరికంటే ఎక్కువమందే చనిపోతున్నారు. కానీ ఆరోజు చనిపోయింది మాత్రం మనిషికాదు. పులి. ఆ నగరానికే పెద్దపులి. దాదాపు అర్ధ శతాబ్దం పాటు  ఆ నగరాన్ని, ఆ నగరానికి బతకడానికి వచ్చిన మూగజీవాలను తన అరుపులతో హడలెత్తించిన పులి. ఒక్క మరాఠీ  జాతి తప్ప మరెవ్వరూ బొంబాయిలో కాలరేగిరేసి బతకడానికి వీలులేదని శాసించిన వ్యక్తి. ఆయన ప్రాంతీయ వాదిగా కొందరు చెపుతుంటారు. కానీ అది ప్రాంతీయ వాదం కాదు,ప్రాంతీయ, జాతీయ విద్వేషం.  తెలంగాణలో కూడా ప్రాంతీయ వాదం ఉంది. కానీ ప్రజాస్వామికంగా, న్యాయబద్ధంగా ఉంది.


1960 చివర్లో బతుకుదేరువుకోసం బొంబాయి వెళ్ళిన  తెలంగాణాబిడ్డల్ని తరిమి తరిమి వెంటాడినవ్యక్తి, మహారాష్ట్ర అంటే మరాఠీ ల జాగీరని చెప్పిన వ్యక్తి. దక్షిణాది రాష్ట్రాల ప్రజలను లుంగీ వాలాలని అవహేళన చేసి, ఉద్యోగాలుచేయకుండా చేసిన వ్యక్తి. తన ప్రతాపమంతా వలసకూలీల మీద, బీహారీ టాక్సీ డ్రైవర్ల మీద, చిన్నా చితకా వ్యాపారుల మీదా చూపించి బోంబాయి నగరాన్ని తన కబంద హస్తాలలో ఉంచుకున్న వ్యక్తి. అతనొక నియంత. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదు నియంతృత్వాన్ని సమర్థించాడు,  అనుసరించాడు, ఆచరించాడు. ఆయన జర్మన్ నియంత హిట్లర్ ప్రేమికుడు. తనను తాను హిట్లర్ తో పోల్చుకున్నాడు. హిట్లర్ కు తనకు చాలా సారూప్యత ఉందని, అలవాట్లు, పద్ధతులు హాబీలు వృత్తి వ్యాపకాలు, మనస్తత్వం ఇద్దరిదీ ఒకటే నని చెప్పుకున్న వ్యక్తి. ఆయన ప్రజాస్వామ్యానికి పచ్చివ్యతిరేకి. భారత దేశానికిప్రజాస్వామ్యం పనికి రాదనీ,నియంత్రుత్వమే పరిష్కారమని పదేపదేప్రభోదించిన వ్యక్తి. దేశమంతాఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీఉక్కుపాదం కింద నలిగి పోతుంటే ఆమెకు మద్దతు తెలిపి ఆమెఅరాచక ధోరణిని సమర్ధించిన వ్యక్తి. ఆయన పేరు బాల్ థాకరే . ఆయనమరణంతరువాత ఆయనకు గౌరవ సూచకంగా బంద్ పాటించాలని ఆయన అనుచరులైన సైనికులు పిలుపునిచ్చారు. బంద్ ప్రశాంతంగా ఉండదని ఊహించిన పోల్లీసులు భారీగా బలగాలు దించి సహకరించారు. ఆ సేనలు అన్ని షాపులను దగ్గరుండి మరీమూయించాయి. రైళ్ళు, బస్సులు ఆన్నీ నిలిచిపోయాయి. అంతే ముంబాయి మూత పడింది.


ఈ సంఘటనలు కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఎదో ఒక రకంగా స్పందిస్తారు. మనిషన్నాక స్పందించి తీరాలి. చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. అందులో షహీన్ అనే  యువతీ కూడా ఉంది. మేనేజ్మెంట్ లో డిగ్రీ చేసిన ఆ యువతీ తన భావాలను నిర్మొహమాటంగా తన మిత్ర్హులతో పేస్ బుక్ ద్వారా పంచుకుంది.  అది ఆమె హక్కు. ఎ మనిషయినా తన మనసులో కలిగిన భావాలను, అభిప్రాయాలను ఇతరులతో పన్చిఉకొవక్చని, ఎటువంటి మాధ్యమంద్వారా  అయినా దానిని ప్రచారం చేసుకోవచ్చు నని రాజ్యాంగం చెపుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(ఎ)(బి) పౌరుడికి  భావప్రకటన స్వేచ్చను కల్పించాయి. నిజానికి మన పత్రికలు, తెలీవిజన్ చానల్లు కూడా మనిషికి ఉండే ఈ రాజ్యంగా హక్కును అడ్డుపెట్టుకునే నడుస్తున్నాయి. మీడియా ఏదయినా అడినిర్వహిస్తోన్న పాత్ర భావ ప్రసరణ. వ్యక్తులు, సమూహాల అభిప్రాయాలను, భావాలను ఇతరులకు చేరవేయడం కోసమే మీడియా పుట్టింది. అలాగే సోషల్ మీడియా కూడా. పత్రికలు, టెలివిజన్ ల లాగే  ఇప్పుడు  సోషల్ మీడియా విస్త్రుత  ప్రచారం లోకి వచ్చింది. అందులో పేస్ బుక్ కు విపరీతమైన ఆదరణ ఉంటోంది.  వ్యక్తులు తమ భావాలు,ఉద్వేగాలను , అభిప్రాయలు అంచనాలను పదిమందితో అదీ వారి మిత్రులతో పంచుకోవడానికి ఈ సోషల్ మీడియా సైట్లు ఉపయోగపడుతున్నాయి. అలా తన మనసులోని ఉద్వేగాలను షహీన్ తన పేస్ బుక్ ప్రొఫైల్ లో రాసుకుంది. ప్రొఫైల్ అంటే ఓపెన్ డైరీ లాంటిది. మీరు ఏదయినా అందులో రాసుకోవచ్చు. అది మీ మిత్రులతో పంచుకోవచ్చు.


 షహీన్ తన భావాలను ఈ విధంగా రాసి మిత్రులతో పంచుకుంది. ''ప్రతిరోజు వేలమంది మరణిస్తుంటారు. అయినా ప్రపంచం ముందుకు సాగిపోతూనే ఉంటుంది. కాని ఒక రాజకీయ వేత్త  సహజమరణం పొందినపుడు ప్రతి ఒక్కరూ ఆవేదనకు గురవుతారు. ఇష్టాన్ని బట్టిగాక బలవంతంగా అలా జరుగుతుందని వారు తెలుసుకోవాలి. ఎవరివల్లనైతే స్వేచ్ఛాయుత భారతీయులుగా మనం జీవిస్తున్నామో అటువంటి షహీద్‌ భగత్సింగ్‌, సుఖదేవ్‌, రాజ్ గురు, ఇంకా అటువంటి వారికి ఎవరైనా కొంత గౌరవంచూపి, లేదా రెండు నిముషాల మౌనం పాటించి ఎంతఎంత కాలం అయ్యిందో కదా? గౌరవాన్ని ఆర్జించాలి, పొందాలి. అది బలప్రయోగం ద్వారా కాకూడదు. ఈ రోజున ముంబయి గౌరవంతో గాక భయంతో మూతపడింది''. ఇది ఆమె అభిప్రాయం. ఆమె సగటు మనిషి కాబట్టి, ఆమెకు మనసు, ఆలోచనలు ఉన్నాయి కాబట్టి సహజంగానే కలిగిన అభిప్రాయం. అందులో ఇతరులను కించపరచడం గానీ, అవమానించే వ్యాఖ్యలు గానీ, అనవసర మాటలు గానీ లేవు. నిజానికి ఆమె ఎవరి పేరును కూడా ఎత్తలేదు. కేవలం తన భావాలు పంచుకుంది. ఇలాంటప్పుడు, ఇలాంటి బలవంతపు బందులు చూసినప్పుడు దేశంకోసం మరణించిన వారికోసం ఒక్క నిమిషం ఆలోచించక ఎంతకాలమయ్యిందో కదా అనిపిస్తుంది. అదే ఆమెకు కూడా అనిపించి రాసింది. అది ఆమె హక్కు. కానీ పోలీసులు ఆమె చేసింది నేరమంటూ అరెస్టు చేసారు. అలాంటి  దేశభక్తి భావాలున్నందుకు అరెస్టు  చేసి ఆమె మీద మతాలమధ్య చిచ్చు పెట్టె ఆలోచన చేసిందని అభియోగం మోపారు. అక్కడితో ఆగకుండా ఆమె పోస్టు ను చదివి బాగుంది అని 'లైక్' చేసిన రేణు శ్రీనివాసన్ అనే మరో అమ్మాయిని కూడా పోలీసులు అరస్టు చేసారు. ఆమె భావాలు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేవిగా ఉన్నాయట.! ఈ ఇద్దరిమీదా ఇండియన్ పీనల్ కోడ్ లోని 505 ( 2), 295 ఎ, తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని 66 ఎ, ప్రకారం కేసులు పెట్టారు. ఆ అరెస్టులను చూసి దేశమంతా ముక్కున వేలేసుకుంది. కొద్దో గొప్పో ఇంకా ప్రజాస్వామిక స్పృహలో ఉన్నవాళ్ళు ఒక్కొక్కరుగా స్పందించడంతో ఇప్పుడు పోలీసు చర్య పెద్ద వివాధమై కూర్చుంది. పోనీ చట్టం తన పని తాను చేసుకుంటుందని సరిపెట్టుకున్నారా అంటే అదీలేదు. బాల్ థాకరే భక్తులు ఆ యువతీ ఇంటిమీద, బందువుల ఆస్తుల మీద దాడి చేసి కోట్లాది రూపాయలు నష్టం చేసారు. విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇప్పుడు చట్టం, పోలీసులు, ప్రభుత్వం తప్పు సవరించుకుని వారిద్దరినీ వదిలేసినా వీళ్ళు మాత్రం వదిలే స్థితిలో లేరు.  వాళ్ళిప్పుడు థాకరే తమ దేవుడని చెపుతున్నారు.


మనిషిగానే మారణ హోమాన్ని సృష్టించిన  థాకరే  నిజంగానే దేవుడయి కూర్చుంటే మరీ ప్రమాదం. ఎందుకంటే ఆయన బతికుండగానే రాజ్యాంగాన్ని, చట్టాన్ని పనిచేయనీయలేదు. ఆయన చెప్పిందే రాజ్యాంగం, చేసిందే శాసనం. కేవలం నియంతృత్వ ధోరణే కాదు చట్టం, న్యాయం, రాజ్యాంగంతో సమాంతరంగా పనిచేసి,  ఏ అధికారం లేకున్నా బొంబాయి నగరాన్ని శాసించిన వ్యక్తి థాకరే. ఒక దశలో ఆయన ఉగ్రవాదులను మించి ప్రకటనలు చేసారు. ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకంగా చట్టం అనుమతించని మాటలు, భావోద్వేగాలు రెచ్చగొట్టి విద్వేషాల విషం విరజిమ్మే ప్రకటనలు చేసారు. భారత రాజ్యంగ స్ఫూర్తి వ్యతిరేకంగా ఆయన ఇస్లాం కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అంతటితో ఆగకుండా హిందూ మానవ బాంబులుగా మారాలని యువతను రెచ్చగొట్టి అలజడి సృష్టించారు. అట్లా అనుకుని ఆయన హిందూ రాజకీయ సిద్ధాంతాలు నమ్మినవాడని అనుకుంటే పొరపాటు. ఆయన పక్కా సంకుచిత వాది. ఉత్తర భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు వాళ్ళ ప్రాంతీయ పండుగ చ్చ్చాత పూజ చేసుకుంటే అడ్డుపదడమే కాక ఆ పూజలో పాల్గొన్న పార్లమెంటు సభ్యలను కూడా బెదిరించాదాయన. ఆయన తీరును  యావత్ పార్లమెంటు హక్కుల తీర్మానం పెట్టి మరీ ఖండించింది. చివరకు ఆయన పార్టీలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాల నేతలు కూడా థాకరే ధోరణిని ఖండించి పార్టీ వదిలి వెళ్ళాల్సి వచ్చింది. 'పంజాబ్ లో ఖలిస్తాన్ కు, కాశ్మీర్ ఉగ్రవాద మిలిటెంట్లకు, శివసేనకు పెద్ద తేడా లేదని అన్నవారూ ఉన్నారు.


అయినా సరే థాకరే ముద్ర చాలా మందికి నచ్చింది.  దేశంలోని అన్ని పత్రికలు ఆయన మరణ వార్తను పతాక శీర్షికలలో ప్రచురించాయి.  చానల్లు చర్చలు పెట్టాయి. ఈ దేశ ప్రధాని తో సహా అనేకమంది ఆయనను అజరామరుడిగా కీర్తించారు, కొనియాడారు! ప్రజాస్వామిక విలువలకు, ఆకాంక్షలకు విరుద్ధంగా ఉండే మనుషులు హటాత్తుగా ఎదో ఒకరోజు మరణించగానే మహానుభావులై పోయే పరిస్థితి కొత్తగా వచ్చినదేమి కాకపోయినా, ఇప్పుడు ఆయన ఆత్మ శాంతికోసం బొంబాయి పోలీసులు అతిగా ప్రవర్తించి  రాజ్యాంగం ఇచ్చిన  భావ ప్రకటన  సేచ్చాను హరించే చర్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మీద ప్రెస్ కౌన్సిల్ ఫ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ మాట్లాడిన తరువాత పరిస్థితి  మారింది గానీ లేకపోతే ఎవరూ పెద్దగా స్పందించే వాళ్ళు కూడా కాదు.


 ఎందుకో ఏమోగానీ చాలా మంది ఈ మధ్య ఎవరు నిజాలు మాట్లాడినా భరించలేక పోతున్నారు. అభిప్రాయాలు, భావాలు చెప్పినా విమర్శలుగానో, తిట్లుగానో, తీవ్రమైన అభాందాలుగానో భావించి గాబరా పడిపోతున్నారు. నిజాలు మాట్లాడినా సరే నిలువునా రగిలిపోయి ఒంటికాలిమీద లేస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్ళయితే మరింత రెచ్చిపోతున్నారు.  అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, పార్టీల నేతలను ఏమన్నా సరే ఇప్పుడు తట్టుకునే స్థితిలో లేరు. ఆమధ్యన ఒక కార్టూనిస్ట్ అన్నా హజారే క్యంపైన్ కు ప్రభావితుడై అవినీతికి వ్యతిరేకంగా ఒక కార్టూన్ వేశాడు. అది పార్లమెంటు ను కించ పరిచేడిగా ఉందని ఆ కార్టూనిస్టు మీద ఇదే బొంబాయి పోలీసులు రాజద్రోహం కేసులు  పెట్టి అరెస్టు చేసారు. అలాగే మమతా భేనర్జీ ని వ్యంగంగా చిత్రించినందుకు జాదవ్ పూర్ యూనివర్సిటీ ప్రోఫెస్సోర్ను అరెస్ట్ చేసారు.  వీటన్నిటికి పరాకాష్టగా చిదంబరం చేష్టలను చెప్పుకోవచ్చు.  తన కొడుకు మీద త్వీటర్ లో కామెంట్ చేసినందుకు  పాండిచ్చేరికి చెందినా ఒక వ్యాపారిని అరెస్టు చేయించారు.  చిదంబరం గతంలో  ఇవే సాకులు చెప్పి నోరులేని ఆదివాసుల పక్షాన మాట్లాడుతున్న అరుంధతి రాయ్ గొంతునోక్కాలని చూసాడు. మొన్నటికి మొన్న అమ్మ గారి అల్లుడి అవినీతిని బట్టబయలు చేసినందుకు కాంగ్రెస్ నేతలు అరవింది కేజ్రివాల్ మీద కూడా దేశద్రోహం, రాజద్రోహం లాంటి కేసులు పెడతామని బెదిరించారు.


ఇట్లా చట్టాన్ని ఎవరికీ తోచిన రీతిలో వాళ్ళు వాడేసుకుని  ఎదుటివాడి నోరు నొక్కే విధంగా ప్రవర్తిస్తున్నారు. చట్టం పరిధిలో నేరుగా అలా వీలు కానప్పుడు దొడ్డి దారిలో మిగితా చట్టాలను వాడేసుకుంటున్నారు.  పాపం బాల్ థాకరే ఒక్కడే కాదు. బలమున్న ప్రతి ఒక్కరూ ఆయన వారసులే. అదే నియంతృత్వం, అదే ఫాసిస్టు ధోరణి ఇప్పుడు చాలామందికే అబ్బుతున్నాయి. మన రాష్ట్రంలోనే చూడండి. తెలంగాణా  ఉద్యమ నాయకుడిగా జే ఎ సి చైర్మన్ గా కోదండ రాం    తెలంగాణా ప్రజల పక్షానఒక సమిష్టి ప్రకటన చేసారు. దానిని గీతారెడ్డి ఒక విమర్శగా స్వీకరించి స్పందించవచ్చు. లేదా అదే స్థాయిలో సమాధానం చెప్పి ఉండవచ్చు. కానీ ఆమె హటాత్తుగా దళితురాలిగా మారిపోయింది. మూడు దశాబ్దాల క్రితమే రెడ్డి అనే వారసత్వ పదాన్ని తన పేరులోంచి తీసి వేసి, పీడిత, తాడిత దళిత వర్గాలతో, అవసరమయినప్పుడు  న్యాయానికి గుర్తులుగా ఉన్నప్పుడు నక్సలైటు శక్తుల తో సహా అణగారిన వర్గాలకు అందరికీ అండగా ఉన్న కోడండ్ ఇప్పుడు కోదండ రామి రెడ్డి అయిపోయాడు. దాదాపుగా అదే కాలంలో జెట్టి ఈశ్వరీ భాయి కూతురుగా పుట్టిన  జెట్టి గీత తన వారసత్వ దళిత అస్తిత్వాన్ని వదిలేసి రెడ్డి కులాంతీకరణం చెంది దొరసానిగా చెలామణి అవుతున్నా  హటాత్తుగా దళిత మహిళగా అవతారమెత్త గలుగుతున్నారు.

నిజానికి  ఉపముఖ్యమంత్రిగా దామోదర రాజ నరసింహ తో గీత గారు పోటీ  పడ్డప్పుడు ఆమె ఉట్టి  గీత కాదని గీత రెడ్డి అని వాదించిన వాళ్ళు, అసలు ఆమె దళితురాలే కాదని, ఎప్పుడో రెడ్డి గా మారిపోయిందని చెప్పినవాల్లె ఇప్పుడు గీతా రెడ్డి గారిని దళిత మహిళను చేసేశారు.  ఆమె ఇప్పుడు అన్యాయంగా, అధర్మంగా ఉన్నా సరే ఎవరూ ఏమీ అనకూడదు. ఏది న్యాయమో, ఏది ధర్మమో చెప్పకూడదు. ప్రజల పక్షం ఉండమని అడగకూడదు. కనీసం ఒక తెలంగాణా బిడ్డగా తన తల్లి మార్గంలో నడవాలని కూడా ఆశించకూడదు. అసలు ఆమెపట్ల మీ అభిప్రాయమే చెప్పకూడదు. నోరు తెరిచి ఏమయినా మాట్లాడారో ఎస్ సి ఎస్ టీ చట్రంలో ఇరుక్కుపోతారు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే రాజద్రోహం కిందో వీలయితే దేశద్రోహం కిందో మీ మీద కేసులు పెడతారు. పెట్టకపోతే పెట్టితీరాలని ఆందోళన చేసే ఉద్యమకారులు పుట్టుకువస్తారు. వాళ్ళు మీ ఇంటిముందర ధర్నాలకు దిగి మీ మైండ్ ను ముట్టడిస్తారు. మనం ఒక్క మాట అంటామో  లేదో ఎవరో ఒకరు ఎదో ఒక రూపంలో విరుచుకు పడడానికి సిద్ధంగా ఉంటున్నారు. అది కులమో, మతమో, ప్రాంతమో రూపమేదయినా కావొచ్చు. మాటా పలుకూ లేకుండా మన మనోభావాలను పంచుకోకుండా అంతా  గప్ చుప్ గా ఉండండి.  మనమిప్పుడు థాకరే రాజ్యంలో తాకట్టుపడి ఉన్నాం.

శుక్రవారం, నవంబర్ 16, 2012

పాపం పురోహితులు...




ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలకంటే సినిమాలే ఎక్కువ వివాదాస్పదం అవుతున్నాయి. కెమరామెన్ గంగతో రాంబాబు మొదలు పెట్టిన గొడవలు  దేనికైనా రెడీ అని మోహన్ బాబు కుటుంబం నడివీధిలో నిలబడి బ్రాహ్మణులను సవాలు చేయడంతో తారాస్థాయికి చేరుకున్నాయి. విమెన్ ఇన్ బ్రాహ్మనిజం అనేసినిమా బ్రాహ్మణులను ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీలను కించపరిచే విధంగా అసభ్యంగా చూపించిదని అలాగే దేనికైనా రెడీ సినిమాలో కూడా బ్రాహ్మణ కులాన్ని వెకిలిగా చూపి అవమానించారన్నది బ్రాహమన సంఘాల అభియోగం. అయితే ఒకటి రెండు దళిత సంఘాలు మినహా ఈ అభియోగాలను ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. మోహన్ బాబు ఇంటిముందు, ఆ తరువాత సినిమా థియేటర్ల ముందు బ్రాహ్మణులు చేస్తున్న ధర్నాలు, ఆందోళనల్లో కూడా మిగితా కులసంఘాలు ప్రజాసంఘాలు పాల్గొంటున్నట్టు లేదు. అలాగే రాజకీయ పార్టీలు కూడా బ్రాహ్మణుల ఆందోళనలో భాగం కావడం లేదు. దేవుడికి అపచారం జరిగిందనో,  గుడి దగ్గర గొడవ జరిగిందనో ఆందోళనలకు దిగే హిందూ మత ప్రచారక సంఘాలు, పార్టీలు కూడా ఈ విషయం లో పెదవి మెదపడం లేదు. ఒక రకంగా బ్రాహ్మణులు ఈ విషయంలోఒంటరి పోరాటమే చేస్తున్నారు. పోనీ బ్రాహ్మణులంతా సంఘటితంగా ఉన్నారా అంటే అదీ లేదు. ఇప్పుడు సాగుతోన్న ఆందోళనల్లో ఆత్మాభిమానం కలిగిన పేద బ్రాహ్మలు, కొద్దో గొప్పో ఉద్యమాలతో మమేమకమై కదిలిన వాళ్ళు మినహా అగ్రవర్గ బ్రాహ్మలెవరూ కనిపించడం లేదు. 

ఈ బలహీనత తెలిసే మోహన్ బాబు మరింత రెచ్చగోట్టీ రీతిలో మాట్లాదుతున్నాడు. ఈ సినిమా ఎంత రచ్చ కెక్కితే ఆయనకు అంత వ్యాపారం జరుగుతుంది. చాలా కాలంగా పరాజయాల పాలయి చితికి పోయిన ఆయన కుటుంబానికి ఒక రకంగా బ్రాహ్మణుల ఆందోళన జీవం పోసింది. ఆ సినిమాల్లో ఏముంది? ఎందుకవి వివాదాస్పదం అయ్యాయి? అన్న విషయాలు వదిలేస్తే ఏ కులాన్నయినా వెకిలిగా చూపడం, అవమాన పరిచే రీతిలో ఆ కుల పాత్రలను రూపొందించి కథ నడపడం అనైతికం. కానీ తెలుగు సినిమా పాత్రలన్నీ ఇటువంటి అనైతిక పాత్రల చిత్రణ తోనే సాగుతుంటాయి. విలన్లు, రౌడీలు తెలంగాణా ప్రాంతం వాల్లయినట్టే పనిమనుషులు ఉత్తరాంధ్ర వాళ్ళో లేక ఇంకొక వెనుకబడిన ప్రాతం వాళ్ళో అయి ఉంటారు. అలా గే దేశ ద్రోహులు, దుర్మార్గులు మైనారిటీలో, దళితులో లేదా బహుజన కులాల వాళ్ళో అయి ఉంటారు. తెలుగు సినిమా మొదటినుంచీ కులాన్ని, మతాన్ని  ప్రస్తావిన్చాకుండానే ఆయా పాత్రల వేషధారణ, చిత్రణతో వాళ్ళు ఏ కులం వాళ్ళో చెప్పేస్తుంది. పాత సినిమాల్లో స్మగ్లర్లంతా రాబర్ట్ లో, థామస్ లో ఉన్నట్టే వాంప్ లు  లూసీ లు,జూలీ లు ఉంటారు. అలాగే ఈ కాలంలో వీధి రౌడీలంతా నర్సింగ్ లు, శ్రీశైలం పేర్లతోనే ఉంటారు. ఒక్క రాయలసీమ ఫాక్షన్ సినిమాల్లో తప్ప మరెక్కడా ప్రతినాయకులకు అగ్రవర్ణం పేర్లుండవు. 

సమాజంలో బ్రాహ్మణులు అగ్రవర్ణాగ్రేసరులే  అయినప్పటికీ సినిమా రంగం మాత్రం వాళ్ళను అల్పులుగానేచూపిస్తోంది. బూతులు మాట్లాడేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, చాపల్యం ఉన్నవాళ్ళు, తిండిపోతులు ఇట్లా అనేకఅల్పపు పాత్రల్లో వారి వేషధారణ తో చేష్టలతో నవ్వు తెప్పించే సన్నివేశాల్లో మొదటి నుంచీ బ్రాహ్మణులే కనిపిస్తారు. తెలుగు సినిమా మొదటినుంచీ బ్రాహ్మణుడిని విదూషకుడిగానే పరిగణిస్తూ వచ్చింది తప్ప  ఎప్పుడూ నాయకుడిగా చూపలేదు. దానికి తమిళ సినిమా ప్రభావం, ద్రావిడ ఉద్యమం కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. దానికి తోడు సినిమా రంగంలో పెట్టుబడి కూడా ఒక కారణం. తెలుగు సినిమా ఇవాళ ఈ స్థాయికి రావడానికి ఒకటి రెండు కులాలు, ఒకటి రెండు జిల్లాలే కారణం. మొదటి నుంచీ కోస్తా ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలే సినిమాను ఏలుతూ వచ్చాయి. ఆ తరువాత గోదావరి జిల్లాలు తోడయ్యాయి.  ఈ జిల్లాల్లో హరిత విప్లవం, భూస్వామ్యం, వ్యవసాయరంగ విస్తరణ, అభివృద్ధి అది తెచ్చిన సంపద నేరుగా మద్రాస్ కు వెళ్లి పెట్టుబడిగా మారి సినిమా రంగాన్ని ఆక్రమించింది.  అప్పటిదాకా గ్రామాల్లో పెత్తనం సాగించిన భూస్వాములు, రైసు మిల్లర్లు, చిన్న చితకా రాజకీయ నాయకులు నేరుగా ప్రొడ్యూసర్స్ గా, అందులో కొంత తెలివితేటలు ఉన్న వాళ్ళు డైరెక్టర్స్ గా మారిపోయారు. మొట్టమొదట నాటక రంగంలో అనుభవం ఉన్న వాళ్ళు, అభినయం తెలిసిన వాళ్ళు, సినిమాకు పనికొచ్చే వాక్షుద్ధి  ఉన్న వాళ్ళు బ్రాహ్మలే అయినందువల్ల వాళ్ళు నటులుగా ఉండేవాళ్ళు. కానీ భూస్వామ్య కుటుంబాల పిల్లలు ఎదిగి వచ్చాక వాళ్ళే కథానాయకులు గా తెరమీదికి వచ్చారు. వాళ్ళే గడిచిన మూడు తరాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక దశలో కమ్మ భూస్వామ్య వర్గాలు తెలుగు సినిమా రంగాన్ని పూర్తిగా కైవసం చేసుకున్నాయి. 

అయితే దాన్ని గోదావరి జిల్లాల కాపులు తరువాతి కాలంలో కొంతమేరకు నిలువరించే ప్రయత్నం చేసారు.తొలి తరంలో కొద్దో గొప్పో త్రిపురనేని రామ స్వామి చౌదరి వ, రఘుపతి వెంకయ్య లాంటి వారి సంస్కరణ వాదుల ప్రభావం ఉండడం వాళ్ళ సినిమాల్లో కొద్దో గొప్పో సందేశం సామాజిక ఎజెండా ఉండేది. తరువాతి కాలంలో ఈ వర్గాలే సినిమా స్టూడియో లు స్థాపించి క్రమక్రమంగా దాన్నొక లాభసాటి వ్యాపారం చేసుకున్నాయి. మధ్యలో కొద్దో గొప్పో కమ్యూనిస్టు భావాలున్న వాళ్ళు, ప్రజానాట్యమండలి లో పనిచేసి అభ్యదయ భావాలు ఉన్న అనేకమంది సినిమా రంగంలో చేరి కొంతకాలం దాన్ని ప్రాజా పక్షం ఉండే విధంగా చూసినా ఆ తరం అంతరించి పోయాక సినిమా పూర్తిగా ఏకపక్షమే అయ్యింది. ఈ వ్యాపారులు నేరుగా కులం పేర్లతో నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి వంటి కులాల పేర్లు కలిగిన సినిమాలు తీయడం మొదలు పెట్టి వల్లే ఆ గ్రామాన్ని, ప్రాంతాన్ని మొత్తం సమాజాన్ని కాపాదేవాల్లుగా సినిమాలు తీసే స్థాయికి చేరుకున్నారు.  సినిమా రంగాన్ని శాసిస్తున్న కులాలు, ప్రాంతమే ఇప్పుడు పత్రికలు, టీవీ మాధ్యమాల మీద కూడా ఆధిపత్యం సాగిస్తున్నాయి. మొత్తంగా సమాజం మీద బలమైన భావ ప్రసరణ, ప్రభావం కలిగించే మాధ్యమాలన్నీ ఒకే వర్గం చేతుల్లో ఉన్నాయి. కాబట్టీ బ్రాహ్మణులు  ఆత్మ గౌరవం కోసం చేస్తోన్న నిరసన పెద్దగా ప్రచారానికి కూడా నోచుకోవడం లేదు. 

తెలుగు సినిమాలో బ్రాహ్మణుల పాత్ర గానీ, భాగస్వామ్యం గానీ లేకుడా పోవడం దీనికి ఒక కారణం అయితే మొత్తం సామాజిక వ్యవస్థకు వాళ్ళు దూరం కావడమే ఇవాల్టి దురవస్థకు ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు.   మాటల రచయితలుగా, కవులుగా, గాయకులుగా చాలాకాలమే ఉన్నా వాళ్ళు పెట్టుబడి దారుడైన నిర్మాత చేతిలో డబ్బుకు దాసోహమై పోయారు. అందుకే మోహన్ బాబు తన సినిమా కథ రాసింది, నటించిందీ బ్రాహ్మలేనని దబాయిస్తున్నారు. ఈ మాటే ఒక టీవీ చర్చలో నేను ఏవీఎస్ అనే నటున్ని అడిగితే మేం పొట్టకూటికోసం నిర్మాతలు ఏం చెపితే అది చేసే వాళ్ళం. అని చెప్పారు. అంతే కాదుడబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళు చెప్పింది చేయాల్సి ఉంటుంది అని కూడా అన్నారు. ఆయన మాటల్లో తన నిస్సహాయత కనిపించింది. బ్రాహ్మణులను కించ పరిచే సన్నివేశాలను వేషాలు వేసి బతికేవాళ్ళు అడ్డుకోవాలనుకోవడం భ్రమ. అది వాళ్ళ వృత్తి. నిజానికి సినిమా రంగంలో చిల్లర వేషాల్లో తప్ప బ్రాహ్మణులు పెద్దగా కనిపించరు.  బ్రాహ్మలు  అందివచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకుని సృజనాత్మక కళారంగాలు వదిలి మిగితా వృత్తులలోకి మారిపోయారు. చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల్లో, డబ్బులున్న వాళ్ళు వ్యాపారాల్లో, వారసత్వ బలమో బలగమో ఉన్న వాళ్ళు రాజకీయాల్లో స్థిరపడి పోయారు. ఒక రకంగా ఇప్పుడు సినిమా రంగంలో మిగితా కులాల్లాగే బ్రాహ్మలు మైనారిటీలు. వాళ్ళు చాలా కాలం కిందే వదిలేసిన రచనా వ్యాసంగంలో శూద్ర కులాల్లోని సృజన శీలురు చేరిపోయారు. అయినంత మాత్రాన బ్రాహ్మణులను కించ పరచవచ్చా అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. 

నిజానికి ఏ కులాన్ని గానీ కులవ్రుత్తిని గానీ కించపరిచే విధంగా చిత్రించడం అవివేకమే కాదు, హక్కుల ఉల్లంఘన కూడా. అది బ్రహ్మలయినా, దళితులయినా, ఇతర ఎకులమైనా వర్తించ వలసిన నియమం. కానీ తెలుగు సినిమా నీతి నియమాలను వదిలేసి ఇప్పుడు పూర్తిగా కార్పోరేట్ వ్యాపారమై కూర్చుంది. ఇప్పుడు తెలుగు సినిమా ఒక బ్రాండ్స్ ఫ్యాక్టరీ.! ఎన్టీఆర్ కుటుంబం, అక్కినేని కుటుంబం, కృష్ణ కుటుంబం, రామానాయుడు కుటుంబం, చిరంజీవి కుటుంబం ఈ కుటుంబాల్లోని వారసులను బట్టి కథలు, వాళ్ళ రేంజ్ కి దాగిన మాటలు, పాటలు ఆ మేరకు వందల కోట్ల పెట్టుబడి దానినుంచి వేలకోట్ల వ్యాపారం ఈ కుటుంబాలు చేస్తున్నాయి. 

వ్యాపారం ఏదయినా సరే అందులో లాభానష్టాలే ఉంటాయి తప్ప నైతిక విలువలు ఉండవు.సినిమా కూడా అంతే. కానీ ఇప్పుడు బ్రాహ్మలు అందులో నీతి ఉండాలని అంటున్నారు. సినిమాకు కొన్ని నియమాలు ఉండాలని కూడా కోరుకుంటున్నారు. అది ఒక రకంగా అత్యాశే అవుతుంది. ఎందుకంటే ఒకప్పటిలా సమాజం ఎలా ఉండాలో శాసించే స్థాయిలో ఇప్పుడు బ్రాహ్మలు లేరు. పైగా సమాజంలోని చాలా వర్గాలకు బ్రాహ్మణులు చాలా దూరంగా ఉంటూ వచ్చారు. పైగా ఇప్పుడు బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం బలపడడం కూడా ఒక కారణం. నిజంగానా బ్రాహ్మణ వాద విలువలకు, బ్రాహ్మణీయ సంకృతికి వ్యతిరేకంగా కూడా చాలా సినిమాలే వచ్చాయి. స్వయంగా ఎన్టీ రామారావే పలు సినిమాలు బ్రాహ్మనీయ విలువలను విమర్శిస్తూ యమగోల వంటి పలు సినిమాలు తీశారు. అప్పుడు కూడా వ్యతిరేకత వచ్చినా ఆ సినిమాల్లో ఆయన  భావజాల విమర్శ చేసారు తప్ప వెకిలి తనంతో బ్రాహ్మణులను అవమాన పరచ\లేదు.ఆ పై అడ్డ దిడ్డంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మోహన్  బాబు మాత్రం ఆ పని చేస్తున్నాడు. బ్రాహ్మణుల సామాజిక బలహీనత ఆయనకు అర్థమయ్యింది. మన దేశంలో సినిమా రంగానికి ఉన్న స్వేచ్చ మరే రంగానికీ లేదు. ఎవరైనా ఎలాంటి సినిమాలయినా తీయవచ్చు. సెన్సార్ సర్టిఫికేట్ ఉంటె చాలు ఎక్కడైనా ప్రదర్శించు కోవచ్చు. నిజానికి మన సెన్సార్ బోర్డు పూర్తిగా రాజకీయ నాయకుల తాబెదార్లతో,  ప్రొడ్యూసర్ ల ఏజెంట్ లతో బ్రోకర్ లతో నిండిపోయింది. అందులో విలువల గురించి ఆలోచించే వాళ్లున్నా వాళ్ళ మాట చెల్లుబాటు కాదు. ఒక దశలో సెన్సార్ బోర్డ్ దేనికైనా రెడీ సినిమా ను ఆలస్యం చేసింది. కానీ మోహన్ బాబు తనదైన శైలిలో సెన్సార్ బోర్డ్ మీద విరుచుకు పడ్డారు. ఆ దెబ్బతో సెన్సార్ బోర్డు లో ఉన్న బ్రాహ్మణ సభ్యులు కూడా కళ్ళు మూసుకుని సినిమాను చూసి నోరు మెదపకుండా విడుదల చేసారు.

 సినిమా కేవలం వ్యాపారమే పరమావధిగా ఉండదు. పనిలో పనిగా  కీలకమైన విషయాల పట్ల సమాజపు ఆలోచనా ధోరణిని మార్చే ప్రయత్నం కూడా చేస్తుంది. చాలా సినిమాల్లో  ఒకానొక ముస్లిం పేరుతో విలన్ ఉంటాడు. అతడు దుబాయిలో ఉండే డాన్ అని సినిమాలో చెప్తున్నా అంతర్లీనంగా అటువంటి ముస్లిం లు మన అంతర్గత భద్రతకు ముప్పు అనే సందేశం అందులో ఉంటుంది. అటువంటి ప్రయత్నమే తెలంగాణా విషయంలో కూడా అనేక సినిమాల్లో జరిగింది. తాజాగా కెమరామాన్ గంగ తో రాంబాబు కూడా అనేక పాత్రల్లో, సంభాషణల్లో, సన్నివేశాల్లో తెలంగాణా వాదాన్ని, వాదుల్ని చీల్చి చెండాడే ప్రయత్నం చేసింది. ఒక్క సినిమాలే కాదు, మొత్తం మీడియా ఇప్పుడు తెలంగాణా అనేది ఒక సమస్య అనే భావిస్తున్నాయి తప్ప అది అనేక చారిత్రక సమస్యలకు, తప్పిదాలకు పరిష్కారం అని చెప్పలేక పోతున్నాయి. 

ఒక రకంగా బ్రాహ్మణులు  ఒక కులంగా సామాజిక వర్గంగా  హక్కులకోసం ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నప్పుడు వారికి మద్దతునివ్వడం ప్రజాస్వామిక లక్షణం కానీ వారికి ఆశించినంత మద్దత్తు దొరకక పోవడం విచారకరం.  మిగితా సామాజంతో బ్రాహ్మణులు మమేకం కాకపోవడం కూడా ఇవాళ వారిది ఒంటరి పోరాటం కావడానికి కారణం. తెలుగు సినిమాల్లో అశ్లీలత దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా వెర్రి తలలు వేస్తూనే ఉంది. స్త్రీని ఒక భోగ వస్తువుగా మాత్రమే చూపే అనేక సినిమాలు, వాటికి వ్యతిరేకంగా అనేక రూపాల్లో పోరాటాలు జరిగాయి. చైతన్యవంతులైన మహిళా సంఘాలు, విద్యార్ధి వర్గాలు వీటికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఆ సందర్భంగా ఒక్క బ్రాహ్మణులే కాదు, కుల సంఘాలేవీ అందులో క్రియాశీలంగా పాల్గొన లేదు. మన సమాజానికి స్త్రీ ని అసభ్యంగా చూపిస్తే ఎదిరించే శక్తి లేదు. అటువంటి స్పృహా ఉండి  ఉంటె ఎ విమెన్ ఇన్ బ్రాహ్మనిజం వంటి సినిమా వచ్చేది కాదు. కేవలం బ్రాహ్మణా స్త్రీలనే కాదు ఏ  స్త్రీని కూడా అలా చూపకూడదన్న సార్వజనీన విలువ గానీ, అటువంటి ప్రయత్నాలకు మదతుగానీ లేకపోవడం వల్ల  అటువంటి సినిమాలు వస్తున్నాయి. అలాగే దళితులనో, మిగితా వృత్తుల వాళ్లనో కించపరుస్తూ సినిమాలు తీసినప్పుడో, వార్తలు రాసినప్పుడో బ్రాహ్మణులు కూడా వాటిని వ్యతిరేకించి ఉంటె, అటువంటి ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ సాగిన పోరాటాల్లో బ్రాహ్మణులు కూడా భాగస్వాములై ఉంటె ఇవాళ బ్రాహ్మణ సంఘాల ప్రయత్నానికి మరింత బలం చేకూరేది. 

 కేవలం సినిమాల్లోనే కాదు మొత్తం సామాజిక రాజకీయ రంగాల్లో బ్రాహ్మణులు ఒంటరివాల్లయి పోతున్నారు. నిజానికి ప్రభుత్వం బ్రాహ్మణుల అభ్యంతరాలకు,  ఆందోళనకు వెంటనే స్పందించాల్సింది. కనీసం సినిమాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలున్నాయని ప్రభుత్వమే వేసిన కమిటీ నిర్ధారించిన తరువాతయినా ఆ సినిమా ను నిలిపివేయాల్సింది. అలా చేయకపోగా విషయం వివాదమై కోర్టుకు చేరేదాకా చూసి చేతులెత్తేసింది. గతంలో అనేక సందర్భాల్లో ఇటువంటి కులపరమైన అభ్యంతరాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించిన ప్రభుత్వం పాపం పురోహితులను మాత్రం పట్టించుకోలేదు. అది బ్రాహ్మణుల బలహీనత, అనైక్యత తో పాటు వాళ్ళు ఓటు బ్యాంకు కాకపోవడం కూడా ఒక కారణం. సమాజంలో బ్రాహ్మణులు ఇప్పుడు అసంఘటిత అల్పసంఖ్యాక వర్గం. వాళ్ళను ఓట్లకోసం బుజ్జగించవలసిన అవసరం లేదనే ప్రభుత్వాలు భావిస్తుంటాయి.    బ్రాహ్మణ మేధావులు కూడా ఇప్పుడు బ్రాహ్మణుల గురించి మాట్లాడడం అంటేనే భయపడుతున్నారు. అది కులతత్వమని ఎక్కడ అంటారోనని వాళ్ళ భయం. బహుశ గడిచిన రెండు మూడు దశాబ్దాలుగా జరుగుతున్న సిద్ధాంత చర్చలు, కులవ్యవస్థ వ్యతిరేక ఉద్యమాలు అవి వ్యాపింప చేసిన భావజాలం కారణంకావచ్చు. నిజానికి అవేవీ బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు. ఆ భావజాలానికి వ్యతిరేకం. కులం పుట్టుకకు కారణాలు ఎలావున్నా ఆ కులాన్ని పోషించడంలో,  కాపాడడంలో రాజ్యం తో పాటు ఇతర కులాల పాత్రను విస్మరించాలేము. బ్రాహ్మణులు ఈ సమాజంలో భాగం. ఈ నేలమీద పౌరాలకు లభించే అన్ని హక్కులు, అధికారాలు బ్రాహ్మణులకు కూడా ఉంటాయి. రాజ్యాంగం పౌరులను గుర్తించి కల్పించిన హక్కులన్నీ బ్రహ్మనులకు కూడా ఉంటాయి. ఉండాలి. అటువంటి ప్రజాస్వామిక ధోరణి  అలవాటు కాకపోవడం వల్లే ఇవాళ బ్రాహ్మణులు ఏకాకులుగా మిగిలి పోయారు. రేపు ఎవరినైనా ఏకాకులు చేయగలిగే సత్తా ఈకోస్తా పెట్టుబడికి ఉంది. అది అందరూ గమనించాలి. 

శుక్రవారం, నవంబర్ 02, 2012

చర్చలు జరపాల్సింది ఎవరితో?



తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్రావును చాలామంది కీలెరిగి వాతలుపెట్టే నేతగా పేర్కొంటారు. ఆయన వర్తమాన రాజకీయాలలో ఆరితేరిన వాడని, వ్యూహాలు ఎత్తుగడలు ఎరిగిన నాయకుడు అనీ అంటుంటారు. బహుశా సరైన సమయంలో తెలంగాణ నినాదాన్ని తలకెత్తుకున్నందుకు, అందరిలా మధ్యలో వదిలేయకుండా దానినొక బలమైన ఆకాంక్షగా మలచి జాతీయస్థాయిలోనిలబెట్టినందుకు, దానితో పాటు రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలనూ తెలంగాణకు అనుకూలంగా మార్చినందుకు ఆయనకు అటువంటి పేరు వచ్చి వుంటుంది. నిజంగానే దాదాపు ముప్ఫై సంవత్సరాలకుపైగా అటు కాంగ్రెస్ను, ఇటు తెలుగుదేశంను అతిదగ్గర నుంచి గమనించిన వ్యక్తి, అనేక పరాజయాల తరువాత డిసెంబర్ 9 ప్రకటనతో తెలంగాణకు తొలి విజయాన్ని అందించిన వ్యక్తిగా కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పడమే కాదు ఆంధ్రవూపదేశ్ రాజకీయాలను కూడా శాసించగలిగిన శక్తిమంతుడు. అందులో సందేహం లేదు. కానీ ఇటీవలి పరిణామాలు ఆయన ఊహించినట్టుగా లేవు

ఢిల్లీ నుంచి వస్తున్న సంకేతాలు ఆయన చెప్పినట్టుగా తెలంగాణకు అనుకూలం గా కనిపించడం లేదు. దీర్ఘకాల ఢిల్లీ పర్యటన తరువాత అక్టోబర్ మొదటివారంలో హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ చాలా ఆశాజనకంగా కనిపించారు. అతిత్వరలోనే ఢిల్లీ నుంచి తనకు పిలుపు రానుందని, రెండోవారంలో చర్చలున్నాయని మూడోవారంలో ముమ్మాటికి ప్రకటన వస్తుందని ఆయన తనను కలిసిన వారికి చెప్పారు. పార్లమెంటు సమావేశాలు ముగిశాక అక్టోబర్ రెండోవారం దాకా ఉత్తరాది ప్రజలు పీడరోజులుగా భావిస్తారు కాబట్టి తరువాత తనకు తుది చర్చల కోసం పిలుపు వస్తుందని ఎంతో నమ్మకంగా చెప్పారు. పీడరోజులు పోయి మూడువారాలూ గడిచిపోయాయి తప్ప పిలుపు మాత్రం రాలేదు. ఆయన చెప్పిన దానికి భిన్నం గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా తటస్థంగా ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వాళ్ళు నేరుగా కేంద్ర కేబినేట్లో చేరిపోయారు.

కేంద్ర కేబినేట్ కూర్పు గమనిస్తే కాంగ్రెస్పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేదని, పార్టీ విషయాన్ని మళ్ళీ ఎన్నికల దాకా నాన్చే ధోరణితో ఉన్నట్టు అర్థమౌతోంది. అందుకే రానున్న రెండు సంవత్సరాల పాటు అప్పుడప్పుడు తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళు, తెలంగాణకు అడ్డు తగిలేవాళ్లకు వేరే పని లేకుండా స్వేచ్ఛనిచ్చినట్టు కనిపిస్తోంది. పార్టీలో అంతో ఇంతో సీనియర్లు, తమకంటూ కొద్దో గొప్పో ప్రజాబలం ఉన్నవాళ్ళను వదిలేసిఅమ్మచేతి బొమ్మలను మాత్రమే కొలువులోకి తీసుకున్నా రు. వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ నోరు మెదప డం లేదు. కానీ కావూరి మొదలు రాయపాటి దాకా సమైక్యవాద సాంబశివరావులు శివాపూత్తుతున్నారు.

నిజానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణవాదాన్ని గౌరవించి ఉంటే వాదాన్ని వినిపిస్తున్న వారికి అవకాశం ఇచ్చి ప్రాంతవాసుల మనసులు గెలిచే ప్రయత్నం చేసేది. కానీ అలా జరగలేదు. అలాగే సమైక్యవాదం పేరుతో తెలంగాణ ఏర్పాటుకు అడ్డుగానిలుస్తున్న కావూరికో, లగడపాటికో, రాయపాటికో స్థానం కల్పించి మచ్చిక చేసుకునేది. అది కూడా జరగలేదు. ఎక్కడివాళ్ళను అక్కడే రంగంలో ఉంచి ఎటూ తేల్చుకోలేని తటస్థులను అందలం ఎక్కించడం చూస్తే పార్టీ ఆట ఇప్పుడే ముగించాలని అనుకోవడం లేదని అర్థమౌతున్నది.
నిజానికి కాంగ్రెస్ పార్టీ నైజమే అలాంటిది. పార్టీ తీసుకునే నిర్ణయాలేవీ నేరుగా ఉండవు. 2004 ఎన్నికల నాటి నుంచీ కాంగ్రెస్ పార్టీ తెలంగా విషయంలో ఆడుతున్న నాటకాలన్నీ కేసీఆర్కు తెలిసినంతగా ఇంకొకరికి తెలియవు. ఆనాటి ఎన్నికలకు ముందు స్వయంగా పార్టీ అధిష్ఠానవర్గం ప్రతినిధిగా గులాం నబీ ఆజాద్ కేసీఆర్ ఇంటికి వచ్చి ఎన్నికల ఒప్పందం చేసుకున్న నాటి నుంచి ఆయన ఆపార్టీ ఎత్తులను చూస్తున్నారు.

మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చడం, యూపీఏ ఎజెండాలో రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావించడం, వివిధ సందర్భాల్లో రాష్ట్రపతి ద్వారా ప్రధాని ద్వారా అంశాన్ని చెప్పించడం చూశారు. ఒక రకంగా ఆయన మాటలు వారితో చెప్పించారు. స్వయంగా కేసీఆర్ కూడా యూపీఏ మొదటి ప్రభుత్వంలో చేరారు. ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్తో ప్రభుత్వంలో భాగంగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేస్తుందని గుర్తించే ఆయన బయటకు వచ్చారు. ఇదొక ఘట్టం అయితే, రెండోవిడతగా కేసీఆర్ కాంగ్రెస్ను రాజకీయంగా దెబ్బకొట్టే ఉద్దేశ్యంతోనే 2009 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలకు విసిగిపోయి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం తప్ప ఇక లాబీయింగ్ పనికిరాదని నిర్ధారించుకునే కేసీఆర్ 2009 నవంబర్లో ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుని తెలంగాణపై చారివూతాత్మక ప్రకటనను సాధించారు. అప్పటి దాకా ఒక్క కేసీఆర్ను, టీఆర్ఎస్ను మాత్ర మే మోసగిస్తూ, మభ్యపెడుతూ వచ్చిన కాంగ్రెస్ 2009 డిసెంబర్ ప్రకటన తరువాత యావత్ ప్రపంచాన్ని, భారత పార్లమెంటును కూడామోసం చేసింది.

ఒకవైపు ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తున్నామని, ప్రక్రియ మొదలు పార్లమెంటులో చెప్పిన ప్రభుత్వం తరువాత మూడేళ్ళు గడుస్తున్నా మళ్ళీ ఊసే ఎత్తడంలేదు. పైగా శ్రీకృష్ణ కమిటీ పేరుతో కొంతకాలం, ఏకాభివూపాయం పేరుతో మరికొంతకాలం సాగదీస్తూ వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనను శాశ్వతంగా మూలన పడేసే ప్రయ త్నం చేస్తోంది. విషయాలన్నీ కేసీఆర్కు అర్థం కావడం లేదనుకుంటే అది మన అమాయకత్వమే అవుతుంది. కేసీఆర్కు కాంగ్రెస్ ఏమిటో తెలిసినంతగా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుడికీ తెలియదు. ఆయన రాజకీయ జీవితం మొదలయ్యిందే యువజన కాంగ్రెస్తో. ఆయన కాలంలోనే ఒక వెలుగు వెలిగిన ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్గాంధీకి సన్నిహితంగా ఉండేవాడని చెపుతారు. అంతేకాదు దేశ ప్రజాస్వా మ్య వ్యవస్థను అతలాకుతలం చేసిన ఎమ్జన్సీ కాలంలో ఆయన పార్టీ అసలు రూపం ఏమిటో ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి కేసీఆర్కు కాంగ్రెస్ స్వభావం తెలిసే ఆయన మళ్ళీ పార్టీని మెప్పించి, ఒప్పించి తెలంగాణ తీసుకోవాలని భావించి ఉండవచ్చు.

కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతర్గతంగా కొట్లాడుకున్న ప్రతిసారీ పార్టీ పెద్దలు తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెపుతుంటారు. అంతర్గతంగా పార్టీలో ఉన్నంత సహనశీలత, ప్రజాస్వామిక ధోరణి పార్టీ ప్రభుత్వాల పనితీరులో ఉండదు. ముఖ్యంగా రాష్ట్రాల ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ తన చరిత్ర పొడుగునా అత్యంత ప్రమాదకరంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించింది. పంజాబ్, అస్సాం మొదలు స్వాతంత్య్రం తరువాత ఏర్పడ్డ అన్నిరాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కల్లోలమే సృష్టించింది. తనకు లాభం లేదనుకున్న ప్రతిసారీ ఉద్యమాలను క్రూరంగా అణచివేసింది. బహుశా చారివూతక నైజం తెలిసే కేసీఆర్ మూడేళ్ళ మోసకాలంలో కూడా ఉద్యమం ప్రజాస్వామిక పరిధి దాటకుండా జాగ్రత్తపడి ఉంటాడు. అణచివేతను ప్రజలు ఎదుర్కొన్నంతగా రాజకీయపార్టీలు ఎదుర్కోలేవు. ఎదుర్కొని నిలబడలేవు. అందుకే ఆయన పోరుబాట వదిలి ఢిల్లీలో చర్చల కోసం ప్రయత్నం చేసి ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీకి లబ్ధి కలుగుతుందని చెప్పడం కోసమే ఆయన టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానన్న ప్రతిపాదన కూడా చేసి ఉండవచ్చు. నిజంగానే కేసీఆర్ మాట అన్నాడా, ఒకవేళ అన్నా నిజంగానే టీఆర్ఎస్ను విలీనం చేస్తాడా, అంత తేలిగ్గా ప్రజలు, పార్టీ కార్యకర్తలు అంగీకరిస్తారా అన్నది వేరే విషయం.

కాంగ్రెస్పార్టీ పూర్తిస్థాయి మాంసాహారి. మనకు మనం అర్పించుకోకపోతే అది మనల్ని చీల్చిచెండాడి చంపేస్తుంది. అది తెలిసే తెలంగాణ ఇస్తే కాంగ్రెస్కు నష్టం ఉండదు అని చెప్పడం కోసం ఆయన అలాంటి ప్రతిపాదన చేసి ఉండవచ్చు. అయినా సరే పార్టీ మెట్టు దిగినట్టు కనిపించడం లేదు.
కాంగ్రెస్ పార్టీ పట్ల కేసీఆర్ ఊహించింది తప్పని తేలిపోయింది. నిజంగానే రాష్ట్రాన్ని ఇస్తారని అనుకుని చేశాడో, లేక తన ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఒక అవకాశం ఇవ్వడం కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యను సామరస్యం పూరితంగా పరిష్కరించడం కోసం తనవంతుగా ప్రయత్నం చేశానని చెప్పడం కోసం అలా చేశారో తెలియదు గానీ కేసీఆర్ చర్చల వల్ల ఆశించిన ఫలితం రాలేదు సరికదా తెలంగాణ ఉద్యమ మనోధైర్యం కూడా దెబ్బతిన్నది. తెలంగాణ ఉద్యమం గడిచిన మూడేళ్ళ కాలంలో రాజకీయ సంప్రదింపుల దశ దాటి ఒక అడుగు ముందుకేసింది. తెలంగాణవాదులు కేవలం రాష్ట్ర సాధన కోసమే కాదు, ప్రతి దశలోనూ పోరాటమే చేయవలసి వస్తోంది. మీటింగులకు పర్మిషన్ తెచ్చుకోవడం మొదలు, ఆయా సందర్భాల్లో పెట్టిన కేసుల ఎత్తివేత దాకావూపతిదానికీ పోరాడవలసి వస్తున్నది.

రాజకీయ నాయకులు, ఉద్యమకారులు, ప్రజాసంఘాల కార్యకర్తలే కాదు సాధారణ విద్యార్థులు, ఉద్యోగులు ఎన్నో కష్టాలను, నష్టాలను భరించి బరిగీసి నిలబడి పోరాడే దశకు ఉద్యమం చేరింది. ఇంతకాలం తమను తాము చంపుకుని వందలాదిమంది తెలంగాణ యువకులు ఉద్యమాన్ని మూడేళ్ళపాటు బతికించారు. ఇప్పుడు స్వయంగా పోలీసులే ఉద్యమకారులను చంపే దశకు తెగించారు. పోలీసులు ఉద్యమకారులపై రబ్బరు బుల్లెట్లు మాత్రమే ప్రయోగిస్తున్నారని ప్రభుత్వం చేస్తున్న వాదనల్లో నిజం లేదు. పోలీసులు తెలంగాణ ఉద్యమకారులపై విదేశీ శత్రువుల కోసం తయారుచేసిన విషపు గుళ్ళను వదులుతున్నారు. సరిహద్దు భద్రతాదళాలు వాడే ప్రమాదకర విషవాయు గోళాలను మర తుపాకుల్లో మదించి ప్రజల మీదికి వదులుతున్నా రు.

అలాంటి కాలం చెల్లిన క్రూర విషగోళ ప్రయోగమే రాజిడ్డి అనే తెలంగాణవాది ప్రాణం తీసింది. దీని మీద ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయారు. జర్నలిస్ట్లను ప్రాంతాల వారీగా విడదీసి తెలంగాణ వారిని ప్రభుత్వం అధికారికంగా వెలివేసింది. జర్నలిస్టులు అరిచి గోలపెట్టారే తప్ప దాన్ని రాజకీయంగా మలచి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం రాజకీయపార్టీలు చేయలేకపోయాయి. నిజమైన జర్నలిస్టులు తెలంగాణ వాళ్ళయిన పాపానికి ప్రభుత్వం వారిని వారితో పాటు తెలంగాణ ప్రసార మాధ్యమాలను వెలివేస్తే ఆంధ్రాకు చెందిన రాంబా బు మాత్రం కెమెరామెన్ గంగతో నకిలీ జర్నలిస్టు అవతారమె త్తి తెలంగాణవాదాన్నే అవహేళన చేస్తూ ఊరేగుతున్నాడు. తనకు నష్టమని తెలిసినా ఏకైక తెలంగాణవాద దర్శకుడు శంకర్ ఎదురొడ్డి నిలబడ్డాడు. వీటన్నింటినీ ఉద్యమంలో భాగం చేసుకుంటూ జేఏసీ తన ప్రయత్నం తాను చేస్తున్నది. అవమానాన్ని ఎదిరిస్తూ తెలంగాణ జర్నలిస్టులు కలాలతో కవాతు చేస్తూనే ఉన్నారు. అయినా కేసీఆర్ మాత్రం ఇంకా ఢిల్లీ వైపు చూస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చి నెల గడిచినా పిలుపు రాలేదు. అయినా సరే పిలిస్తే వెంటనే చర్చలకు వెళతా అంటున్నా రు. ఇన్ని అనుభవాల తరువాత కూడా ఇంకా ఢిల్లీ వైపు చూడడం సమంజసంగా లేదు. జిత్తులమారి కాంగ్రెస్ ముందు రాజకీయ ఎత్తులు పనిచేయవని ఇప్పటికైనా అర్థం చేసుకుని మెలిగితే మంచిది.

నిజమే ఇప్పుడు చర్చలే పరిష్కారం. కానీ కాంగ్రెస్తో కాదు. కేసీఆర్ ఇప్పుడు చర్చలు జరపాల్సింది కోదండరాంతో, జేఏసీ నేతలతో. ఇంకా చెప్పాలంటే ప్రజలతో! టీఆర్ఎస్, జేఏసీల మధ్య చాలాకాలంగా చిన్న చిన్న అభివూపాయభేదాలుగా కనిపించినవి కాస్తా ఇప్పుడు విభేదాలై కూర్చున్నా యి. ఇద్దరు నేతలు కలిసి చర్చించుకుని వాటిని వెంటనే పరిష్కరించుకోవాల్సిన అవసరముంది. అభివూపాయభేదాలైనా, విభేదాలైనా మనసులు మారా లి తప్ప మనుషుల్ని మారిస్తే పరిష్కారం ఉండదు. ఇది ఇద్దరూ అర్థం చేసుకోవాలి. ఇప్పటికే మూడేళ్ళ శ్రమ ఫలితాన్ని ఇవ్వకుండా పోతున్నదనే ఆందోళన ప్రజల్లో నెలకొంటున్నది. ఇంకా జాప్యంచేస్తే మొదటికే మోసం వస్తుంది. మూడేళ్ల పాటు ప్రాంతంలో అడుగుపెట్టడానికి సాహసం చేయనివాళ్ళు ఇప్పుడు నామమావూతపు నిరసనల మధ్య కుంటుతూ, కుములుతూ నడిచివస్తున్నారు.

చంద్రబాబు తెలంగాణవాదుల నిరసనలకు బెదరలేదు గానీ, ఆయన నేలమీద అడుగుతీసి అడుగువేయలేక అవస్థలు పడుతున్నాడు. మరోవైపు జగనన్న వదిలిన బాణం షర్మిల రూపంలో శరవేగంతో దూసుకువస్తోంది. వాళ్లకు మళ్లీ ఎన్నికల దాకా వేరే పనిలేదు. ఇప్పుడు అందరిలాగే ఏదో ఒక యాత్ర చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. యాత్రలు చేయడం రాజకీయ చైతన్యరాహిత్యంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని. అది కాలయాపనకు తప్ప కార్యాచరణకు పనికి రాదు. ఇప్పుడున్న చైతన్యం ఏమిటో మొన్నటికి మొన్న హైదరాబాద్ మార్చ్తో రుజువైంది.కేసీఆర్ బస్సు యాత్ర చేసి తెలంగాణ పల్లెల్లోకి వెళ్ళడం కంటే ఇప్పుడు తెలంగాణ పల్లెలే జాతరలా హైదరాబాద్కు తరలిరావాలి. ప్రజల్లో నిలకడగా ఉన్న చైతన్యాన్ని ఉద్యమంలోకి నడిపించే వ్యూహం కావాలి. కేసీఆర్లోని వ్యూహకర్త ఇప్పుడు కార్యాచరణకు దిగాలి. డిసెంబర్ 9 లక్ష్యంగా ప్రజలను కదిలిస్తే ఢిల్లీ తనంతట తానే దిగివస్తుంది. అప్పుడు చర్చలు ఢిల్లీలో కాదు. హైదరాబాద్లోనే అంద రి సమక్షంలో జరుగుతాయి. అటువంటి చర్చలే ఫలితాన్ని ఇస్తాయి. కేసీఆర్ గారు అర్థం చేసుకుంటారని ఆశిద్దాం!