మంగళవారం, ఏప్రిల్ 10, 2012

తెలంగాణాకు ఒక కొత్త ఫేస్ బుక్ కావాలి!


' మిమ్మల్ని మీరు దహించుకోకండి. 2014 వరకు ఆగండి, అప్పుడు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను కాల్చిపారేయవచ్చు'. 
ఇది తెలంగాణా విద్యార్థులకు హరి రాఘవ్ అనే ఒక యువకుడు పేస్ బుక్ ద్వారా ఇచ్చిన సందేశం. నేను పెద్దగా పేస్ బుక్ ఫాలో అవకపోయినా అప్పుడప్పుడు చూస్తుంటాను. ఇలాంటి సందేశాలు చూసినప్పుడు సోషల్ మీడియా నిజంగానే మనకు చాలా మేలు చేస్తోందని అనిపిస్తుంది. ముఖ్యంగా  తెలంగాణా ఉద్యమానికి ఇదొక వారధిగా మారిపోయింది. ఒక చిన్న సంఘటన జరిగితే చాలు క్షణాల్లో అది ప్రపంచ వ్యాప్తంగా ప్రసారమై పోతోంది. మరుక్షణం లక్షలాది చేతులు పిడికిల్లై బిగుసుకున్తున్నాయి. వేలాది గొంతులు ఒక్కటయి నినదిస్తున్నాయి. ఆవేశం, ఆవేదన, ఆలోచనల సమ్మిశ్రిత సందేశాలు ప్రపంచం నలుమూలలనుంచి మనకు చేరిపోతాయి సందేశాలు చదివినప్పుడు తెలంగాణాకు దిగులు అక్ఖరలేదని అనిపిస్తుంది.
 ఇప్పుడు తెలంగాణా వాదం ఒక్క తెలంగాణా గడ్డమీదే కాదు ప్రపంచంలో మనిషనేవాడు సంచరిస్తోన్న ప్రతి దేశంలోనూ ప్రాణంతో ఉన్నందుకు ఆనందమేస్తుంది. భోజ్యా నాయక్  ఆత్మహత్య పట్ల   వీరా రెడ్డితండా తల్లదిల్లినట్టుగానే వీళ్ళంతా తల్లదిల్లారు.  ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు స్పందించారు. చావోద్దని సొంత తమ్ములకు చెప్పినట్టు చెప్పారు. ఇంట్లో అమ్మా, నాన్న చెల్లెలు, తమ్ముళ్ళు ఉంటారని వాళ్ళను అనాధలను చేసి ఆత్మ హత్యల పాలు కావోద్దని చెప్పారు. ఆత్మహత్య తరువాత జీవితం మిగిలి ఉండదని గుర్తుంచుకోవాలని వేరే పోస్టర్ లో హెచ్చరించాడు. కానీ  తెలంగాణా రాకపోతే జీవితం లేదని మనమే కదా వాళ్లకు చెప్పాం. తెలంగాణా వాదాన్ని పదునేక్కించిన మాటలు, ఆటలు, పాటలు అదే కదా బోధించింది. అలా భయపడి, బెంగపడి కూడా చివరకు రెండేళ్ళు పోరాటంలో నదిచేకదా భోజ్యానాయక్ నడిరోడ్డుమీద నిప్పు రవ్వై రగిలిపోయింది. ఒకరిని చూసి ఒకరు ఒక్కవారంలో ఏడుగురు అలా బలయిపోవడం తెలంగాణలో విషాదం నింపింది.     అందరిలో ఆవేదన ఉన్నదే తప్ప ఆత్మహత్య ఆలోచనలో ఉన్న వారిని ఊరడించగలిగే ఉపాయమేదీ కనిపించలేదు. కానీ హరి రాఘవ్ సందేశం మాత్రం స్పష్టంగా ఒక పరిష్కారాన్ని చూపినట్టు కనిపించింది.
 హరి రాఘవ్ ఎవరో తెలియదు. పేస్ బుక్ స్టేటస్ ప్రకారం హైదరాబాద్ లో ఉండే సైకాలజిస్ట్. భోజ్యా నాయక్ సజీవదహనం తరువాత ఆత్మహత్యలకు  వ్యతిరేకంగా అనేక విధాలుగా ఆయన స్పందించారు. అనేక  పోస్టర్లు తయారు చేసారు. కవితలు, పాటలు పోస్ట్ చేసారు. ఆత్మహత్యలకు కారణాలు విశ్లేషిస్తూ చనిపోవడం వల్ల కలిగే నష్టాలు ఏకరువు పెట్టారు. తాజాగా 2014 ఎన్నికల్లో తెలంగాణా వ్యతిగ్రేక పార్టీలను దహనం చేయడం తప్ప మార్గం లేదనీ, కాబట్టి అప్పటిదాకా ఆగమని పిలుపునిచ్చారుహరి రాఘవ్ లాగే నిశాంత్ దొంగారి, సమత, పాండు, మహి ఇట్లా అనేకమంది స్పందించారు. ఎవ్వరూ నిరాశ పడట్లేదు. 2014 దాకా ఆగదామనే అంటున్నారు

నిజమే తెలంగాణా ఏర్పాటు ఒక రాజకీయ ప్రక్రియ. పార్లమెంటు ద్వారా జరగాల్సిన పని. తెలంగాణా సాధనకు ఒకే ఒక మార్గం పార్లమెంటులో బిల్లు పెట్టడం. ఖచ్చితంగా అది రాజకీయ పార్టీల ద్వారానే సాధ్యం. అలాంటప్పుడు  వ్యక్తిగత హింస, ఆత్మాహుతుల వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఇది ఇప్పుడు తెలంగాణా సమాజం అర్థం చేసుకోవాలి
అలా ఆంటే తెలంగాణా ఏర్పాటు 2014 దాకా సాధ్యం కాదని, అప్పటిదాకా ఆలోచించవద్దని, ఉద్యమాలు అక్ఖర లేదని కాదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణా ఎప్పుడైనా యేర్పడ వచ్చు. ఎప్పుడనేది తేల్చాల్సింది ప్రభుత్వం కాదు, ఉద్యమం. నిజంగానే మరోసారి ఉద్యమం ఉవ్వెత్తున లేస్తే  ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుందిఒకవేళ ఇప్పుడిప్పుడే అది సాధ్య పడక పోయినా 2014 నుంచి ఎవరూ తప్పించుకునే వీలులేదు. అలావీలు లేని స్థితిని సృష్టించాల్సిన బాధ్యత ఉద్యమానిది.  ప్రజలను దహించి వేస్తోన్న భావోద్వేగాలను చల్లార్చకుండా ఆత్మ హత్యలు ఆగాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది కాబట్టి దిశగా ఉద్యమ కార్యాచరణ ఉండాలి. ఉద్యమం ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా సాగాలి.
కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా తెలంగాణా మంత్రులు,  ఎం ఎల్ లు, ఎం పీలు నాటకంలో ఎవరి అంకాన్ని వాళ్ళు రక్తికట్టిస్తున్నారు. ఒకవైపు తెలంగాణా వాదులుగా చెలామణీ అవుతూనే మరోవైపు అదే పార్టీలో అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆంటే కాకుండా పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళ నాటకానికి తెరపడాలంటే ఉద్యమం ఒక బరిగీసి నిలబడాలి. ఉద్యమంతో నిలబడేవారే తెలంగాణా వాదులని మిగిలిన వారంతా ద్రోహులేనని ప్రకటించాలి. ఇది చేయకపోతే కాంగ్రెస్ లోనే తెలంగాణా వాదులని చెప్పుకునే వాళ్ళు రోజోకరి ఇంట్లో టిఫిన్ కో, భోజనానికో కలుస్తారు.   అది తెలంగాణా కోసమే అని నమ్మబలుకుతారు. వారానికో గుంపు ఢిల్లీ వెళ్లి పైరవీలు, పనులు చేసుకుని వస్తారు. అధిష్టానం తోనో, కాకపోతే అమ్మతోనో మాట్లాడామని చెపుతారు. నెలా రోజుల్లో అని ఒకడంటే, వారమే అని ఇంకొకడు వాగుతుంటారు. పదవిలో లేని వాడు ఇప్పుడిప్పుడే తెలంగాణా రాదని   కుండ బద్దలు కొడతాడుఇది ప్రజల మీద మరీ ముఖ్యంగా తెలంగాణా కోసం పడి చచ్చే అమాయకజనాల  మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.
  అస్పష్ట పరిస్తితులను అనుకూలంగా మలచుకోవడానికి కాంగ్రెస్ ఇప్పుడు స్థానిక సంష్తల ఎన్నికలను తెర మీదికి తెస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితులను అవకాశంగా తీసుకొని పార్టీని పటిష్ట పరచుకోవాలని చూస్తోంది. ఆంధ్రాలో త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల తరువాత స్థానిక  ఎన్నికలు ఉంటాయని అంటున్నారు. అదే నిజమైతే తెలంగాణా కాంగ్రెస్ నాయక్యులను నిలదీయడానికి ఇంతకంటే మంచి సమయం ఇంకొకటి ఉండదు. ఇది ఉద్యమం నీరుగారిందనో, తెలంగాణా రాదనో దిగులు పడే వారికొక ధైర్యాని ఇస్తుంది

ఇక రెండోది ఉద్యమం ఒక దీర్ఘ కాలిక ప్రక్రియ ఆన్న సంగతి  ప్రజలు అర్థం చేసుకోవాలి. జే సీలు రాజకీయ పార్టీలు విషయం స్పష్టంగా చెప్పాలి. 2014 ను అంతిమ గడువుగా ప్రకటించాలితెలంగాణా ఉద్యమం ఒక ప్రవాహంలా కదలడం లేదు. అల లాగా ఎగిసి పడుతోంది. అలల్లో అలా పైకి లేచిన వాళ్ళు ఒక్క సారిగా మళ్ళీ కుప్పకులేసరికి  తట్టుకోలేక పోతున్నారు. ఉద్వేగ ఉద్దాన పతనాలు సామాన్యులను తీవ్రంగా కలతకు గురిచేస్తున్నాయి  కాసేపు పరుగెత్తడం, అంతకు రెట్టింపు సమయం విశ్రమించడం వల్ల గమ్యం చేరతామా లేదా అనే అయోమయం సహజం. కాబట్టి ఉద్యమం ఇప్పుడు నడక నేర్చుకోవాలి. నడకకు ఒక గమ్యం ఉండాలి. గమ్యం 2014 అని స్పష్టం చేసుకోవాలి.  ఆలోపు వస్తే సంతోషం రాకపోతే అదే అంతిమ సమరం ఆన్న విషయం అర్థం చేయించాలి.
పార్లమెంటరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు మినహా వేరే అవకాశాలు ప్రజల చేతిలో ఉండవు. కాబట్టి ఎన్నికలు మధ్యంతరంగా సృష్టించాదమో లేకపోతె ఎన్నికల సమయం దాకా నిలబడి ఆగడమో చేయాలి. ఇప్పుడు ఎవరినీ రాజీనామా చేయాలని అడక్కరలేదు. వాళ్లకు వాళ్ళుగా రాజీనామా చేసే పరిస్థితులు కల్పించాలి. నిజానికి ఇన్ని బలిదానాలతో పనిలేకుండా తెలంగాణా కాంగ్రెస్ నాయకులు తలుచుకుంటే ఒక్క నెలలో  తెలంగాణా ప్రక్రియ మొదలవుతుంది.
 ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న స్థితి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న దివాలా పరిస్థితుల్లో అది మరీ సులభం. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు మంత్రులు ఒక ఇరవై మంది రాజీనామా చేస్తే సరిపోతుంది. అందరూ ఒకేసారి రాజీనామా చేస్తే భావోద్వేగాల్ని నాదెండ్ల మనోహర్ అడ్డు చెప్పే అవకాశాలుంటాయి కాబట్టి రోజుకొకరు చొప్పున ఇరవై రోజుల్లో కనీసం ఇరవై మంది శాసన సభ్యలు రాజీనామా చేస్తే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టడానికి పదిరోజుల సమయం చాలు. ఆంటే  ఇన్ని చావుల అవసరం లేకుండా ఒక్క నెలలో  తెలంగాణా తేగలిగే శక్తి కాంగ్రెస్ నాయకులకు ఉంది.   ఉద్యమం చేయాల్సిందల్ల వాళ్లకు వాళ్ళు తలవంచే పరిస్థితులు సృష్టించడం. అలా చేయాలంటే వాళ్ళ రాజీనామాలు కోరుతూ కోదండరామ్ ప్రకటనలు చేయడం కాదు. అలా చేస్తే కోదండరామ్ టీ ఆర్ ఎస్  తొత్తు అనో, బీ జే పీ బంటు అనో ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి రాజీనామా చేయక పొతే రోజు గడవని పరిస్థితులు ఉద్యమం ద్వారా కల్పించాలి

ఇవన్నీ సాధ్యపడాలంటే తెలంగాణాకు ఒక నిజమైన పేస్ బుక్ కావాలి. జనంలో ఒకరినుంచి ఒకరికి అల్లుకుపోగలిగే సోషల్ నెట్ కావాలి. అది జే సి పునర్వ్యవస్తీకరణతోనే సాధ్యమౌతుంది. ఇప్పుడున్న జే సి లో ఎన్నికల రాజకీయాలకు అతీతంగా ఉద్యమంకోసం ఉన్న సంఘాలు, సంస్థలు ఇరవైకి పైగానే ఉన్నాయి. వాటితో పాటు బయట ఉంటూ తెలంగాణాకోసం నిజాయితీగా పనిచేస్తోన్న పౌరసమాజంతో జే సి ఏర్పడాలి. ఇప్పుడు జే సి కి ఊరూరా ప్రతినిధులున్నారు. అలా లేనిచోట ఉద్యోగులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు, విద్యావంతులు, విద్యార్థులు  ఎవరో ఒకరున్నారు. ఎవరూలేనిచోట సామాన్య ప్రజలున్నారు. అంతా కలిస్తే తెలంగాణాకు అతిపెద్ద సోషల్ నెట్ వర్క్ అయితీరుతుంది. ఎవరి ఆదేశాలు, సలహాలతో పనిలేకుండా ఒక స్వతంత్ర సంస్థగా జే సి నిలబడుతుంది. ఉద్యమాన్ని రాజకీయ అవసరాలకు అనుగుణంగా కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడిపించే ఆవకాశం ఉంటుంది. ఇది జరగాలంటే దానికి ముందు ఇప్పుడున్న జే సి పూర్తిగా  ప్రక్షాళన జరగాలి.
మహబూబ్ నగర్ ఎన్నికల ఫలితం తరువాత జీ సి విశ్వసనీయత సంనగిల్లినట్టు కనిపిస్తోంది. పరస్పర విరుద్ధమైన ఎజెండాలతో ఉన్న టీ ఆర్ ఎస్, బీ జే పీ లు ఒకే రాజకీయ జే సి లో ఉండడం విస్మయం కలిగించే విషయం. రాజకీయ జే సి కి రాజకీయ ఎజెండా ఉండాలి. ప్రణాళికా ఉండాలి. కానీ ఇప్పుడు జే సి లో అటు ఐక్యతా ఇటు కార్యాచరన రెండూ కనిపించడం లేదు. ఇరవైనాలుగు పుల్లల గొడుగుగా జే సి విస్తరిస్తే  రాజకీయ పార్టీలు గొడుగు కింద తలదాచుకున్తున్నాయి. అదికూడా ఎన్నికల దాకే! తరువాత ఎవరిదారి వారిదే అంటున్నాయి.  ఎన్నికల దాకా జాయింట్ గా ఉంటాం ఎన్నికల్లో ఎవరి యాక్షన్ వాళ్ళది ఆంటే ప్రజలకు నిజంగానే పిచ్చెక్కుతుంది.  టీ ఆర్ ఎస్, బీ జే పీ నిన్న ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకున్నారురేపు రాబోయే పరకాల కోసం ఎవరి వలలు వాళ్ళు బుజాన వేసుకుని తిరుగుతున్నారు.  వాళ్ళు ఉమ్మడిగా   ఉద్యమాన్ని నడిపించడం  వీలయ్యే పని  కాదు.  రాజకీయ అవసరాల రీత్యా కూడా అది అనైతికమే అవుతుంది.  రాజకీయ జే సి చేర్మన్ గా ఒకే ఒరలో రెండుకత్తులు పెట్టుకుని యుద్ధం చేస్తానంటే కోదండరామ్ ను ఎవరూ నమ్మరు. జే సి నమ్మకాన్ని పోగొట్టుకుంటే మొత్తం తెలంగాణ ఉద్యమానికే నష్టం. నష్టం ప్రజల ఆత్మ స్థైర్యాన్ని మరింత దెబ్బదీసే ప్రమాదం ఉంది.
  ఏకాభిప్రాయం లేని వాళ్ళు  రాజకీయ పార్టీలు జే సి కి అనుగుణంగా నడుచుకోవదమో లేక జే సి వారిని వదిలిన్చుకోవదమో తప్పనిసరి. అలాగని రాజకీయ పార్టీలను దూరం చేసుకోవాలని కాదు. వాళ్ళనూ కొద్దిరోజులు స్వతంత్రంగా ఎవరిసత్తా ఏమిటో నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి చూస్తే తప్పేమీ లేదు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అన్ని సీట్లూ మావే అని బీరాలు పలుకుతున్న కొన్ని  పార్టీలకు చాలా గ్రామాల్లో, మండలాల్లో పార్టీ శాఖలు కూడాలేవు రకంగానైనా వాళ్ళు వారి వారి పార్టీల పునాదులను పటిష్టం చేసుకుంటారు. రెండేళ్ళ సమయం ఇచ్చి రెండేళ్లలో ఎవరు ఎవరివైపో తేల్చి 2014 లో ప్రజల పక్షాన లేని పార్టీలను నిజంగానే కుప్పవేసి కాల్చి పడేయవచ్చు.   అవకాశం తప్పక వస్తుంది. అప్పటిదాకా ఎవరూ కాలిపోవద్దనే కోరుకుందాం
కొసమెరుపు
కేసీఆర్ చెప్పినట్టు ఒకవేళ ఆలోపే టీ ఆర్ ఎస్ కాంగ్రెస్ లో విలీనం అయితే? అనుమానమే ఇంకో మిత్రునికి వచ్చింది. కే సి ఆర్ మాట అన్నాడో లేదో తెలియదు. అన్నాడని పత్రికలో వచ్చిన వార్త ను అవునని అంగీకరించలేదు,  కాదని ఖండించలేదు. తెలంగాణా ఇస్తే టీ ఆర్ ఎస్ ను విలీనం చేయడం చాలా పెద్ద త్యాగం. తెలంగాణా సాధన కోసమే పార్టీ పెట్టిన కే సి ఆర్ కు రాష్ట్ర సాధన ముందు  పార్టీ విలీనం అనేది అతి చిన్న విషయంగా అనిపించవచ్చు.  కానీ మిత్రుడు మాత్రం కాంగ్రెస్ తెలుగుదేశం లేని తెలంగాణా కావాలని కోరుకుంటున్నాడు. తెలంగాణా రాష్ట్రంలో టీ ఆర్ ఎస్   ఉండాలనుకున్తున్నాడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి