శుక్రవారం, మార్చి 01, 2013

తెలంగాణమీది నిఘా టెర్రరిజంమీద ఏది?


దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు మొత్తం దేశాన్నివణికించాయి. ఇది హైదరాబాద్ నగరానికి ఊహించని పెను విషాదం. మరణించిన వారిలో అంతా సామాన్యులు, నిరుపేదలు. పొట్టకూటికోసం ఈపట్నానికి వచ్చినవాళ్ళు. బడ్డీ కొట్లలో, హోటళ్ళలో కూలీ పని చేసుకొని బతుకుతున్నవాళ్ళు. ఈ నగరంలో చదువుకుని, ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని తమ తల్లిదంవూడుల కలలను నిజం చేయాలనుకున్న విద్యార్థులు. ఎవరికీ అపకారం తలపెట్టని అమాయకులు. దాదాపు అంతా హైదరాబాద్, రంగాడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ వంటి తెలంగాణ జిల్లాల్లోని పల్లెలనుంచి వచ్చిన వాళ్ళు. ఒక్క మీటతో ఇంత హింసకు కారకులైన వాళ్లెవ్వరు? వారి లక్ష్యం ఏమిటి? ఎందుకు ఇక్కడి ప్రజలమీద పగబట్టారు? ఈ హింస ద్వారా సాధించింది ఏమిటి? వీటిలో చాలా వాటికి పోలీసులే సమాధానాలు వెతకాలి. కానీ సంఘటన జరిగిన వారానికి కూడా వాటికి సమాధానాలేవీలేవు. హంతకుడి ఆనవాళ్ళు దొరకలేదు. కనీసం అనుమానితుల జాడ కూడా కనిపించలేదు. ఇది ఇండియన్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు తప్ప దానికీ ఆధారాలేవీ లేవు. సాధారణంగా ఇటువంటి సంఘటనల్లో ఉగ్రవాద సంస్థలు వాటికవి బయటపడాల్సిందే తప్ప వాటిని కనిపెట్టే శక్తి, చాకచక్యం మన పోలీసులకు, విచారణా సంస్థలకు లేవు. ప్రతిసారి ఇలాంటి టెర్రరిస్టు దాడుల తరువాత వాళ్ళే ఎవరు దాడి చేశారో ఎందుకు చేశారో ప్రకటించుకుంటా రు. దాన్ని పోలీసులు నిర్ధారిస్తారు. నేర స్వభావాన్ని బట్టి, సంఘటన స్థలంలో దొరికే అవశేషాలను బట్టి నేర పరిశోధన మొదలుపెడతారు.

ఇంతకుమించి పోలీసులు ఏమీ చేయలే రని, అది సాధ్యం కాదని మనం అనుకుంటే పొరపాటే. పోలీసు ఉన్నతాధికారులు స్వయం గా ప్రకటించినట్టు హైదరాబాద్ సంఘటనకు కారణం నిర్లక్ష్యం తప్ప, ఇది పోలీసులకు తెలియదని అనుకోవడానికి వీలులేదు. ఈ సంగతి కేంద్ర హోం శాఖ స్వయంగా చెపుతున్నది. భారత ప్రభుత్వానికి ఇంకొక కారణం వెతకటానికి వీలులేదు. కేంద్ర హోం శాఖ చెపుతున్న దానిని బట్టి ఈ దాడుల గురించి పోలీసులకు ముందే తెలుసు. వీటి గురించి నాలుగు నెలలు ముందుగానే అంటే 2012 నవంబర్ నెలలోనే హెచ్చరికలు అందాయి. పాత కేసుల్లో అరెస్ట్ అయిన తీవ్రవాదుల విచారణ సందర్భంగా ఈ సంగతి తెలిసింది. దీనికి తోడు దిల్‌సుఖ్‌నగర్ సంఘటనకు ముందు మూడు రోజులుగా కేంద్ర హోం శాఖ నుంచి హెచ్చరికలు అందాయని రాష్ట్ర పోలీసు అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. కానీ అవి మామూ లు హెచ్చరికలుగానే భావించాము తప్ప సీరియస్‌గా తీసుకోలేదని అంటున్నారు. మనుషుల ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా అవి యథాలాపంగా వచ్చే హెచ్చరికలుగానే అనుకున్నామని సమర్థించుకుంటున్నారు తప్ప, తప్పు జరిగిందని ఒప్పుకోలేకపోతున్నారు. ఆంధ్రవూపదేశ్ ప్రభు త్వం నిర్లక్ష్యం మూలంగా జరిగిన అనర్థానికి తమదే బాధ్యత అని చెపుతోంది తప్ప ఆ బాధ్యత ఎవరివల్ల జరిగింది, దానికి కారకులైన అధికారుల లేదా రాజకీయ నాయకుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్నది చెప్పడం లేదు. నిర్లక్ష్యం చేసిన వాళ్ళను వదిలేసి, ఆ నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని అఘాయిత్యానికి ఒడిగట్టిన వాడిని ఆడిపోసుకుంటున్నాం. అదే మన వ్యవస్థలో ఉన్న లోపం కూడా . టెర్రరిస్టులు దిల్‌సుఖ్‌నగర్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా రెక్కీ నిర్వహించారని, ఎప్పుడో ఒకప్పుడు విరుచుకుపడే ప్రమాదం ఉందని తెలిసినా మన ఇంటలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి అని అడిగే అధికారం ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషికీ బతికే స్వేచ్ఛ ఉంది. మన దేశంలో అది హక్కు కూడా. ఆ హక్కుకు కాపలాదారుగా ఉండడానికే పోలీసు వ్యవస్థ ఏర్పడింది. పోలీసుల ప్రాథమిక బాధ్యత ప్రజలను కాపాడడం. 

పౌర రక్షణ వ్యవస్థగా ఉండే పోలీసులకు కళ్ళు, చెవులూ, మెదడై పని చేసేదే ఇంటలిజెన్స్. కానీ ఇప్పుడు పోలీసులకు అంతటి స్వేచ్చ లేదనే అనిపిస్తోంది. స్వేచ్ఛలేని వాళ్ళు ఇతరుల స్వేచ్ఛను కాపాడుతారని అనుకోవడం భ్రమే అవుతుంది. అలాగని పోలీసులు అస లు పని చేయడం లేదని అనలేము. రోజూ వాళ్ళు అనేకపనుల్లో తలమునకలై ఉంటున్నారు. పాలక వర్గాలు మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న నేతలు ఏది చెపితే అదే చేస్తున్నారు. ఒక రకంగా వారికి కాపలా కాస్తున్నారు. సాధారణంగా మనం పోలీసుల చేతుల్లో లాఠీలు, తుపాకులు చూస్తాం. కానీ స్వయంగా పోలీసులే ఇపుడు రాజకీయ నాయకుల చేతిలో ఆయుధాలుగా మారిపొయారు. కాబట్టే సొంత ఇంటలిజెన్స్ వాడే అవకాశం గానీ అవసరం గానీ వారికి రావడం లేదు. ఈ పరిస్థితి రాష్ట్రంలో ఇటీవలి కాలంలో మరీ ఎక్కువయిపోయింది.

ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తరువాత పోలీసుల మీద భారం మరీ పెరిగిపోయింది. రాష్ట్ర ఇంటలిజెన్స్ వ్యవస్థకు తెలంగాణవాదుల మీద నిఘా పెట్టడమే ప్రధానమైన పనిగా మారిపోయింది. తెలంగాణవాదులు ఏం చేస్తున్నారు, ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు మొదలు ఫోన్‌లలో ఎవవరు ఏం మాట్లాడుకుంటున్నారు దాకా అన్నీ రికార్డు చేయడం తప్ప ఇప్పుడు ఇంకో పనిలేకుండాపోయింది. ఈ మాటలు ఎవరో ఉద్యమకారులు అం టున్నవి కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎంపీలు, మంత్రులే చెపుతున్నారు. గత నాలుగేళ్ళుగా తెలంగాణవాదుల టెలిఫోన్ సంభాషణలన్నీ రికార్డు అవుతున్నాయి. అరెస్టులకు అవే ఆధారంగా ఉంటున్నాయి. ఇక పోలీసులకు తెలంగాణ ఉద్యమాన్ని కట్టడిచేయడమే పనిగా మారింది. వందమంది ధర్నా చేస్తే వెయ్యిమంది పోలీసులు రావడం ఇప్పుడు పరిపాటి అయిపోయింది. ఇటీవలి కాలంలో ఏ కార్యక్షికమం చూసినా ఉద్యమకారులకంటే పోలీసులే ఎక్కువమంది కనిపిస్తున్నారు. ఇక మిగిలిన వారు ఇటు చంద్రబాబు, షర్మిలల పాదయావూతలకు రక్షణ కల్పించడానికే సరిపోతున్నారు. ఇంటలిజెన్స్ సేవలను కూడా ప్రభుత్వం రాజకీయాలకే పరిమితం చేసింది. తెలంగాణ ఉద్యమ సమాచారంతో పాటు, కాంగ్రెస్ శాసనసభ్యుల మీద నిఘాకే ఉన్న బలగాలు సరిపోతున్నాయి. ఎవవరు జగన్ శిబిరంవైపు వెళుతున్నారు, ఎవరు తెలంగాణవాదులతో తిరుగుతున్నారు లాంటి ఆరాలు తీయడానికే వాటి శక్తియుక్తులన్నీ సరిపోతున్నాయి. ఈ దశలో ఢిల్లీ నుంచి వచ్చిన హెచ్చరిక వారికి పెద్ద సమాచారంగా కనిపించలేదు. అందుకే ప్రభుత్వం దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఇదంతా గమనిస్తుంటే ప్రభుత్వ ఇంటలిజెన్స్ వ్యవస్థపట్ల ప్రజలకు సరే టెర్రరిస్ట్‌లకు కూడా పెద్దగా నమ్మకం లేనట్టుంది. అలాగే టెర్రరిస్టుల ఇంటలిజెన్స్ వ్యవస్థే బలంగా ఉందేమోనని కూడా హైదరాబాద్ సంఘటనను చూసిన తరువాత అనిపిస్తున్నది. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ బాం బు దాడులు చేయడంకోసం ముందుగానే రెక్కీ నిర్వహించారు. ఆ సంగతి పోలీసుల ఇంటరాగేషన్‌లో చెప్పేశారు. చెప్పిన వాళ్ళు పోలీసుల చెరలోనే ఉన్నారు. అయినా బాంబులు పేలాయి. అయితే పోలీసులు ఒక్క పని మాత్రం చేయగలిగారు. సాధారణంగా దిల్‌సుఖ్‌నగర్ అంటే ఉగ్రవాదుల దృష్టిలో సాయిబాబాగుడి. అక్కడికి అనేకమంది భక్తులు వస్తుంటారు. అందులో గురువారం అంటే భక్తజనం తాకిడి ఎక్కువగా ఉంటుంది. బహుశా అటువంటి ఆలోచనతోనే ప్లాన్ చేసి ఉంటారు. అనుకోకుండా అక్కడికి పోలీసు కమిషనర్ వచ్చారు. ఆయన దైవ దర్శనం కోసం గుడిలోకి వెళ్ళారు. ఆ సందర్భంగా గుడి దగ్గర భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. అది గమనించిన ఉగ్రవాదులు గుడికి బదులు, బస్‌స్టాండ్ ప్రాం తాన్ని ఎంచుకుని ఉంటారని విశ్లేషకులు అంటున్నారు. టెర్రరిస్ట్‌లు వస్తున్నారన్న సంగతి పోలీసులకు తెలిసీ తేలిగ్గా తీసుకుంటే, పోలీసులున్నారన్న సంగతి మాత్రం టెర్రరిస్ట్‌లు తేలిగ్గానే పసిగాట్టారంటే ఎవరు సీరియస్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

అలాగని మనం తప్పంతా పోలీసులదని ఎంతమాత్రం అనలేం. ముందుగానే అనుకున్నట్టు పోలీసులు రాజకీయ వ్యవస్థచేతిలో ఆయుధం అయిపోయారు. వాళ్ళు ట్రిగ్గర్ ఎప్పుడు, ఎక్కడ నొక్కితే అప్పుడే పేలుతారు. మరి రాజకీయ నాయకత్వం ఎందుకు ట్రిగ్గర్ నొక్కడం లేదు అన్న అనుమానం రావొచ్చు. తమ కుర్చీకి ఎసరు రానంత వరకు రాజకీయ నాయకులు ఆ సమస్యను సమస్యగా చూడరు. అదే విషాదం. నక్సలైటు ఉద్యమాన్ని సమర్థవంతంగా అణచివేశామని, ఆంధ్రవూపదేశ్‌లో నక్సలైట్లు లేకుండా చేశామని సగర్వంగా చాటి చెప్పుకున్నవాళ్ళు, టెర్రరిజాన్ని ఎందుకని అణచలేకపోతున్నారు? ఎందుకు ఇటువంటి దాడులు ఆపలేకపోతున్నారు. ఉగ్రవాదం ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదం నగరాలమీదే దృష్టి పెడుతుందని తెలిసీ నగర భద్రతను ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలు. నక్సలైట్లకు ప్రజాకంటకులైన రాజకీయ నాయకులు టార్గెట్. వారి అణచివేత విధానాలను ఆచరించే పోలీసులు కూడా టార్గెట్. ఒకరకంగా పరస్పరం వర్గ శత్రువులుగా మారిపోయారు. కాబట్టి చిత్తశుద్ధి కొంచెం ఎక్కువ. కానీ టెర్రరిజం అలాకాదు. కేవలం అలజడి సృష్టించడం తప్ప వారికి ఒక రాజకీయ లక్ష్యం ఉండదు. హింస ద్వారా సమాజంలో భయోత్పాతాన్ని సృష్టించడం, తద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించడం మినహా ఆ దాడులవల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. సామాన్యులను చంపడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల దృష్టిని ఆకర్షించడం తద్వారా వ్యవస్థలను అస్థిరపరచడం మినహా మరో లక్ష్యం కనిపించదు. మళ్ళీ ప్రభుత్వాలే వారికి లక్ష్యా లు ఆపాదిస్తాయి. అలా ఆపాదించడం ద్వారా టెర్రరిస్టు దాడులను ప్రతీకార చర్యలుగా చూపించే ప్రయత్నం చేస్తుంటాయి. అందుకే హైదరాబాద్‌లో జరిగిన దాడులు అఫ్జల్‌గురు ఉరికి ప్రతీకారం అని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఉరికి ప్రభుత్వం అనుమతించక మునుపే దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారంటే అఫ్జల్‌గురును ఉరి తీయకున్నా దాడులు జరిగేవనే విషయం గమనించాలి. కానీ ఇటువంటి ప్రచారం వల్ల అఫ్జల్‌గురు అమాయకుడు కాదని, ఆయనను ఉరితీయడం సమంజసమే అని చెప్పుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది.

ప్రభుత్వాలకు ఇటువంటి బలహీనత ఉంటుంది కాబట్టే.. ఉగ్రవాదులు కూడా బలహీనమైన లక్ష్యాలనే ఎన్నుకుంటారు. అదే పని ఇక్కడ కూడా చేశారు. తెలంగాణ ఉద్యమం మూలంగా తమ అధికారానికి, భవిష్యత్తుకు ముప్పు ఉందని భావిస్తున్న వాళ్ళు తమ బలాన్ని, బలగాలను ఉద్యమం మీద ఉంచాయని, ఉద్యమాన్ని అణచివేయడంలో బిజీగా ఉన్న పోలీసు లు ఉగ్రవాదం పట్ల అప్రమత్తంగా లేరని సామాన్యులకు కూడా అర్థమవుతున్నది. అదే ఇప్పుడు ముప్పుగా మారింది. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా కొందరు ఆంధ్రా ఎంపీలు, మంత్రులు మాత్రం అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారు. తమ లోపాలు కప్పిపుచ్చుకుని తెలంగాణ వస్తే హైదరాబాద్ టెర్రరిస్ట్‌లకు అడ్డా అయిపోతుందని అంటున్నారు. తెలంగాణ ఉద్యమం ఇంత బలంగా లేనికాలంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లు జరిగాయి. అవేవీ పట్టించుకోకుండా ఇటువంటి వాదనలు ఇప్పుడు కొత్త అనుమానాలకు కారణం అవుతున్నాయి. హైదరాబాద్ పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు, ఏ తీవ్రవాద సంస్థ బాధ్యత తీసుకోకపోవడం, ఎవ్వరూ అరెస్ట్ కాకపోవడం, ఏ ఆధారమూ దొరక్కపోవడం, పైగా తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసు దాడులు జరుగడం వంటివి చూస్తుంటే ఇదేదో కొత్తరకపు టెర్రరిజం అనే అనుమానాలు తెలంగాణవాదుల్లో కలుగుతున్నాయి. బహుశా అందుకే జేఏసీ దీనిమీద నిష్పాక్షిక విచారణను కోరుతున్నది. ఒక దశలో తెలంగాణవాదులు లగడపాటి రాజగోపాల్, టీజీ వెంక వంటివారిని కూడా విచారణ పరిధిలో కి తేవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒక బాధ్యతగల పదవిలో ఉన్న ఎవరైనా అలా మాట్లాడారంటే వారివద్ద ఆధారాలు ఉండి ఉండాలి. అవి బయటపడాలంటే కచ్చితంగా విచారణ ఆ కోణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అయితే ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు. ఇప్పటికే యావత్ భారతదేశం ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోవడానికి పాలకుల తప్పుడు విధానాలే కారణం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి