శనివారం, జూన్ 07, 2014

నిదానమే ప్రధానం!

ముందుగా తెలంగాణా తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణా ఉద్యమ సారధిగా ఇంతవరకు ప్రజల్లో ఉన్న కల్వకుంట్ల చద్రశేఖర్ రావు ఇప్పుడు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపించాబోతున్నారు. ఉద్యమ కాలంలో తాను నిర్దేశించిన లక్షాన్ని తానే పూర్తిచేసే బాధ్యతను తలకెత్తుకున్నారు. నిజానికి ఇది తలకు మించిన భారమే. ఉద్యమం పరిపాలన ఒకటికాదు. ఉద్యమకారులకు ఉన్న స్వేచ్చ పాలకులకు ఉండదు. ఉద్యమం పరిమితులు, షరతులను ధిక్కరించి సాగితే పరిపాలనపరిమితులకు లోబడి నడుస్తుంది. ఉద్యమ కారులకు ధిక్కార స్వభావం, మొండి తనం, దూకుడు ఉంటే ఉండవచ్చు కానీ పాలకులకు అవేవీ పనికి రావు.  పాత్రల్లో ఉన్న వైవిధ్యాల వల్లే ఉద్యమకారులు పాలక వర్గాలుగా మారినప్పుడు తడబడుతుంటారు. త్వరత్వరగా పనులు పూర్తి చేయాలన్నతాపత్రయం తప్పటడుగులు వేస్తుంటారు.  తాము ఉద్యమకాలంలో లేవనెత్తిన అన్ని సమస్యలను వెంటనే పూర్తి చేయాలనే తొందర దీనికి కారణం అవుతుంది.

తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కెసీఆర్) కూడా ఇప్పుడు తాపత్రయంలోనే ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఆలస్యంగానైనా జూన్ రెండో తేదీన తెలంగాణా రాష్ట్రం తొలి ప్రభుత్వం ఏర్పడింది. ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్నవాళ్ళు, అంతో ఇంతో కార్యదక్షులు అన్న పేరు తెచ్చుకున్నవాల్లనే ఆయన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.  వాళ్ళలో సగం మంది మంత్రులు కూడా ఇంకా అధికార బాధ్యతలు చేపట్టనే లేదు. లోగా రుణమాఫీ విషయంలో కెసీఆర్ బ్యాంకర్లతో సమావేశం అయ్యారు. లోపల ఏం మాట్లాడుకున్నారో తెలియదుగానీ రుణమాఫీ కి పరిమితులు విదిస్తున్నారన్న వార్త గుప్పుమంది. అంతే ఒక్క రోజులో సీన్ రివర్స్ అయ్యింది కెసీఆర్ ఎప్పుడు తప్పులు చేస్తాడా అని ఎదురుచూస్తోన్న ప్రతిపక్షాలు ఒక్కసారిగా విరుచుకు పడ్డాయి. రాజకీయం ఇలాగే ఉంటుంది. ప్రజలు కూడా తమ ప్రయోజనాల తరువాతే ఏదయినా ఆలోచిస్తారు. నిజానికి రుణమాఫీ విషయంలో రైతులందరికీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని టిఆరెస్ మేనిఫెస్టోలో చెప్పింది. రైతులు, రుణాలు, సంవత్సరానివి అన్న వివరాలేవీ అందులో లేవు. ఎన్నికల సమయంలో అన్ని అంశాల కంటే రైతుల రుణమాఫీనే కేసీఆర్ ఎక్కువగా ప్రచారం చేసారు. అప్పటికే రుణభారం తో కునారిల్లిపోయిన రైతులంతా నిజంగానే ఇదొక వరంగా భావించారు. ఇప్పుడు అందులో కోతలు విధించడం వారికి మింగుడు పడడంలేదు. కాబట్టి ముందుగా చెప్పిన మాటకు కట్టుబడి ఉండడమే మంచిది.ఇది మొదటి సవాలు మాత్రమే. ఇటువంటివి భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదురుకాబోతున్నాయి.

తెలంగాణా ఉద్యమం అనేక ఆర్ధిక సామాజిక అంశాలతో ముడివడి ఉన్న ఒక విశాల ఎజెండాను ముందుకు తెచ్చింది. దానికి తోడు ఉద్యమ సారధిగా ఆయన గత 14 సంవత్సరాల్లో ప్రజలలో తెలంగాణా ఆకాంక్షను సజీవంగా ఉంచడానికి ఆయన ఒక రంగుల ప్రపంచాన్ని సృష్టించారు. ఆయన  ఉద్యమకాలంలో తరచూ ప్రస్తావించిన నీళ్ళు, నిధులు, నియామకాలు ఇప్పుడు ప్రధాన సవాళ్లుగా మారబోతున్నాయి. తెలంగాణా ఉద్యమం సుదీర్ఘకాలంగా నడిచిన తెలంగాణా ఉద్యమం ఇటువంటి బలమైన ఆకాక్షలను ప్రజల్లో ప్రోదిచేసింది. తెలంగాణా ఉద్యమాన్ని నడిపిస్తున్న సమయంలో సకల జనులను అందులో భాగస్వాములను చేయడానికి ఆయన అనేక విషయాలు చెప్పారు. తెలంగాణా సమస్య ఒక సుదీర్ఘ కాల వివక్ష నుంచి పుట్టింది. పాలక వర్గాలు దశాబ్దాల పాటు సాగించిన వివక్షే తెలంగాణా వెనుకబాటు తనానికి కారణమయ్యింది. తెలంగాణా రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచీ వలస పాలన అంతమైతే ప్రజల బతుకులు బాగుపదతాయన్న నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసింది. ఆంధ్రా పాలకుల దోపిడీ, వివక్షవల్ల వివిధ రంగాల్లో ఎంత నష్టం కలిగిందో లేక్కలేసింది. మనరాష్ట్రం మనకు వస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదని చెపుతూ ప్రజల ఆకాంక్షలన్నీ ప్రతిబింభించే విధంగా ఎన్నికల మేనిఫెస్టో రూపొందించింది. దానినొక సాదా సీదా ఎన్నికల పత్రం గా కాకుండా తెలంగాణా పునర్నిర్మాణ ప్రణాళికగా ప్రజల ముందుకు తెచ్చింది. ప్రజలు నమ్మారు. అనూహ్యమైన రీతిలో పార్టీకి బ్రహ్మరథం పట్టారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ పునర్నిర్మాణం అనేది మనం వేగిర పడినంత మాత్రాన పూర్తయ్యేది కాదు. అనేక అభివృద్ధి ఆకాక్షలతో ముడివడిన విషయం. కాబట్టి విధాన నిర్ణయాలకు కొంత సమయం, సమాలోచన అవసరం అవుతాయి. బహుశ తమను గెలిపించిన ప్రజలకు ఎంతోకొంత వెంటనే చేసి చూపించాలన్న ఉద్దేశ్యంతో ముందుగా రుణమాఫీ అంశం చేపట్టి ఉండవచ్చు. కానీ దానిలో ఉన్న లోతుపాతులను రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించి, రాబోయే శాసనసభలో విధివిధానాలు ప్రకటించి ఉంటే రాజకీయాలకు ఆస్కారం లేకుండా సమస్య పరిష్కారం అయ్యేదేమో

టిఆరెస్ ఎన్నికల ప్రణాళికలో ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. అవన్నీ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది అవుతాయి. కానీ అదే సమయంలో రాష్ట్ర ఖజానాకు మోయలేని భారం కూడా కాబోతాయి. అన్నీ ఒకే సారిగా కాకుండా దశలవారీగా చేపట్టి పూర్తి చేస్తే తప్ప అవి సాధ్యమయ్యే పనులు కావు. రుణ మాఫీ సమస్య ఏదోఒక విధంగా సద్దుమనిగినా రేపు కరెంటు సమస్య ముందుకు రానుంది. అది ఊహించే కెసీఆర్ చర్యలు చేపడుతున్నారు. తొలుత చెప్పినట్టుగా ఎనిమిదిగంటలు కరెంటు అందేలా చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. తెలంగాణలో  ఇప్పటికే 1500 మెగావాట్ల విద్యుత్ కొరత ఉంది. పరిస్థితుల్లో వ్యవసాయానికి ఎనిమిది గంటల నాణ్యమైన  ఉచిత విద్యుత్ అందించాల్సి ఉంది. అలాగే భూమిలేని దళిత ఆదివాసీలకు ఒక్కొక్క కుటుంబానికి మూడెకరాల సాగు భూమి ఇస్తామన్నారు. రేపో మాపో వాళ్ళూ అడగడం మొదలు పెడతారు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర సాగుకు వీలయిన మిగులు భామి ఏదయినా ఉందా, లేకపోతే రైతులనుంచి కొనుగోలు చేస్తారా, అందుకు ఎంత ఖర్చు కాబోతుంది. అంచనాలన్నీ మొదలుపెట్టాలి. ఇవన్నీ చూసుకునే కొంత సమయం తీసుకుని అయినా ఎప్పటి నుంచి భూపంపిణీ ఉంటుందో ముందుగానే చెప్పాలి. ఇప్పుడు చాలా మంది నీడలేని నిరు పేదల్ని రెండు బెడ్ రూం ఇల్లు వూరిస్తునాయి. గృహ నిర్మాణ పథకం కూడా వివాదాస్పదం కావొచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఎందరు, ఎంతమంది ఇప్పటికే వివిధ పథకాల ద్వారా లబ్ది పొందారు వంటి వివరాలన్నీ గ్రామస్థాయి నుంచి సేకరించాల్సి ఉంది. పని ఇప్పుడు మొదలు పెడితే తప్ప ఏడాదిలోపు ఇల్లు కట్టిస్తారన్న కల నెరవేరదు. ఇక పోతే  నియోజక వర్గానికి లక్ష ఎకరాల చొప్పున సాగునీరు కూడా అంత సులభం కాదు. ఇది నీటి వనరుల అందుబాటు మీద ఆధారపడి ఉంటుంది. ముందుగా చెరువులు పూడికలు తీసి ఆధునీకరిస్తామని మేనిఫెస్టో చెపుతోంది. కానీ మరో వారంలో వర్షాలు మొదలయితే ఇదికూడా ఆరు నెలల దాకా ఆచరణ సాధ్యం కాదు.

నిరుద్యోగ యువత నుంచి కూడా మరో పెను సవాలు ఎదురు కాబోతోంది. నిజానికి  2009 లో ఉద్యమాన్ని మొదలు పెట్టింది ఉద్యోగులయితే మలుపుతిప్పింది మాత్రం ఉస్మానియా కాకతీయ విద్యార్థులు, అలాగే  నిరుద్యోగులు. వారిలో చాలామంది తెలంగాణా వస్తే తమ బతుకులు బాగు పడతాయని కలలుగన్నారుతెలంగాణా సాధనలో ప్రాణాలొడ్డి పోరాడారు. కానీ ప్రభుత్వ  ఉద్యోగాల పంపిణీ పూర్తయితే తప్ప ఎన్ని ఉన్నాయో  ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ పూర్తయితే తప్ప  తెలిసేలా లేదు. మరోవైపు తాత్కాలిక కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కూడా  పర్మినెంట్ అవుతామన్న ఆశతో ఉన్నారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే కొంత ఉపశమనం కలుగవచ్చు. ప్రక్రియ వెంటనే మొదలు కావాల్సి ఉంది.   అలాగే కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కూడా తెరాస హామీలిచ్చిందిహైదరాబాద్ కు సహజంగానే పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంది. ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ( టీ ఆర్) గా గుర్తింపు పొందింది. అవకాశాలు అందుకోవాలంటే నిరుద్యోగుల్లో  అవసరమైన నైపుణ్యాన్నిపెంచే దిశగా ఆలోచించాలి. తెరాస  కేజీ నుంచి పీజీ వరకు పూర్తిగా నిర్బంధ ఉచిత విద్య ను ప్రతిపాదించింది. నిజానికి ఇప్పుడు  విద్యారంగం కేజీ నుంచి పీజీ వరకు కార్పోరేట్ శక్తుల చేతుల్లో ఉంది. వాళ్ళిప్పుడు ప్రభుత్వాన్ని శాసించే స్థితిలో ఉన్నారు.విద్యారంగంలో సమూల ప్రక్షాళన చేపడితే తప్ప ఇది సాధ్యం కాదు.మరోవైపు ఉన్నత విద్యలో మాత్రం నాణ్యత లేనిదిగా తయారయ్యింది. విశ్వవిద్యాలకు వసతులు వనరులు లేవు. పాలక మండలులువైస్ చాన్సలర్లు కూడా చాలా విశ్వవిద్యాలయాల్లో లేరు. విద్యారంగా సంస్కరణలు ముందుగా విశ్వవిద్యాలయాల నుంచి మొదలు కావాలి. మేనిఫెస్టో లో కేజీ నుంచి రెసిడెన్సియల్ కాకుండా ప్రాధమిక స్థాయిలో కామన్ స్కూల్ సిస్టం తేవాలి. ఐదో తరగతి నుంచి మాత్రమే రెసిడెన్సియల్ పాటశాలలు ఉండాలి. ఇవన్నే ఏకపక్షంగా కాకుండా అధ్యాపకులు , ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చింది ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాలి

నిర్ణయాలు ఏవైనా ఆయా రంగాల్లో నిపుణులతో, ప్రజాసంఘాలు, పౌర సమాజం ప్రతినిధులతో చర్చించి మాత్రమే తీసుకుంటామని కెసీఆర్  పదేపదే చెపుతున్నారు. నిజానికి అదే మంచి పద్ధతిప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుంది. ప్రతిపక్షాల విమర్శలకు ఆస్కారం లేకుండా చేస్తుంది. తెలంగాణా ప్రభుత్వంలో ఇప్పుడున్న మంత్రులలో చాలామంది ఉద్యమకారులు. ప్రభుత్వ పాలనలో మొదటి సారి భాగస్వామ్యం అయిన వాళ్ళు. ఉద్యమంలో ఉన్న దూకుడు పాలనలో పనికి రాదు. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఇప్పటివరకు చేరిన అధికారులలో చాలా మంది పరిపాలన అనుభవం తో పాటు సమర్థత, నిజాయితీ ఉన్న వాళ్ళు. వాళ్ళతో సమన్వయము అవసరం. ఉద్యమాన్ని  ఉరకలేత్తించినట్టుగా పరిపాలనను పరుగెత్తించడం కుదరదు. నిలకడగా నడిస్తేనే అలసట లేకుండా ఐదేళ్ళ ప్రయాణం సాగుతుంది. నిదానమే ఇప్పుడు ప్రధానం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి