శుక్రవారం, జులై 27, 2012

డబుల్ బారెల్ జ'గన్' !



సిరిసిల్ల పరిణామాలు శ్రీలంకను గుర్తుకు తెచ్చాయి. అందుకు ముందుగా తెలంగాణా లిబరేషన్ టైగర్ రహీమున్నీసాకు తెలంగాణా వాదులంతా కృతజ్ఞతలు చెప్పాలి. తెలంగాణా ఆడబిడ్డల తెగువ కళ్ళార చూసే అవకాశం వచ్చినందుకు  వై ఎస్ విజయ అలియాస్ విజయమ్మ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి.  వై ఎస్ విజయ సిరిసిల్ల ప్రయాణమైన తీరు , ఆమెకు బాసటగా రాష్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఒక జాత్యహంకార ధోరణిని గుర్తుకు తెచ్చాయి.ఆధోరణి తెలంగాణా ఆత్మాభిమానాన్ని మరోసారి తట్టిలేపింది. ఖచ్చితంగా  రహీమున్నీసా సీమాంధ్ర వితండ వాదులకు వెన్నులో చలి పుట్టించింది. ఇప్పుడు తెలంగాణా ప్రపంచమంతా రహీమున్నీసా త్వరగా కోలుకోవాలని కోరుకుంటోంది. పవిత్ర రంజాన్ మాసంలో ఆమె యావత్ తెలంగాణా యువతకు స్ఫూర్తి ప్రదాత కావాలని ఆశిస్తోంది. శ్రీలంకలో కూడా రహీమున్నీసా లాంటి అనేకమంది యువతీ యువకులు అక్కడి పాలకులను ఉక్కిరి బిక్కిరి చేసారు.

రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే సరిగ్గా విజయమ్మ ఉత్తర తెలంగాణాకు వెళ్ళినట్టే  శ్రీలంక ఉత్తర- తూర్పు భూబాగంలో ఉన్న తమిళ ప్రాంతాలకు శ్రీలంక ప్రభుత్వం వెళ్ళాలంటే ముందు సైన్యం, వెనక భారీ కాన్వాయి బయలుదేరేది. దారిపొడుగునా సాయుధ వైమానిక దళాలు, హేలీకాప్తర్లు పహారా కాసేవి. అప్పుడు శ్రీలంకలోని తమిళ ప్రాంతాలు విముక్త ప్రాంతాలుగా ఉండేవి. ఆంటే శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళులు ఎల్ టీ టీ  ఆధ్వర్యంలో తమకు తాము స్వంతంత్రం ప్రకటించుకుని స్వయం పరిపాలన సాగించేవారు. తమిళ ప్రాంతీయ  ఉద్యమం కూడా సరిగ్గా మన తెలంగాణా తొలి ఉద్యమ కాలంలోనే మొదలయ్యింది. అచ్చం 1969 లో  మన యువకులు విధ్యార్తుల్లాగే అక్కడి కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో సీట్లురాని యువకులు, నిరుద్యోగులు తమకు న్యాయం కావాలని ఆందోళనకు దిగారు.తమిళులకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తితో కూడిన 'ఈలం' ఆంటే ప్రాంతం కావాలని ఉద్యమించారు. అనేక దఫాలుగా పోరాడి అన్ని ప్రజాస్వామిక మార్గాలు మూసుకుపోయిన తరువాత విసిగి వేసారి అక్కడి తమిళులు తమకు తాము స్వాతంత్రం ప్రకంటించుకున్నారు. అదే తమిళ ఈలం.  తమిళ ఈలం కు  సొంతగా త్రివిధ దళాలతోపాటు అన్ని రకాల మంత్రిత్వ శాఖలు, విద్య, వైద్యం, నీటి వసతి, ప్రజా పంపిణీ మొదలు అన్ని  పౌర సేవా విభాగాలు ఉండేవి. ఆంటే సింహళ జాత్యహంకార జాతీయ ప్రభుత్వానికి పోటీగా తమిళులు తమ స్వతంత్ర ప్రభుత్వాన్ని, స్వయం పరిపాలనను నడిపించేవారు. తమిళ ప్రాంతీయ ఆకాంక్షను ఓడించాలనుకున్నప్పుడల్లా ప్రభుత్వాలు ప్రాంతానికి సాయుధ బలగాలతో ప్రయాణమై ప్రాణాల మీదికి తెచ్చుకుంటూ ఉండేవి. సరిగ్గా విజయమ్మ కూడా తెలంగాణా నడిబజారులో అలాగే పరువుతీసుకుని బ్రతుకు జీవుడా అని ప్రాణాలతో బయటపడింది.

రహీమున్నీసా వరంగల్ నుంచి సిరిసిల్లదాకా ప్రయాణించి వచ్చింది. సాయుధ బలగాలచక్రబంధం, ప్రైవేటు సైన్యపు పహారా, కిరాయి కార్యకర్తల కోలాహలం దాటుకుని రహీమున్నీసా నేరుగా విజయమ్మ ముందు పోలీసుజీపుమీదికి ఎక్కి చెప్పు చేతిలోకి తీసుకుంది. అంతే! విజయమ్మకు ఖచ్చితంగా చాకలి ఐలమ్మ  కనిపించి ఉంటుంది.  వై ఎస్ విజయమ్మ సిరిసిల్ల లో ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం మీకు గుర్తుందా! టీ వీలో ఆమె ప్రసంగాన్ని చూస్తున్నప్పుడు నాకైతే ఆమె పులిబోనులో చిక్కిన తుంటరి నక్కలా కనిపించింది. ముఖం నిండా చెమటలు,  వణుకుతున్న కంఠం, తడారిపోయిన గొంతులో తడబడే మాటలు, పొంతన లేని ప్రసంగం, ఆమె హావభావాలు, ముఖ కవళికలు గమనిస్తే పులుల కొనలోంచి ఎలా బయట పడగలనన్నట్టు గా కనిపించాయి. ఎప్పుడైనా నిండుగా  నవ్వుతూ కనిపించే ఆమె ముఖంనిండా గతంలో ఎప్పుడూ లేని ఆందోళన!  అది భయం, అవమానభారం, అహం దెబ్బతిన్న అసహనం కలగలిసిన  ఆందోళన. భయాందోళన వల్లనే ఆమె ఒక చేత బైబిల్ ను బిగపట్టుకున్నారు. చేయకూడని పాపం చేసి దొరికిపోయిన పశ్చత్యాపం ఆమెలో ఆద్యంతమూ కనిపించింది. భావన వల్లే ఆమె పొంతన లేని మాటలు మాట్లాడారు. ఆరుగంటలు ప్రయాణం చేసి, అడ్డొచ్చిన ప్రతి వ్యక్తిని చితకబాదించి, తెలంగాణా ఆత్మలను అల్లకల్లోలం చేసి ఆమె ఏం సాధించారు? అవమానపడ్డారు. ఆబాసు పాలయ్యారు. కడప పౌరుషాన్నికరీంనగర్ మానేరు వాగులో కలిపేసుకుని బిక్కుబిక్కుమంటూ గంటలో వెనుదిరిగి వెళ్ళిపోయారు

 సాధారణంగా రాజకీయ నాయకులు పాలకుల తప్పిదాలను ఎత్తిచూపడానికి, ప్రజల బాధలను అర్థం చేసుకోవడానికి, బాధితులకు బరోసా ఇచ్చి, వారిలో మనో ధైర్యాన్ని కలిగించడానికి, ఓదార్చడానికి   పర్యటనలను  చేస్తుంటారు. అందులో భాగంగా అక్కడి ప్రజలను బాధితులను కలిసి వారి సమస్యలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అధికారులతో, స్థానిక పౌర సమాజ ప్రతినిధులతో సమావేశమై కారణాలను ఆరా తీస్తారు. వాటి పరిష్కారానికి తమవైపునుంచి సూచనలు చేస్తూ వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం కోసం దీక్షలను చేస్తారు.   దీక్షలతోనైనా పాపాలకు బాధ్యులైన పాలకులు కళ్ళుతెరిచి బాధితులకు న్యాయం చేస్తారని, తమ విధానాలు సవరించుకుని సన్మార్గంలో నడుస్తారని ఆశిస్తారు.

కానీ సిరిసిల్ల విషయంలో అవకాశం లేదని విజయమ్మకు తెలుసు. ఎందుకంటే చనిపోయిన చేనతకార్మికుల్లో ఎక్కువమంది స్వయంగా విజయమ్మ గారి భర్త వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బాధితులే. ఇప్పుడు తప్పులను తెలుసుకొని, పశ్చాతాపం  చెందడానికి ఆయన బతికి లేరు. ఆయన బతికున్నప్పుడు సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన చేనేత కార్మికులు 375 మంది కాగా అందులో 215 మంది స్వయంగా ఆయన గారి ఆదర్శ పాలనలోనే అసువులుబాసారు. పోనీ తన భర్త తప్పులకు ఆమె ప్రాయశ్చిత్తం చేసుకున్నారా ఆంటే తన ప్రసంగంలో ఒకటి రెండు సార్లు నేతన్నలు అని ప్రస్తావించడం మినహా చేనేత రంగ సమస్య గురించి గానీ, పరిష్కారం గురించిగానీ ఒక్క ముక్కయినా చెప్పలేకపోయారు. అంతదూరం వెళ్లి కనీసం ఒక్క కుటుంబాన్నయినా కలిసి వాళ్ళ సమస్యలేమిటో, చావుల కారణం ఏమిటో కనుక్కోలేక పోయారు. ఒక్క కార్మికున్నయినా ఓదార్చలేక పోయారు. సరికదా ఒదార్పుకు కూడా నోచుకోలేని అవమాన భారాన్ని తలకెత్తుకున్నారు.

రాజశేఖర్ రెడ్డి సతీమణి గా గతంలో రాజభోగాలు అనుభవించిన విజయమ్మ  ఇన్ని అవమానాలను తలకెత్తుకోవడానికి సిద్ధపడడం వెనుక  వివిధ కారణాలున్నాయి.అందులో ఒకటి జైలులో ఉన్న జగన్ బాబు. జగన్ బాబు కళ్ళల్లో ఆనందం కోసం ఆమె ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. ఎన్ని అవమానాలయినా భరిస్తారు. అది ఆమె బలహీనత. కొడుకు విషయంలో ఆమె బలహీనతలే అతన్ని కటకటాల పాలు చేశాయని వారిగురించి తెలిసిన వాళ్ళు చెపుతుంటారు. బలహీనతే ఆమెను ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి శరణు జోచ్చేలా చేసింది. తన కొడుకును ముఖ్యమంత్రిగా చూసుకోవాలని ఒక తల్లిగా విజయమ్మ కలగంటున్నట్టే సోనియా కూడా ఒకానొక తల్లిగా తనకొడుకును ప్రధానమంత్రిగా చూసుకోవాలనుకుంటుంది. అది నెరవేరాలంటే పరస్పర అవగాహన అవసరమని ఇద్దరికీ అర్థమయ్యిందని రాజకీయ పరిశీలకుల అంచనా. ఆమేరకు ఇద్దరికీ సిగ్నల్స్ ఉన్నాయి.  అప్పటిదాకా కే సి ఆర్ కూ, తెలంగాణా ఎం పీ కూ ఉన్న సిగ్నల్స్ విజయమ్మ ఢిల్లీ పర్యటనతో వీకయి పోయాయి. సిగ్నల్స్ ప్రభావం వల్లే ఆమె ఢిల్లీ నుంచి వచ్చిన మరుక్షణం నుంచి అప్పటిదాకా సాగిన సవాళ్లు, శాపనార్థాలు ఆగిపోయాయి. ప్రధానమంత్రిని కలిసి సీబీఐ వేధింపులపై ఫిర్యాదు చేసానని చెప్పిన విజయమ్మ, ఆమె పార్టీ కి ఇప్పుడు సి బీ తనపని తాను చేసుకుని పోతోన్న ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థగా కనిపిస్తోంది. జగన్ కేసులో రాజకీయ జోక్యం లేనే లేదని, ప్రభుత్వ ప్రమేయం అసలే లేదని పార్టీ నాయకులే ఇప్పుడు వాదిస్తున్నారు. జగన్ ను ఆర్ధిక నేరాల్లో ఇరికించే కుత్రదారులంతా వారికి స్నేహితులైపోయారు. స్వయంగా కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రిగా ఉన్న ప్రణబ్   ముఖర్జీ   అత్యంత గౌరప్రధమైన రాజకీయనేతగా మారిపోయారు. అడగక పోయినా ఆయనకు మద్దత్తుపలుకడం, రాష్ట్రపతిగా ఆయనకు గంపగుత్తగా ఓట్లేసి గెలిపించడం ఇవన్నీ ఢిల్లీ ప్యాకేజీలో భాగంగానే జరిగాయి.  

ప్యాకేజీ లో రెండో అంశం తెలంగాణా వాదాన్ని తెరమరుగు చెయ్యడమని అంటున్నారు. ఆంటే ఇంతకాలం కోస్తా తీరంలో కొంగ జపం చేసిన జగన్, ఆయన వర్గం  ఇప్పుడు తెలంగాణ కు కూడా వస్తారు. మొదట దీక్షల పేరుతో దిగుతారు. తరువాత ఒదార్పుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటారు. విజయమ్మ వచ్చింది కేవలం పైలట్ గా మాత్రమే తప్ప మరోపనికి కాదు, జగన్ బాబు వెళ్ళమని అన్నాడని అందుకే తాను వచ్చానని విజయమ్మ స్వయంగా చెపుతున్నారు.   లోగా జగన్ కు బెయిల్ వస్తే ఆయన మొదట బయలుదేరేది తెలంగాణా ఓదార్పు దండయాత్రకే నని పార్టీ నేతలే చెపుతున్నారు. జగన్ కోస్తాలో తెలుగుదేశం పార్టీని, తెలంగాణలో తెలంగాణా రాష్ట్ర సమితిని లేకుండా చేసి 2014 లో 40   మంది ఎంపీలను ఢిల్లీ కి పంపిస్తానని అక్కడి పెద్దలకు చెప్పినట్టు వినికిడి. అందుకే కోస్తా తెలుగు దేశంలోంచి మళ్ళీ వలసలు మొదలయినాయి.  ఎన్నికల దాకా కాగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బలపడి, ఎన్నికల తరుపాత కాంగ్రెస్ తో నిలబడాలన్నది జగన్ ప్లాన్ అని అంటున్నారు. సిగ్నల్ మాత్రం కే సి ఆర్ కు అందినట్టే ఉంది. గతంలో జగన్ ఆర్మూర్ పర్యటనకు  అడ్డుచెప్పని టీ ఆర్ ఎస్  ఇప్పుడు విజయమ్మకు  అడ్డం తిరగడానికి కూడా కారణం అదే కావచ్చు. అందులో బాగంగానే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, పోలీసులు విజయమ్మకు రాజ్యాంగ అతీతంగా రాచమర్యాదలు చేస్తున్నాస్రని అర్థమౌతోంది. ఇదిలా ఉంటే    మన తెలంగాణా కాంగ్రెస్ ఎం పీ లు ముఖ్యమంత్రి మీద, డీ జీ పీ మీద ఫిర్యాదులు చేస్తున్నామంటూ ఢిల్లీ లో కాలక్షేపం చేస్తున్నారు. పాపం ఏంచేద్దాం వాళ్ళకూ సిగ్నల్స్ లేవు!

జగన్ చేస్తోన్న పనికి క్విడ్ ప్రోకో గా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు మేలు చేసే పనిలో ఉన్నారు.  ఆయన ఇప్పటికే మంత్రులకు, కార్యదర్శులకు  న్యాయసహాయం ఫైలు మీద సంతకం చేసేశారు. ఒక్క సంతకం తో ఆయన మొత్తం సీబీ దర్యాప్తు పరిధిని దానికున్న విశ్వసనీయతను కొట్టిపారేసి జగన్ బాబు వాదనకు జై కొట్టారు. జగన్ మొదటినుంచీ చెపుతున్నట్టుగా అవినీతి జరిగిందని చెపుతున్న నిర్ణయాలు అన్నీ అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన మంత్రి వర్గ సహచరులవి. వాటితో జగన్ బాబుకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన మంత్రి కాదు, ప్రభుత్వంలో లేదు. అసలు అసెంబ్లీ, సచివాలయం ఎక్కడున్నాయో కూడా ఆయనకు తెలియదు. రెండుచోట్లా మంత్రులదే అధికారం. అక్కడ చట్టాలు తయారవుతాయి కాబట్టి అక్రమాలు జరిగినా, అక్కడ తీసుకున్న నిర్ణయాల వల్ల తనకు వేలు, లక్షల కోట్ల లాభం కలిగినా బాధ్యత తనది కాదు. ఇప్పుడు కిరణ్ రెడ్డి కూడా జగన్ రెడ్డి మాటలే నిజమని సేబేఐ కి, న్యాయస్థానాలకు చెప్పబోతున్నారు. ప్రభుత్వంలో భాగంగా ఉమ్మడి బాధ్యతతో మంత్రులు తీసుకున్న నిర్ణయాలన్నీ రాజ్యాంగ సమ్మతం, ధర్మబద్ధం అని వాదించడానికి ఆయన న్యాయవాదులకు ఫీజులు చెల్లించడానికి ఉత్తర్వులు జారీ చేసారు. జగన్ కు సంబంధం ఉన్న పలు అవినీతి కేసుల్లో  ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న దర్యాప్తును నీరు గార్చడానికి వారికి వ్యతిరేకంగా వాదించడానికి ప్రభుత్వమే కొత్తగా అవినీతికేసుల్లో ఆరితేరిన న్యాయవాదులను నియమించుకునే స్వేచ్చను మంత్రులకు కల్పించింది. వీళ్ళు తమ వాదనలతో ప్రభుత్వ లాయర్లను ఓడిస్తారు. సి బీ సేకరించిన ఆధారాలన్నీ అబద్ధాలని రుజువు చేస్తారు! ఆంటే ప్రభుత్వమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించి కేసును కొట్టేసే ప్రయత్నం చేస్తుంది. అసలు కేసు లేకపోతే జగన్ ను ఎందుకు అరెస్ట్ చేసారన్న ప్రశ్న వస్తుంది.దీంతో ఆయనమీదున్న అవినీతి కేసులన్నీ ప్రశ్నార్థకమై పోతాయి. ఇదంతా జరిగే దాకా విజయమ్మ ప్రభుత్వం చెప్పినట్టల్ల చేస్తుంది.

అన్నీ సక్రమంగా జరిగితే 2014 ఎన్నికలు వస్తాయి, ఆలోపు జగన్ను ఏదో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ బయటకు తెస్తుంది.  అప్పుడు అక్కడ రాహుల్ ప్రధాని కావాలన్న రాజశేఖర్ రెడ్డి కోరిక, జగన్ ముఖ్యమంత్రి కావాలన్న విజయమ్మ కల రెండూ నెరవేరుతాయి. ఇదంతా కొంచెం  ఇటాలియన్ మాఫియా,  కడప ఫ్యాక్షన్  కలేగలిసిన కథలా అనిపిస్తే ఎవరు మాత్రం ఎం చేయగలరు! కానీ ఇది నిజమని పరిణామాలు రుజువు చేస్తున్నాయి.   కథ విజయమ్మ ఢిల్లీ వెళ్ళేసరికే రూపొందినట్టు అర్థమౌతోంది.  ఢిల్లీ పెద్దల స్క్రిప్ట్ ప్రకారం జగన్ బయట పడాలంటే కాంగ్రెస్ కు లోబడే తల్లీ, కొడుకూ, వారి పార్టీ నడుచుకోవాలి. తెలంగాణా వాదాన్ని ఓడించాలి. షరతులతో విజయంమను కాంగ్రేస్ పెద్దలు అష్ట దిగ్బంధం చేసినట్టు కనిపిస్తోంది. లేకపోతే మానుకోట అవమానాన్ని తన కొడుకింకా మరిచిపోకముందే ఆమె కొత్త తలనొప్పిని తనకు తాను ఎందుకు తెచ్చిపెట్టుకుంటుందివిజయమ్మకు  ఢిల్లీ అవసరం ఎంతుందో ఢిల్లీ కి కూడా ఆమె పార్టీ అడగక పోయినా సరే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్  ముఖర్జీకి మద్దతునిచ్చేందుకు దోహదపడింది. ఉపఎన్నికలకు ముందు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకున్న   బలహీనత ను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోంది. తెలంగాణా వాదం మీద దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జగన్ ను వాడుకోవాలని చూస్తోంది.  

ఒక దెబ్బతో రెండు పిట్టలు అన్నట్టుగా పార్టీ జగన్ తో ఒక రహస్య ఒప్పందం చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇవన్నీ బలవతంగా చేయిస్తున్నారేమో నని జాలిపదకండి. జగన్, ఆయన కుటుంబం స్వచ్చంధగానే  సమైఖ్యవాద పునాదుల్లో పుట్టినవాళ్ళు. ఆయన తనకు తాను ఆయన తండ్రిగారి వారసత్వాన్ని చాటు కోవడానికే తన పార్టీకి వాళ్ళ నాయన పేరుమీద  వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అని పేరు పెట్టుకున్నారు.
  రకంగా సమైఖ్య వాదం ఆయన వారసత్వ సంపద. దాన్ని తెలంగాణా వాదులు ఎంత వ్యతిరేకిస్తే సీమంధ్రులు అంతగా తనని ఆదరిస్తారని జగన్ కు తెలుసు. ఎంత జైలులో మగ్గుతున్నా ఇప్పుడు  జగన్ చేతిలో ఉన్నది డబుల్ బారెల్ గన్!.ఇప్పుడు గన్ను తోనే తెలంగాణా వాదాన్ని కాల్చిపారేయాలని కాంగ్రెస్ తొందర పెడుతున్నట్టుంది. కానీ అవేవీ తమ ముందు నిలబదవని రహీమున్నీసా తెలంగాణా వాదులందరి తరఫున సిరిసిల్లలో చాటి చెప్పింది.   ఇంకా తెలంగాణలో ప్రజాస్వామిక, మానవీయ విలువలు మిగిలి ఉన్నాయి కాబట్టే రహేమ్మున్నీసా తమిళ టైగర్ లాగా మానవబాంబు కాలేదు, మారణ హోమాన్ని సృష్టించలేదు. కానీ తెలంగాణా వీర వనిత సాహసం ఇప్పటికీ విజయమ్మ గుండెల్లో అవమాన బాంబు రూపంలో పేలుతూనే ఉండిఉంటుంది.!  

కొసమెరుపు: తెలంగాణా వాదులు చరిత్రలో తగిలిన ఒక్క దెబ్బకు ఇప్పుడు వందలు వేల దెబ్బలు బదులు తీర్చుకునే స్థితిలో ఉన్నారు. కరీంనగర్ బిడ్డ పీ వీ నరసింహారావు ప్రధానిగా కడప వెళితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల చేత శ్రీమాన్ రాజశేఖర్ రెడ్డి ఒక చెప్పు విసిరించారు. పాపం ఆయన సతీమణి శ్రీమతి విజయమ్మ గారిని హైదరాబాద్ నుంచి కరీంనగర్ దాకా వేలాది చెప్పులు వేమ్బదించాయి. అప్పుడప్పుడు అవును మరి కొన్నిసార్లు చెప్పులు కూడా తిరగాబడతాయి.  


2 కామెంట్‌లు: