శుక్రవారం, జనవరి 13, 2012

విజయం కాదు.. వైఫల్యం!



రాజకీయాలు రణరంగం కంటే ప్రమాదకరం అంటారు చర్చిల్. చర్చి ల్ రాజకీయ అభివూపాయలతో మనకు ఏకాభివూపాయం ఉన్నా ,లేకున్నా బ్రిటీష్ పాలకుడిగా ఆయన భారతీయ సామాజిక, రాజకీయ పునాదులను బాగా ఎరిగినవాడు. భారత దేశ రాజకీయ, పరిపాలనా వ్యవస్థల నిర్మాణంలో అప్పటి పాలకుడిగా క్రియాశీలంగా ఉన్నాడాయన. రాజకీయాలు ప్రమాదకరమని ఎందుకనిపిస్తుందంటే యుద్ధంలో పోరాడేవాడు విజయమో, వీరస్వర్గమో తేల్చుకోవడానికి రంగంలో దిగుతాడు. కాబట్టి చావో రేవో ఒక్కసారే తేలిపోతుంది. వాడికి శత్రువు ఎవడో, మిత్రుడు ఎవడో తెలిసి రంగంలోకి దిగుతాడు. కానీ రాజకీయాలలో శాశ్వత శత్రువు ఉండడు. శాశ్వత మిత్రుడూ ఉండడు. అధికార బలమే పరమావధిగా వుండే రాజకీయాలను అవకాశవాదం, ఎత్తుగడలే నడిపిస్తున్నప్పు డు ఎవరైనా ఎప్పుడు చస్తారో ఎప్పుడు ఎలా బతికిపోతారో తెలియదు.

రాజకీయాలనే నమ్ముకున్న ఎవరినైనా ఇలాంటి కాలాతీత మరణం వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు తమ మనుగడ కోసం యుద్ధాలను సృష్టిస్తాయి. తమ విజయం కోసం వ్యూహాలను రచిస్తాయి. తమ లాభం కోసం ఎత్తుగడలను మారుస్తాయి. పోయిన వారమంతా తెలంగాణ ఇటువంటి రణరంగాన్నే తలపించింది. రెండేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత చంద్రబాబునాయుడు, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో సమైక్యవాదం మళ్ళీ తెలంగాణ గడ్డ మీద కాలుమోపింది. రైతు యాత్రల పేరుతో రెండు పార్టీలు ముమ్మాటికీ తెలంగాణ మీదనే కాదు తెలంగాణవాదం మీద దండయాత్ర చేస్తామని ప్రకటించుకున్నాయి. అంతేకాదు తెలంగాణలో తమకే ఆదరణ ఉందని ప్రకటించుకున్నాయి. ప్రజలు తమనే విశ్వసిస్తున్నారని చెప్పుకున్నాయి. ప్రకటనలు ఎంతమంది నమ్మారన్నది వదిలేస్తే అటు పాలకుర్తిలో, ఇటు ఆర్మూర్లో జరిగిన పరిణామాల పట్ల చాలా మంది తెలంగాణవాదులు కలత చెందారన్నది నిజం!

తెలంగాణకు చెందిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అనుచరుడొకరు నాతో ఒక టెలివిజన్ చానల్లో మాట్లాడుతూ తమ నాయకుడికి తెలంగాణలో తిరుగులేని ఆదరణ ఉందని ఆర్మూర్తో నిరూపించాం అన్నారు. ఆయన అంతటితో ఆగకుండా ఒకప్పుడు రాళ్ళు వేసిన ప్రజలే ఇవాళ పూలవర్షం కురిపించారు. నిలదీస్తాం, అడ్డుకుంటాం అని ప్రకంటించిన వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. పొలిటికల్ జేఏసీ సారథి ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చినా ప్రజలు మమ్మల్నే విశ్వసించారు అని ప్రగల్భాల పరంపర మొదలుపెట్టారు. ఆయన మాటల్లో విజయగర్వం ఎలా వున్నా జగన్ పర్యటన తెలంగాణలో ఘోరంగా విఫలమయ్యింది.

నిజానికి జగన్ మిగతా యాత్రాలతో పోల్చుకుంటే ఆర్మూర్ యాత్ర ముమ్మాటికీ విఫలమయినట్టే. జగన్ అనుచరులు, పోలీసుల హడావిడి మినహా స్వచ్ఛందంగా జగన్ను అనుసరించిన వాళ్ళు గానీ, ఆయన యాత్రపట్ల ఆసక్తి కనబరిచిన వాళ్ళు గానీ పెద్దగా లేరనే చెప్పవచ్చు. కానీ ఈనాడు దినపవూతిక మాత్రం ఎన్నడూ లేనివిధంగా జగన్ యాత్ర వార్తను మొదటిపేజీలో ప్రచురించింది. జగన్ను ఆయన తండ్రి గారి కాలం నుంచి నిరంతరం వెంటాడుతూ ఉన్న పత్రిక అన్ని వైరాలూ మరిచిపోయి ఆయనను ఆకాశానికి ఎత్తింది. ఒక్క పత్రికే కాదు. దాదాపు ఆంధ్రా పత్రికలన్నీ చంద్రబాబును, జగన్ను ఇప్పుడు ఆంధ్ర ఆత్మగౌరవ ప్రతీకలుగా చూస్తున్నాయి. వాళ్ళ పర్యటనలను ఘన విజయాలుగా కీర్తిస్తున్నాయి. వాళ్ళ పర్యటనల వెనుక తెలంగాణవాదాన్ని ఓడించాలన్న కుట్రో లేదా తెలంగాణను జయించాలన్న కోరికో లేకపోతే ఇంత పట్టుదల ఎందుకు ఉంటుంది.

రైతు కోసమే అయి వుంటే దానికి విజయం, పరాజయం అన్న విశేషణాలు ఎందుకు జోడిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఎవరూ ఆలోచించడం లేదు. పైగా తెలంగాణలో అడుగు పెట్టడమే తమ విజయమని చాటుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే తెలుగు టీవీలు, టీవీలలో కనిపించే విశ్లేషకులు ఇప్పుడు హఠాత్తుగా పౌర హక్కుల కార్యకర్తలైపోయారు. ప్రజాస్వామ్యంలో ఎవరై నా, ఎక్కడైనా పర్యటించవచ్చునని అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని వాదిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు భారత రాజ్యాంగంలో కానీ మరెక్కడా కానీ రాజకీయ నాయకులకు ప్రత్యేకమైన హక్కులు లేవు. పౌరులకు ఉండే హక్కులు మాత్రమే పార్టీల నేతలకైనా పాలకులకైనా ఉంటాయి. కానీ మన మీడియా ఇప్పుడు కొత్త హక్కుల పత్రాన్ని ప్రకటిస్తోంది. నిజమే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు కానీ స్థానిక ప్రజల ఆమోదంతో మాత్రమే అన్న సంగతి గమనించడం లేదు.

జనం నిరసనల మధ్య, వ్యతిరేకతల మధ్య, వారి భావోద్వేగాలను కించపరుస్తూ కిరాయి సైనికులతో మాత్రం కాదు అన్న సంగతి వాళ్ళంతా మరిచిపోతున్నారు. అయినా సరే అలాంటి హక్కు ఒకటి ఉందనుకున్నా వాళ్ళ ఆధిపత్య ప్రదర్శనకు రక్షణ కల్పించడానికి ప్రభు త్వం గడిచిన వారం రోజుల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఒక్క చంద్రబాబు రక్షణ కోసం మోహరించిన పోలీసులకే దాదాపు మూడు కోట్ల రూపాయల ఖర్చయ్యిందని అంచనా. అలాగే మూడు రోజుల జగన్ టూర్ భద్రతా ఏర్పాట్లకు రెండు కోట్ల రూపాయలదాకా ఖర్చయ్యాయని అంటున్నారు. వాళ్ళు ఘనకార్యం చేసి, ఎవరిని ఉద్ధరిస్తున్నారని ఇంత ఖర్చు చేశారని ఒక్క పత్రికా అడగలేదు సరి కదాఅదిరిందయ్యా చంద్రంఅని ఒకరంటే శహబాష్ జగన్ అని ఇంకొకరు ఇద్దరి జబ్బలు చరుస్తున్నారు. మరోవైపు మానవహక్కులు, పౌరహక్కుల కోసం పోరాడుతున్నవాళ్ళు కూడా చంద్రబాబు, జగన్ పర్యటన మానవ హక్కుల ఉల్లంఘన అని మాట్లాడకపోవడం కూడా విచారకరం.

విచివూతమేమిటంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి ఇప్పుడు ఇద్దరి తో ఉన్న విభేదాలు మరిచిపోయి వారికి ఉక్కు కవచమై రక్షణ కల్పించడం కాంగ్రెస్ పార్టీని సైతం విస్మయ పరిచే విషయం. ఇద్దరు నాయకులకు న్యాయంగా ఉండాల్సిన రక్షణ ఏర్పాట్ల కంటే వేలాది రెట్లు ఎక్కువ సాయు బలగాలు సమకూర్చి స్వయంగా ప్రభుత్వమే ఇద్దరినీ తెలంగాణలో తిప్పింది.

వారలా తిరిగి రావడం కోసం వేలాది మందిని ఎక్కడికక్కడ నిర్బంధించింది. జై తెలంగాణ అని నినదించిన ప్రతి ఒక్కరినీ చితకబాది బంధించి మొత్తం రెండు జిల్లాలను కట్టడి చేసింది. ప్రభుత్వానికి పరిపాలిచే అర్హత లేదని శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టిన ప్రతిపక్ష నాయకుడికి, ఆయనతో చేతులు కలిపి అధికార పార్టీని నిట్టనిలువునా చీల్చి ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలనుకున్న జగన్కు ప్రభుత్వమే దాసో హం అవడం వెనుక కారణం తెలంగాణ ఉద్యమం. ఇప్పుడు తెలంగాణ వేడి చల్లారిందనో, సమస్య సమసి పోయిందనో కిరణ్ కుమార్ రెడ్డి నిరూపించుకోవాలి. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉందని గవర్నర్ ఢిల్లీకి నివేదించాలి. అలా చేయాలంటే గడిచిన రెండేళ్లలో జరగని అద్భుతం ఏదో జరగాలి. అందుకే ప్రభుత్వం ఇద్దరి పర్యటనలను వాడుకోవాలని చూసింది.

జగన్, బాబు ఇద్దరూ రెండేళ్లుగా తెలంగాణ అంశంపై రెండు నాల్కలతో మాట్లాడుతున్నారు. ఒకరు వ్యతిరేకించడం లేదు అంటే ఇంకొకరు వ్యతిరేకించం అంటున్నారు. కానీ ఇద్దరూ అనుకూలమని చెప్పలేకపోయారు. వైఖరి వల్లే ప్రజలు ఇద్దరినీ తెలంగాణలో కాలు మోపనీయలేదు. ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత తలకెత్తుకుని పర్యటనలను రూపొందించింది. కుల వైరుధ్యాలు, ముఠా కక్షలు, సిద్ధాంత వైరుధ్యాలు, వ్యక్తిగత విబేధాలు మరిచి తెలంగాణ వర్సెస్ సీమాంధ్ర అన్న రీతిలో ముప్పేట దాడిని సాగించారు. దాడిని నిరాటంకంగా పూర్తి చేయడానికి అన్ని రకాల హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారు. మీడియాకు ఇవేవీ వార్తలు కావడం లేదు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ అయి కూర్చుంది. ఇంత జరుగుతుంటే తెలంగాణవాదులు ఏం చేశారు అన్న ప్రశ్నను అదే మీడియా సంధిస్తోంది. ఒక్క మీడియా మాత్రమే కాదు. చాలా మంది తెలంగాణ కోరుకుంటున్న వాళ్ళును కూడా అదే ప్రశ్న వేధిస్తోంది.

అసలు తెలంగాణవాదులకు రాజకీయ నాయకులను అడ్డుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? బీజాన్ని ఎవరు నాటారు? అప్పుడు మానుకోటలో జగన్ను అడ్డుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడిన వాళ్ళు ఇప్పుడు ఏమైయిపోయారు? ప్రశ్నలకు సమాధానం వెతికితే రెండేళ్లలో రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని స్థితికి తీసుకొచ్చాయో అర్థమౌతుంది. కేవలం రెండేళ్ళే కాదు గడిచిన పదేళ్లుగా ఉద్యమం రాజకీయ ఛట్రంలోనే నడుస్తున్నది. కాకపొతే ఇప్పుడు అదే ఛట్రంలో నలిగిపోతున్నది. రెండే ళ్ళ క్రితం జేఏసీ ఏర్పాటైనప్పుడు ఉన్న పార్టీలలో తెలంగాణ కాంగ్రెస్ చేతుపూత్తేసింది. పార్టీ ఎంపీలు జై తెలంగాణ అంటుంటే ఎమ్మెల్యేలు మాత్రం జై కిరణ్ అంటూ ఊరేగుతున్నారు. తెలంగాణ తెలుగుదేశం ఫోరం పార్టీ సీమాంధ్ర అధినేతతో చేతులు కలిపి ఇప్పుడు తెలంగాణ అని ఎవరన్నా దంచుడే అని దబాయిస్తోంది. పనిలో పనిగా తెలంగాణ అమరులు, వారి త్యాగాలను కూడా తమ రాజకీయ వ్యాపారంలోకి లాగి లబ్ధి పొందాలని చూస్తోంది.

ఇప్పుడు జేఏసీలో మిగిలి ఉన్న పార్టీలలో కూడా స్పష్టమైన రాజకీయ వ్యూహం లోపించడం వల్లే జేఏసీ పిలుపునిచ్చినా నేతపూవరూ కదల లేదని అనిపిస్తోంది. బీజేపీ సీమాంధ్ర నేతలను తిరగనివ్వం అంటే మేం మీతో తిరగలేమని అంటోంది. తెలంగాణ బీజేపీ నేతలు ఆంధ్రా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళు అడ్డుకోవడంతో పార్టీ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు మిగిలింది టీఆర్ఎస్తోపాటు న్యూ డెమోక్షికసి ఒక్కటే! అందులో టీఆర్ఎస్ నేతలు ముందస్తుగా గృహ నిర్బంధంలో ఉండిపోయారు. మిగిలిన న్యూ డెమోక్షికసి కార్యకర్తలు సభలో అక్కడక్కడ హల్చల్ చేసి అరెస్ట్ అయ్యారు. రాజకీయ బలం లేదని గమనించిన నిజామాబాద్లో పోలీసులు కనిపించిన తెలంగాణవాదినీ కట్టి పడేశారు. ఉద్యమం చేసినా, సీమాంధ్ర నేతలను అడ్డుకోవాలన్నా టీఆర్ఎస్పార్టీ మాత్రమే చేయాలన్నట్టు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి.

అలాగే రెండుసార్లు తెలంగాణ వాదంతో గెలిచిన మధుయాష్కి లాంటి వాళ్లు కూడా ఇవాళ టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కమ్మక్కయ్యాయని వ్యాఖ్యా నిస్తున్నారు. ఇటువంటి రాజకీయ అయోమయం ఉందని తెలిసినప్పుడు తిరగనివ్వం అనడం నిలదీస్తాం అని చెప్పడం విమర్శలకు కారణం అవుతోంది. రాజకీయ నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకోవడం మంచిది కాదు. ప్రజల ఆకాంక్షల పట్ల స్పష్టతలేని పార్టీలను, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని వారిని నిలదీయడం ప్రజల హక్కు. ఇది ప్రజలకు మానుకోటకు జగ న్ వచ్చినప్పుడే అర్థమయ్యింది. అప్పు డు ఎర్రబెల్లి దయాకర్రావుతో సహా అందరూ జగన్ పర్యటనను వ్యతిరేకించిన వాళ్ళే. ప్రజల వైఖరి అలాగే ఉంది. మారిందల్లా రాజకీయ పార్టీలు, వాటి ప్రాధాన్యతలే. ఎవరైనా తమ తమ వైఖరులు మార్చుకోవచ్చు. కానీ సంగతి ప్రజలకు అర్థం చేయించాలి. వాళ్ళ ఆమోదం పొందాలి.

విచివూతంగా అన్ని తెలంగాణ పక్షాలు పరిస్థితుల పట్ల ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. రాజకీయ పార్టీల సంగతి అలా ఉంచితే గద్దర్, విమలక్కల నాయకత్వంలో ఉన్న రెండు వేదికలూ రెండు సందర్భాలలో దూరంగానే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమంలో లేనన్ని సంఘాలూ సంస్థలు జేఏసీలు పని చేస్తున్నాయి. ఎవరికి వాళ్ళు తామే ప్రత్యామ్నాయం అని చెపుతున్నారు. ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు అందరూ కదులుతున్నారు. ఆగిపోతే అంతా ఎక్కడికక్కడ నిలబడిపోతున్నారు. అప్పుడప్పుడు ఒకరినొకరు విమర్శించుకోవడమో అలా విమర్శలకు దిగిన వారికి మద్దతు తెలుపడమో చేస్తున్నారు తప్ప లక్ష్యం వైపు నడిపించడంలో అందరూ విఫలమౌతున్నారు. కచ్చితంగా మొత్తం పరిణామాలకు టీఆర్ఎస్ మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఎందుకంటే ఇప్పటికీ టీఆర్ఎస్ పట్ల ప్రజలలో విశ్వాసం ఉన్నది. విశ్వాసం నిలబెట్టుకోవాల్సిన అవసరం కనీసం ఏదో ఒకటి తేలేదాకా పార్టీ మీద ఉంటుంది. వ్యక్తులుగా, సంస్థలుగా రాజకీయ పక్షాలుగా ఎవరి సిద్ధాంతాలు, ఆలోచనలు వారికి ఉన్నా ఇప్పటికీ చాలామంది టీఆర్ఎస్ వైపే చూస్తున్నాయి. కానీ గడిచిన రెండేళ్లలో పార్టీ వ్యూహమేమిటో అంతుచిక్కక పోవడమే అయోమయానికి కారణం అవుతోంది. జరిగిన సంఘటనల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం కంటే తెలంగాణవాదుల సమష్టి వైఫల్యమే ఎక్కువగా ఉంది. సమన్వయ లోపమూ కనిపిస్తున్నది. నిర్లక్ష్యం ఒక్క టీఆర్ఎస్కే కాదు. మొత్తం తెలంగాణవాదానికే ప్రమాదం. పరిస్థితుల్లో టీఆర్ఎస్తో సహా ఉద్యమంలో ఉన్న అన్ని శక్తులు భవిష్యత్ కార్యాచరణను రాజకీయ అవసరాలకు అనుగుణంగా రూపొందించుకోవలసిన అవసరం ఉంది.

అయోమయాన్ని సంక్రాంతి తరువాత మళ్ళీ ఉగాదికి వాయిదా వేయకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అవసరాలను బట్టి నిర్ణయాలు, వ్యూహాలు, ఎత్తుగడలు ఉంటే వ్యక్తులు పార్టీలు తాత్కాలికంగా లబ్ధి పొందవచ్చు కానీ ప్రజల విశ్వాసాన్ని మాత్రం కోల్పోతారు. చర్చిల్ ఇంకొక సందర్భంలో చెప్పినట్టు రాజకీయ నాయకుడికి భవిష్యత్తులో ఏం జరుగబోతుందో చెప్పగలిగే సామర్ధ్యం ఉండాలి. అలా ఎందుకు జరగలేదో విశ్లేషించే చతురతా ఉండాలి. ఇప్పుడు మన నాయకులకు రెండూ కొరవడ్డాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి