మంగళవారం, జులై 05, 2011

ఉమ్మడిగా ఉద్యమిద్దాం



‘విజ్ఞులారా,
మనం మూకుమ్మడిగా బలిదానాలు ఇవ్వకపోతే...
కచ్చితంగా మనల్ని విడివిడిగా బలిగొంటారు..’



అమెరికా స్వాతంత్ర ప్రకటన సందర్భంగా వలసవాద విముక్తి పోరాటం లో ఐక్యకార్యాచరణ అవసరాన్ని ప్రబోధిస్తూ బెంజిమన్ ఫ్రాంక్లిన్ అన్న మాటలివి. జూలై నాలుగో తేదీ అమెరికా స్వాతంత్రం ప్రకటించుకున్న రోజు. ఆ స్ఫూర్తితో ఉద్యమకారులనుద్దేశించి ఫ్రాంక్లిన్ ఆ మాటలన్నారు. తెలంగాణలో సోమవారం జరిగిన పరిణామాలు యాదృచ్ఛికమే కావచ్చు గానీ చరివూతలో చాలా సంఘటనలకు కొనసాగింపుగా కనిపిస్తున్నాయి. జూలై నాలుగు సంఘటనలు ప్రపంచంలో అనేక దేశాలను ప్రభావితం చేశాయి. అనేక ఉద్యమాలకు ఉత్ప్రేరకంగా పనిచేసాయి. జూలై నాలుగంటే ఒక్క అమెరికా స్వాతంవూత్య దినమే కాదు. తెలంగాణ జన విముక్తి కోసం దొడ్డి కొమురయ్య తన ప్రాణాలను బలిదానం ఇచ్చిన రోజు. బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై పోరాడిన కొదమ సింహం అల్లూరి జయంతి. యాదృచ్ఛికమే అయినా తెలంగాణ ప్రజావూపతినిధులు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం తెలంగాణ ఉద్యమ చరివూతలో ఒక విజయంగా నమోదయింది.


అమెరికా స్వాతంత్య్ర ప్రకటన ఆ దేశాన్ని వలస పాలన నుంచి విముక్తి చేసింది. అంతేకాదు ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని ఒక పరిపాలనా విలువ గా ఆవిష్కరించింది. ఫ్రాం క్లిన్ లాంటి ఎంతో మంది మేధావులు ప్రజాస్వామ్య మూల సూత్రాలను రూపొందించారు. ప్రజాస్వామ్యం .పజలు తమ అంగీకారంతో, ఉమ్మడి ఆలోచనతో, సమష్టి నిర్ణయాలతో ఏర్పాటు చేసుకు నే పాలనా వ్యవస్థ అని అనుకున్నారు. ఈ ఉమ్మడి విలువలకు ఎవరైనా కట్టుబడి ఉండకపోతే, సమష్టి నిర్ణయాన్ని ఎవరైనా ధిక్కరిస్తే ఏం చేయాలన్న ప్రశ్నలు అప్పుడు, ఆ తరువా త అనేక సందర్భాల్లోనూ వచ్చాయి. అలాంటప్పుడు ప్రజాస్వామ్యంలో అసమ్మతిని, అసంతృప్తిని, అనంగీకారాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంటుందని అమెరికా స్వాతంత్య్ర ప్రకటన స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీగా లేని ప్రభుత్వాలకు నిరసన తెలపడమే కాదు, అట్లాంటి పరిస్థితులు సరిదిద్దడానికి ఆ ప్రభుత్వాలను కూల్చివేసే అధికారం కూడా ప్రజలకు ఉంటుందని ప్రజాస్వామ్యానికి మూలమైన ఆ ప్రకటనే కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. అటువంటి అధికారంలోంచి వచ్చిన హక్కే రాజీనామా. ఆ హక్కును గుర్తించినందుకు అభినందనలు.



పాలకవర్గంలో ఉన్న ఒక ప్రతినిధి రాజీనామా చేయడమంటే బాధ్యత నుంచి పారిపోవడం కాదు. ప్రజావూపతినిధులుగా బాధ్యతలను గుర్తెరిగి, అది పాలకులకు గుర్తుచేయడం. పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రజలకు ఎరుక పరచడం. ప్రజల పక్షాన నిలబడి వారి హక్కులను కాపాడడం. ఇవాళ తెలంగాణ ప్రజావూపతినిధుల రాజీనామాలు ఇలాంటి అనేకానేక ప్రజాస్వామిక విలువలను నిలబె భావించాలి. యాభై ఏళ్ల నిర్లక్ష్యంపై తిరుగుబాటుగా పరిగణించాలి. గత పదేళ్లుగా కొనసాగుతోన్న రాజకీయ పోరాటానికి గుర్తింపుగా గమనించాలి. పైగా ఒక వ్యక్తో, ఒక పార్టీనో కాదు, మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా నివ్వెరపోయే విధంగా ఎలాంటి శషభిషలు లేకుండా ఈ రాజీనామా లు తెలంగాణ ఆత్మను ఆవిష్కరించాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టాయి. ప్రజాభివూపాయాన్ని ఇంతకంటే పరిపూర్ణంగా వ్యక్తం చేసిన సంఘటన భారత పార్లమెంటరీ చరివూతలో ఎన్నడూ లేదు. పైగా ఈసారి రాజీనా మా చేసిన వాళ్లు పదవిపోతున్నట్టుగా లేరు. ఒక పవిత్ర కార్యంలో మమేకవుతున్నట్టుగా కనిపించారు. ఒక బరువు దిగినట్టుగా, బంధనాలు తెగిపోయినట్టుగా ఆనందించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత ఆ ఆనందంలో నడిరోడ్డుపై నృత్యం చేశారు. బహుశ ఎమ్మెల్యేగా గెలిచిన రోజు కూడా ఆమె అంత ఆనందించి వుండరు.


అయినా సరే .. కొందరు పదవీ లాలసలో ఉన్న వాళ్లు పెదవి విరుస్తూనే ఉన్నారు. రాజీనామాల వల్ల్ల రాష్ట్రం రాదనీ, మహా అయితే మళ్లీ ఎన్నికలొస్తాయని ఎగతాళి చేస్తున్నారు. రాజీనామాల వల్ల రాజ్యాంగ సంక్షోభం కాదుగదా.. రాజకీయ సంక్షోభం కూడా రాదని అవహేళనగా మాట్లాడుతున్నారు. రాజకీయ సంక్షోభం అప్పుడే మొదలైందన్న సంగతి వాళ్లు గమనిస్తే మంచి ది. రాజీనామాల దెబ్బకు నిన్నటిదాకా నిద్ర నటిస్తూ వచ్చిన ఢిల్లీ పెద్దలు ఉలిక్కిపడి లేచి ఇవాళ అర్ధరావూతుల దాకా జాగారం చేస్తున్నారు. పైకి మేక పోతుల్లా గంభీరంగా కనిపిస్తున్నా తమ వారికి సందేశాలు పంపిస్తున్నారు. సంకేతాలిస్తున్నారు. చర్చలు సంప్రతింపులు మొదలు పెట్టారు. మరోవైపు యింతకాలం షరతులతో నడిచిన తెలుగుదేశం ఇవాళ నూటికి నూరు పాళ్లు ప్రజల్లో కలిసిపోవడానికి సిద్ధపడింది. ప్రజల్లో లేకపోతే ఎక్కడా మిగలలేమన్న సంగతి వాళ్లకు అర్థమయింది. ఒక వైపు కాంగ్రెస్ మరోవైపు తెలుగుదేశం రాజీనామాల్లో పోటీపడ్డాయి. ఇక ఉద్యమిస్తామని పోటాపోటీగా ప్రకటిస్తున్నాయి.


అయినా సరే ఇదొక శుభ పరిణామం. ఇదొక బలం. రాజీనామాలకు అంతటి బలముంది కాబట్టే తెలంగాణలో నాలుగుకోట్లమంది ఏడాదికిపైగా ఈ సందర్భం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రాజీనామాల కోసమే వందలాది మంది యువకులు కలతతో తమ ప్రాణాలను బలితీసుకున్నారు. ఈ రోజును చూడడం కోసమే జయశంకర్ సారు పదిరోజుల క్రితం వరకు పలవరిస్తూ ఎదురుచూశారు. ఎన్ని అనర్థాలకో, అనవసర చర్చలకో కారణమైన ఈ రాజీనామాలు ఆలస్యమైనా సరే అమరుల ఆత్మకు శాంతి చేకూరుస్తాయి. ఇంకా మిగిలి ఉన్న యుద్ధానికి కొత్త బలాన్ని ఇస్తాయి.తెలంగాణ ఉద్యమం లో ప్రజలు ఎప్పుడూ యుద్ధానికి భయపడలేదు. భూమికోసమైనా, భుక్తికోసమైనా, విముక్తికోసమైనా పోరాటమే మార్గమని నమ్మిన చరిత్ర తెలంగాణది. ఇవా ళ రాష్ట్రం కోసం సాగుతు న్న పోరాటంలో ప్రజలు తమతో ప్రజావూపతినిధులు కూడా నిలబడాలని కోరుకుంటున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా కలిసొచ్చే వాళ్లందరినీ అభినందించాల్సిందే. అలాగే అధికార మదాంధకారమత్తులై కలిసిరాని వాళ్లను జనంలోంచి వెలివేయాల్సిందే. అయితే అంతిమ విజయం అంత తేలిక కాదు. అది ఐక్య కార్యాచరణతోనే సాధ్యపడుతుంది. ఇప్పుడు పార్టీలు వేరైనా అంతా ప్రజల పక్షంలోనే ఉన్నామని నిరూపించుకోవాలి. ఉత్థానపతనాపూన్ని ఎదురైనా ఉద్యమ పతాకాన్ని విడువని జేఏసీ కొత్త కార్యాచరణ ప్రకటించింది. ఆ కార్యాచరణ అమలులో రాజీనామాలు చేసిన నేతలంతా ముందుండాలి. జేఏసీతో పాటు ఇప్పటిదాకా ఉద్యమరథ సారథ్యం చేస్తోన్న కేసీఆర్ కూడా ఈ కొత్త బలగాలను కలుపుకునిపోతే తెలంగాణకు బలం పెరుగుతుంది. ఇప్పుడు పదవులు లేవు. పార్టీల ప్రతిబంధకాలు కూడా ఉండకూదన్న విషయాన్ని అందరూ గమనించాలి.


తెలంగాణ నేతలను పార్టీ అధిష్ఠానాలు..బుజ్జగిస్తే వినకపోతే బెదిరించే అవకాశాలున్నాయి. అటు రాజకీయ పార్టీలు, ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ఆ పనిచేస్తారు. రాష్ట్రపతి పాలన అని తెలుగు మీడియా కూస్తూనే ఉంది. అది పదవులండవని బెదిరించడం కోసం చేస్తోన్న ప్రచారం అని గమనించాలి. అయినా రాష్ట్రపతి పాలన వస్తే కొత్తగా పోయే హక్కులేవీ లేవు. గత ఏడాదిగా తెలంగాణ పోరాటం ఎనిమిదో చాప్టర్ పాలనను అనుభవిస్తూనే ఉన్నది. రేపోమాపో పార్టీల అధినేతలు రంగంలోకి దిగుతారు. స్పీకర్లు పిలిచి సమైక్య హితబోధనలు చేస్తారు. అందుకే అందరూ ఒక్కమాట గుర్తించుకోవాలి. తెలంగాణ సాధించేదాకా కలిసి పోరాడాలి. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అండతో ముందుకు సాగాలి. ఎన్నికలంటూ వస్తే.. సమైక్యంగా కలిసికట్టుగా ఎదుర్కోవాలి. వచ్చే ఎన్నికలను తెలంగాణలోనే..నిర్వహించుకోవాలి. విడిపోతే ఎక్కడికక్కడ బలితీసుకునే కసాయిలుంటారు. జాగ్రత్త!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి