శనివారం, మే 17, 2014

జడ్జిమెంట్ డే

తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్రజలు ఇప్పటికే తీర్పు చెప్పారు. కేవలం తీర్పు వెలువడే క్షణం కోసమే ఇటు ప్రజలు, రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నారు. కేవలం ఒక్క తెలంగాణ ప్రజ లే కాదు, దేశవ్యాప్తంగా రాజకీయాల పట్ల, ప్రాంతీ అస్తిత్వ ఉద్యమాల పట్ల ఆసక్తి ఉన్న అందరూ ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నారు. ఫలితం ఎలా ఉండబోతుంది? అన్నదానికంటే ఫలితం తెలంగాణ భవిష్యత్తు చిత్రపటాన్ని ఎలా మారుస్తుందో చూడాలన్న ఆసక్తి ఇప్పుడు చాలామందిలో నెలకొని ఉన్నది. ఇవ్వాల ఓటర్లు ఇచ్చే తీర్పునుబట్టే తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఫలితాల పట్ల, పరిణామాల పట్ల ఎవరి అంచనాలు, అనుమానాలు వారికున్నాయి. ఫలితం ఎలా ఉన్నా తెలంగాణ సమాజం స్వీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాల్సినటువంటి అవసరం మాత్రం ఈరోజుతో మొదలుకాబోతున్నది. ఇప్పటికే బైటికొచ్చిన ఎగ్జిట్పోల్స్ తెలంగాణ రాష్ట్ర సమితి విజయ దుందుభి మోగించనుందని ప్రకటించాయి. అదేనిజమైతే రాష్ట్రంలో తొలి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో ఏర్పడితే తెలంగాణ సమాజం మరింత అప్రమత్తతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. 

ఎందుకంటే పార్టీ బలాబలాలతో సంబంధం లేకుండా ప్రజలు తమ రాజకీయ విజ్ఞతను ప్రదర్శించి టీఆర్ఎస్ను బలపరిచారు. పార్టీ నిజంగానే ప్రజల ఆకాంక్షలను నిలబెడుతుందా? ప్రజలకు ఇచ్చిన హామీలను ఆచరణలోకి తెస్తుందా? ఒక బలహీనమైన పార్టీ బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుం దా?ఒకవేళ ఏర్పాటు చేసినా ఐదేళ్లు పూర్తి చేసుకుంటుందా? అనే అనుమానాలు సంప్రదాయ రాజకీయ వర్గాల్లో , విశ్లేషకుల్లో వ్యక్తమౌతున్నాయి. ఇది కేవలం పార్టీ సంస్థాగత బలహీనత వల్ల వస్తున్న అనుమానాలే కాదు, పార్టీ ప్రకటించిన భారమైన ఎన్నికల ప్రణాళిక గమనించినప్పుడు ఇటువంటి అనుమానం సహజంగానే కలుగుతుంది. తెలంగాణ సమాజం దాదాపుగా రెండు దశాబ్దాల పాటు రకరకాల రూపాల్లో విధ్వంసానికి గురైనటువంటి సమాజం. రెండు దశాబ్దాల సరళీకరణ ప్రయోగాల వల్ల ప్రాంతంలో అనేక వనరులు విధ్వంసానికి గురయ్యాయి. 

రైతులు, వివిధ కులవత్తులు, చేతి పనుల వాళ్లు, నిరుద్యోగ యువకులు ఇట్లా అన్ని వర్గాలు చితికిపోయే దశకు చేరుకున్నాయి. ఇంకోవైపు ఉద్యోగుల్లో సగటు మనుషుల్లో ఒక పరాధీనతకు లోనైన భావన అభద్రత పేరుకుపోయి ఉన్నది. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు జీవం పోసి ఉద్యమాన్ని నిలబెట్టింది కూడా అంశాలే. వీటిని అధిగమించి ప్రజలకు ఒక బంగారు తెలంగాణను నిర్మించే బాధ్యతను తీసుకుంటామని అన్ని పార్టీలు తమ తమ ఎన్నికల ప్రణాళికలో ప్రచారంలో భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాయి. అందులో టీఆర్ఎస్ హామీలు, వాగ్దానాలు ప్రణాళిక ప్రజలను ఆకట్టుకున్నది. ఒకవేళ ఆకర్షణ ఓట్లుగా మారితే రేపు టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం. ఒకవేళ అదే జరిగితే నిజంగానే టీఆర్ఎస్ జనరంజక పాలనను అందించగలుగుతుందా అన్నది ఇవ్వాల చాలా మందిలో మదిలో ఉన్న ప్రశ్న!

రైతుల విషయాన్నే తీసుకుందాం. టీఆర్ఎస్ రైతులకు ఇచ్చిన హామీల్లో అత్యంత కీలకమైనవి సాగునీరు అందించడం. లక్షలోపు రుణాలన్నీ మాఫీ చేయడం. భూమిలేని దళిత, ఆదివాసీ కుటుంబాలకు కనీసం కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున పంచడం. మూడు ప్రభుతానికి పెను భారంగా మారక తప్పదని ఇప్పటికే ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రతి నియోజక వర్గంలో లక్ష ఎకరాల భూమి సాగుకు అవసరమయ్యే జలవనరులు ఉన్నాయా? ఉన్నా వాటిని స్థిరీకరించడానికి కావలసిన ఆర్థిక వనరులు ఉన్నాయా? అన్నది కీలకమైన ప్రశ్న. అలాగే భూమిలేని పేదలకు, దళితులకు, ఆదివాసీ కుటుంబాలకు మూడేసి ఎకరాల చొప్పున ఇవ్వగలిగే మిగులు భూమి ఎక్కడి నుంచి వస్తుంది అనేది విమర్శకులు లేవనెత్తుతున్న రెండవ అంశం. రుణ మాఫీ విషయంలో కూడా ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. 

టీఆర్ఎస్ అన్నీ లెక్క వేసుకొనే మ్యానిఫెస్టోలో ప్రస్తావించామని చెప్తున్నప్పటికీ, ఒక్క ఏడాదిలో అది నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా పార్టీపై ఉంటుంది. ఇక ప్రజల్ని ముఖ్యంగా పేదల్ని విశేషంగా ఆకర్షించిన పథకాల్లో గహ నిర్మాణం ఒకటి. గడిచిన ముప్ఫై ఏళ్లలో ఇల్లు లేని పేదలకు వివిధ పథకాల రూపంలో ఎక్కువ గహాలు నిర్మించి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లోనే. ఎన్టీ రామారావు మొదలు కిరణ్కుమార్రెడ్డి దాకా రకరకాల పేర్లు మార్చి కోట్లాది ఇల్లు నిర్మించి బలహీన వర్గాలకు ఇచ్చామని చెప్తూ వచ్చిన వాళ్లే. అయినా మరికొన్ని కోట్లమంది నిరాశ్రయులుగానే మిగిలిపోయారని అంచనాలు చెప్తున్నాయి. అటువంటి వారి డిమాండ్లను నెరవేర్చడానికి టీఆర్ఎస్కు ఉన్న ప్రణాళిక ఏమిటో? గహ నిర్మాణానికి లబ్ధిదారులను ఎంపిక చేసే పద్ధతి ఏమిటో? పార్టీ ఇప్పటి వరకు వెల్లడించలేదు.

నిర్దిష్ట ప్రణాళిక లేకపోతే ఇది కూడా వివాదాస్పద పథకంగా మారే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా చేతివత్తులను నిలబెట్టడానికి వత్తులను ఆధునీకరించి వత్తికారులను ఆదుకోవడానికి అనేక హామీలు ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. వెనుకబడిన కులాలు, వత్తుల జనాభా వివరాలే సరిగ్గాలేని మన దేశంలో వత్తికారులను గుర్తించి ఆదుకోవడానికి పెద్ద ఎత్తున ప్రణాళిక అవసరం అవుతుంది. మరోవైపు తెలంగాణ ఉద్యమం ఇటు ఉద్యోగుల్లో, అలాగే నిరుద్యోగ యువతలో భారీ ఆశలు పెంచిం ది. తెలంగాణ వస్తే ప్రమోషన్లు వస్తాయని కొందరు, తమ కాంట్రాక్ట్లో తమకు పర్మినెంట్ అయితే భద్రత దొరుకుతుందని కొందరు, లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశపడుతున్నారు. ఒకరకంగా ఉద్యమమే వారిలో ఆశలు కల్పించింది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగుల పునర్విభజన గమనిస్తున్న వారికి అటువంటి అవకాశం పెద్దగా ఉండబోదని అనిపిస్తున్నది.

ఒకవైపు రాజకీయ పార్టీలు, ప్రజలు, జేఏసీ నాయకులు ఎవరికి వారు ఎన్నికల హడావుడిలో నిమగ్నమై ఉం టున్న తరుణంలోనే అంతే హడావుడిగా గవర్నర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొందరు అధికారుల తో కలిసి ఉద్యోగుల విభజన, ఉద్యోగాల పంపిణీ పూర్తి చేస్తున్నారు. ఫలితాలు వచ్చి ప్రభుత్వం పగ్గా లు చేపట్టే లోపే పంపిణీ ప్రక్రియ పూర్తి కాబోతున్నది.ఇవి పార్లమెంటు నిర్దేశించిన శాసనం ప్ర కారం జరుగుతున్న ప్రక్రియ కాబట్టి రేపు అధికారంలోకి వచ్చిన వాళ్లు ఎంతమొత్తుకున్నా ప్రయోజనం ఉండదు. పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాల కల్పనకు మార్గాలు అన్వేషించడం తలకు మించిన భారం కాబోతున్నది. వీటితోపాటు విద్యుత్ సమస్య పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ నిధుల సమీకరణ, ఆస్తులు, అప్పుల విభజన చెల్లింపులు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటిని ఎదుర్కొనే సమర్థవంతమైన జట్టును కేసీఆర్ ఏర్పాటు చేసుకోగలడా? అలాగే అటువంటి జట్టును విజ యం వైపు నడిపించగలడా? అన్నది ప్రధానం కాబోతున్నది. 

దీనికితోడు ఆయన దళితులకు, ఆదివాసీలకు, ముస్లింలకు ఇప్పటికే రకరకాల వరాలు ఇచ్చి ఉన్నాడు. అందులో కొన్నింటికి ఎన్నికలకు ముందే ఎగనామం పెట్టాడన్న విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు. ఇప్పుడు వర్గాల్లో మరింత విశ్వాసాన్ని పెంచడం ఆయన ముందున్న మొదటి సవాలు కాబోతున్నది. వీటన్నింటిని సాధించినప్పుడే ఆయన మన రాష్ట్రం, మన పార్టీ, మన ప్రభుత్వం అని చెప్పుకోవడానికి అవకాశం ఉం టుంది. ఇందులో మాత్రం విఫలమైనా ప్రజలు ఊరుకునే స్థితిలో లేరనే విషయం ఆయన గమనించాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ప్రజల్ని అంత చైతన్యవంతుల్ని చేసింది. ఇప్పుడు ప్రజలు తప్పులు జరిగినప్పుడు నిలదీయడానికి సిద్ధంగా ఉంటారని గుర్తించాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్వయంగా ఆయనే ప్రజల పక్షం వహించి పోరాడడానికి సిద్ధంగా ఉండాలి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా పరిస్థితులు ఇంతకంటే భిన్నంగా ఉండవు. ఆపార్టీ కూడా తెలంగాణ వికాసానికి ఇబ్బడిముబ్బడిగా హామీలను ఇచ్చింది. ఐదేళ్లలో తెలంగాణ రూపురేఖలు మార్చే సి, బంగారు తెలంగాణ చేసి చూపిస్తామని ప్రకటించింది.

మేడిన్ ఇన్ తెలంగాణ బ్రాండ్ ని ప్రపంచ మార్కెట్లో నిలబెడతామని చెప్పింది.చేవెళ్ళపాణహితతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి అంతా సస్యశామలం చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే కేంద్రంలో బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో తమ పార్టీ లేకుండాఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కాంగ్రె స్ పార్టీకి అంత సులభం కాదు. పైగా పార్టీ రాష్ట్రం లో కూడా నాయకత్వ సమస్య ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అనే దగ్గరి నుంచి పార్టీలో పంచాయితీ మొదలవుతుంది. కేంద్రంలో అధికారంలో లేక అధిష్ఠాన వర్గం బలహీనపడిపోతే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అధిష్ఠాన వర్గం చేతిలో ఎంతమంది ఉంటారన్నది కూడా అనుమానమే. అటువంటి బలహీనమైన స్థితిలో పార్టీకి, ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఒక ప్రశ్న అయితే, నాయకుడి మాట ఎం మంది వింటారన్నది మరో ప్రశ్న. 

రెండింటిలో ఏది జరిగినా రానున్న కాలంలో ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పరిపాలించడం ఎవరికైనా కత్తిమీద సామే అవుతుంది. అటువంటప్పుడు ప్రభుత్వాన్ని శాసించే శక్తి, నిలదీసే సామ ర్థ్యం ప్రజల నుంచే రావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు ఒక ఆకాంక్ష నెరవేర్చుకోవడంలో విజయవంతమయ్యారు. 

ఇప్పుడు ఆకాంక్షతో ముడిపడి ఉన్న ఆశలన్నీ నెరవేర్చుకునే దిశగా నడవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు జేఏసీలో ఉన్న సంఘాలు, వ్యక్తులు, పార్టీలు ఎవరైనా తెలంగాణ ఆకాంక్ష పేరుతోనే ప్రజలతో మమేకమై కదిలారు. ఇప్పుడు పార్టీ ప్రభుత్వం వచ్చి నా ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించినా ఒక బలమైన ప్రజాప్రత్యామ్నాయాన్ని నిర్మించుకొని అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉన్న ది. తెలంగాణకు సంబంధించినంత వరకు ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ప్రజలు మాత్రం మళ్లీ ఉద్యమించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కరు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా రాబోయే ప్రభుత్వాన్ని శాసించే స్థితిలో ఉండాలి. 

2 కామెంట్‌లు: