బుధవారం, మే 06, 2020

కొవిడ్ కాలంలో కొత్త విద్యా వ్యవస్థ!

 
రోనా వైరస్ ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. అనూహ్యంగా  వచ్చిపడ్డ ఈ మహమ్మారి బారినుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో తెలియక  మానవ జాతి యావత్తూ బిక్కుబిక్కుమంటోంది. ప్రస్తుతానికి వేరే మార్గమేదీ కనిపించక చేష్టలుడిగి దేశాలు మూతపడ్డాయి. లాక్ డౌన్ ల మూలంగా మొత్తం జన జీవనం స్తంభించిపోయింది. చరిత్రలో ఎన్నడూ చూడని ఈ ఉపద్రవం నుంచి బయటపడడం ఎలాగో తెలియని అయోమయం రాజ్యమేలుతోంది. మళ్ళీ ఈ వ్యవస్థలను పునర్నిర్మించుకోవడం, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కి మనుగడ సాగించడం ఇప్పుడొక సవాలు గా మారిపోయింది.ముఖ్యంగా ఆర్ధిక, పారిశ్రామిక వ్యవస్థల మీద దీని ప్రభావం గురించి ఆర్ధిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. పునర్నిర్మాణ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజలను కట్టడి చేసి ఆర్ధిక వ్యవస్థలను నిలబెట్టుకోవడం సాధ్యంకాదు కాబట్టి క్రమక్రమంగా లాక్ డౌన్లు ఎత్తివేస్తున్నారు. అయినా సరే   కోవిడ్ 19  నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనలను, జాగ్రత్తలను కొన్ని సంవత్సరాలపాటు తూచా తప్పక ఆచరించాల్సిందే అంటున్నారు.అంటే వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటూనే, ఒకరికి ఒకరు భౌతికంగా దూరం పాటించక తప్పదని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విద్యారంగం మీద కోవిడ్ ప్రభావం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ప్రధానమైన అంశంగా మారిపోయింది. ముఖ్యంగా కిక్కిరిసిపోయి ఉండే భారతీయ తరగతి ఎలామారబోతుంది. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేదిచర్చకు వస్తోంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాలు దీనిమీద పూర్తిగా  దృష్టిపెట్టనప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు యునెస్కో, ప్రపంచబ్యాంకు వంటివి కొన్ని ప్రతిపాదనలను చర్చకు పెట్టాయి. మన ప్రభుత్వాలకు కూడా రానున్న రోజుల్లో ఇదే ప్రధానమైన సమస్య కాబోతోంది.

కరోనా వైరస్ బయటపడిన వెనువెంటనే విశ్వవ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి.  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్లమంది పాఠశాల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మూతపడిపోయాయి. అమెరికా, ఐరోపా దేశాల్లోకొత్త విద్యాసంవత్సరం అడ్మిషన్లు నిలిచిపోయాయి. మనదేశంలో వార్షిక పరీక్షలను  మధ్యలోనే ఆపేసి లాక్ డౌన్ చేయాల్సివచ్చింది. ముఖ్యంగా కీలకమైన 10, 12 తరగతుల విద్యార్థులు ఇంకా పరీక్షలు పూర్తికాక భవిష్యత్తు పట్ల అయోమయంలో ఉన్నారు. పరీక్షలతో పాటు వచ్చే విద్యాసంవత్సరానికి కావాల్సిన ఎంట్రన్స్, అడ్మిషన్ టెస్ట్ లు కూడా వీళ్ళు పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విద్యాసంవత్సరాన్ని జూన్ నుంచి కాకుండా సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. భారతీయ విద్యారంగం ప్రపంచంలో అన్నిటికన్నా పెద్దది. నిజానికి దేశ జనాభాలో దాదాపు 50 కోట్లమంది చదువుకునే వయసులో అంటే ఐదేళ్లనుంచి 24 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లే. దేశంలో దాదాపు 15 లక్షల స్కూళ్ళు, 40 వేలదాకా కాలేజీలు, దాదాపు వెయ్యి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.వీటిల్లో చదువుకునేవారి సంఖ్య దాదాపు 30 కోట్లు. ఇప్పుడు ఈ 30 కోట్లమంది ఇళ్లకే పరిమితమై ఉన్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు కోటిన్నర మంది విద్యార్థులున్నారు. ఈ కోటిన్నర మంది  భవిష్తత్తు ఇప్పుడు కోవిడ్ 19 పరిధిలోఉంది.  వెంటనే విద్యాసంస్థలు తెరిచే పరిస్థితులు లేకపోయినా, మరో రెండు మూడు నెలల్లో విద్యాసంవత్సరం ప్రారంభించకపోతే అది మొత్తం ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల మీద విద్యార్థుల భవితవ్యం మీద  తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది.

విద్యాసంస్థలు ఎప్పుడు తెరిచినా కోవిడ్ 19 నిబంధనలు కొత్త సవాలు గా మారబోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న దశలోనే పాఠశాల-పరిసరాలు ఎలా ఉండాలో ప్రపంచ ఆరోగ్యసంస్థ యూనిసెఫ్ తో కలిసి ఒక ప్రోటోకాల్ ను రూపొందించింది. దానితో పాటు ఖచ్చితంగా పాటించాలని ఒక చెక్ లిస్టును కూడా ఇచ్చింది. దాని ప్రకారం ఇప్పుడు మనం మొత్తం విద్యారంగ మౌలిక సదుపాయాలూ మార్చవలసి ఉంటుంది.ఇది విద్యావ్యవస్థ స్వరూప, స్వభావాలను ఓపూర్తిగా మార్చేసే విధంగా ఉంది. ప్రతి టీచర్ , ప్రతి విద్యార్ధి మాస్కులు  ధరించాలి. ప్రతి తరగతిగదిని రోజుకు కనీసం ఒక్కసారైనా( వీలైతే తరచుగా) నీటితో కడగడం, తుడవడం చేయాలి, ఆ గదిలోని ప్రతి వస్తువునూ శానిటైజ్ చేయాలి.  విధిగా తరగతి గదికి అందుబాటులో శానిటైజెర్లు లేదా సబ్బులు ఉంచాలి, విద్యార్థులు తరచుగా  చేతులు కడుక్కునే సౌకర్యం, నిరంతరాయ నీటి వసతి కల్పించాలి. పాఠశాలల్లో తరచూ జరిగే అసెంబ్లీ లు,ఆటలు, విద్యార్థులు గుమిగూడి ఉండే  ఇతర సామూహిక కార్యక్రమాలు ఉండకూడదు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఒక్కో విద్యార్థికి మధ్య కనీసం ఒక మీటరు దూరం కచ్చితంగా ఉండాలన్నది కోవిడ్ 19 నియమం.  దీనిని పాఠశాలల్లో కూడా పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతోంది. అంటే తరగతి గదుల్లో ఒక విద్యార్థికి మరో విద్యార్థికీ మధ్య ఖచ్చితంగా అన్ని వైపులా కనీసదూరం ఒక మీటర్ ఉండాలి. ఇవన్నీ ఇటు ప్రభుత్వాలకు, అటు ప్రైవేటు విద్యాసంస్థలకు పెనుసవాళ్లు కాబోతున్నాయి. ఈ జాబితాలో పేర్కొన్నట్టు  అన్నివసతులు, మౌలిక సౌకర్యాలు కల్పించడం ఒక ఎత్తయితే, తరగతి గదిని కోవిడ్ స్టాండర్డులో రూపొందించడం ఒక పెద్ద సమస్య కాబోతోంది. ఈలెక్కన ఇప్పుడున్న తరగతి గదుల సంఖ్యను ప్రభుత్వ పాఠశాలల్లో అయితే రెండుమూడురెట్లు, ప్రయివేటులో అయితే ఐదారురెట్లు పెంచాలి. ఇది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదు. ఎందుకంటే ఇప్పుడున్న తరగతి గది, సౌకర్యాలు, మౌలిక వసతులు సమకూరడానికి కనీసం కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు వీటిని అవసరానికి అనుగుణంగా విస్తరించడానికి కొన్ని వేలకోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఈ సంక్షోభంలో ఒక్క మనకే కాదు, అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికి కూడా ఇది సాధ్యం కాదు.

ఈ పరిస్థితులను అధిగమించడానికి ఇప్పటివరకు మనం అనుసరిస్తోన్న విద్యాప్రణాళికలు, బోధనా పద్ధతులు పూర్తిగా మార్చడం ఒక్కటే పరిష్కారం అంటున్నారు విద్యారంగ నిపుణులు. అంతే కాకుండా సాంప్రదాయిక విద్యా బోధనా విధానాలను కూడా మార్చాల్సిన అవసరం ఉందంటున్నారు. సమస్యేమిటంటే గురుకులాలు మొదలు భారతదేశం గురుశిష్యులు ముఖాముఖిగా ఉండి బోధించే పద్దతికి అలవాటు పడిన దేశం. సమాచారం తెలుసుకోవడానికి టెలీవిజన్ మొదలు సామాజిక మాధ్యమ వేదికలైన వాట్సాప్, పేస్ బుక్ లు ఎన్నిఉన్నా చదువనే సరికి తరగతిగది, ఎదురుగా టీచర్ ఉండాల్సిన సాంప్రదాయ స్థితిలోనే మన విద్యారంగం ఉంది. అంతే కాకుండా ఆప్యాయంగానైనా, టీచర్లు విద్యార్థులను తాకకుండా ఉండలేని సంస్కృతి మనది.అదేవిధంగా విద్యార్థులు ఒకరినొకరు తాకకుండా, కలిసి మెలిసి ఉండకుండా ఉండగలరా? ఉండవచ్చునా? ఇవన్నీ నిజంగానే అర్థం లేని విషయాల్లా కనిపిస్తాయి. ఇలాటి పరిస్థితుల్లో మన బోధన, అభ్యాసన సంస్కృతికి సంబంధమే లేని దూరవిద్య మనకు పనికొస్తోందా, మన విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారనేది మరో సమస్య. దూరవిద్య అంటే ఓపెన్ యూనివర్సిటీ లేదా ఓపెన్ స్కూల్ అనేది పాత భావన. ఇప్పుడు మనం థియేటర్ కు వెళ్లకుండానే ఒక కొత్త సినిమా అమెజాన్ లోనో, నెట్ ఫ్లిక్స్ లోనో ఎలా చూస్తున్నామో అలాగే పాఠశాలలకు వెళ్లకుండానే చదువుకోవచ్చు. అటువంటి సాంకేతిక సౌకర్యాలు, సౌలభ్యత ఇప్పుడు అందుబాటులో ఉంది. అందులో మొదటిది టీవీ. మనదేశంలో విస్తృతమైన టెలివిజన్ నెట్ వర్క్ ఉంది. దాదాపుగా విద్యార్థులున్న ప్రతి ఇంట్లో టెలివిజన్ ఉన్నది. దేశవ్యాప్తంగా కనీసం 70 శాతం ఇళ్లల్లో, దక్షిణాదిలో ముఖ్యంగా ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో 90 శాతంకంటే ఎక్కువ ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి. కాబట్టి ఇదొక అవకాశంగా తీసుకుని కనీసం 40 శాతం పాఠాలు ఇంట్లోనే బోధించేలా చర్యలు తీసుకోవాలన్నది ఒక ప్రతిపాదన. అదే కాకుండా మొబైల్ లెర్నింగ్ రెండో ప్రత్యామ్నాయం. దేశ జనాభాలో 93 శాతానికి పైగా మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.2019 మెకెన్సీ నివేదిక ప్రకారం దాదాపు 40 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. జియో వచ్చిన తరువాత ఇది మరింత పెరిగింది. విద్యార్థుల్లో ఇది కనీసం 95 శాతంగా ఉంటుంది. అలాగే దాదాపు 40 కోట్ల మందికి వాట్సాప్ అకౌంట్లు ఉన్నాయి. కాబట్టి మొబైల్ లెర్నింగ్ కూడా ఒక ప్రత్యామ్నాయం కాబోతుంది. పాఠశాల విద్యార్థులకు టెలివిజన్ పాఠాలు ప్రత్యామ్నాయం అనుకుంటే, కళాశాలలకు మొబైల్ సేవలను ఎక్కువగా వాడుకోవచ్చు. అలాగే ఈ -లెర్నింగ, డిజిటల్ లెర్నింగ్ లాంటి అనేక సాంకేతిక సదుపాయాలూ ఇప్పుడు ఉన్నాయి. అంతే కాకుండా పరంగా ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలన్నీ తమ పాఠాలను మూక్స్, మూడుల్ లాంటి కొత్త వేదికల ద్వారా ఉచితంగా ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తెస్తున్నాయి.గూగుల్ కూడా కొత్తగా విద్యాబోధనకు సంబంధించిన కొత్త టూల్స్ ను అందుబాటులోకి తెస్తోంది. వీటిని విస్తృతంగా వాడుకోవాల్సిన అవసరం ఉన్నత విద్యారంగంలో రావొచ్చు. 

ఎలక్ట్రానిక్ మాధ్యమాల వినియోగంతో తరగతి గదిలో బోధించే విషయాలను కుదించడం తో పాటు,పాఠానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా ప్రింట్ రూపంలో అందించవలసి రావొచ్చు. అలాగే ఇప్పుడున్న సిలబస్ ను కూడా సమీక్షించవలసి రావొచ్చు.ఇతర దేశాలతో పోల్చితే మన తరగతి గదిలో అనవసర విషయాలు చాలా బోధిస్తున్నామనే  కాలంగా ఉంది. దీనిని మార్చుకుని, కొత్త సిలబస్ రూపొందించే అవసరాన్ని ఇప్పుడు కోవిడ్ తెచ్చింది. అలాగే హాస్టల్స్, రెసిడెన్సియల్ విద్యాసంస్థలు భారీ మార్పులు చేయాల్సి రావొచ్చు. ఇప్పుడు మన ప్రభుత్వాలు ఆలోచిస్తున్న ప్రకారం, అలాగే కోవిడ్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా  ఒక్కో విద్యార్థికి కనీసం వంద మీటర్ల స్థలం అవసరం. అంటే ఒక్కో గదిలో ఒక్కరు, లేక ఇద్దరికంటే ఎక్కువ మందిని ఉంచడానికి వీలులేదు. అలాగే భోజన శాలలు, స్టడీ రూములు, లైబ్రరీలు, ఇతర సామూహిక స్థలాల్లో కూడా చాలా మార్పులు రావాల్సి ఉంటుంది. ఇది కేవలం పాఠశాలలకే కాదు కళాశాలలకు, విశ్వ విద్యాలయాలకు కూడా వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థలో అన్నిదశల్లోకూడా సమూలమైన, మౌలికమైన సంస్థాగత మార్పుల దిశగా ప్రయత్నాలు జరగాలి. ఇప్పుడున్న మౌలిక వసతులను షిఫ్తుల వారీగా వాడుకోవడం, దూర విద్యా వ్యవస్థలు, ఓపెన్ యూనివర్సిటీలను, అవిరూపొందించే పాఠ్యముషాలను  అందరికీ అందుబాటిలోకి తేవడం అవసరం కావొచ్చు. అలాగే పాత సాంప్రదాయ బోధన స్థానంలో కొత్త బోధన అభ్యసన పద్ధతులను అలవాటు చేసుకోవాల్సి రావొచ్చు.  

ఇవన్నీ కావాలనుంటే కష్టమే. కానీ కరోనా అటువంటి కొత్త ప్రమాణాలను మనముందుకు తెచ్చింది.  కనీసం  వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టి, అది అందరికీ అందుబాటులోకి వచ్చే వరకైనా సరే ఈ ఏర్పాట్లు అవసరం అవుతాయి.ఇప్పుడు కరోనా వైరస్ కు సంబంధించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన వచ్చింది, పాఠశాలలు, ప్రభత్వాలు విస్మరించినా ప్రజలు వీటన్నిటినీ గమనిస్తుంటారు. వీటికే ప్రాధాన్యత ఇస్తారు. కరోనా కాలంలో గడిపిన కఠోరమైన జీవితం తరువాత ప్రజలెవరూ  ప్రమాణాల విషయంలో రాజీపడే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వాలు, పాఠశాలల నిర్వాహకులు, విద్యార్థులు దీనికి సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ ప్రతిపాదిస్తోన్న ఈ కొత్త విద్యావ్యవస్థ ఎలా అమలవుతోందో, ఇది విద్యార్థుల మానసిక స్థితి మీద, అభ్యసన ప్రవృత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపబోతుందో వేచి చూడాల్సిందే.

ప్రొ. ఘంటా చక్రపాణి
చైర్మన్, (తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి