ఆదివారం, జూన్ 26, 2011

మన తరం మార్గదర్శి

ఎంతోమంది మనుషులు, జీవితంలో ఎన్నో మార్గాల్లో నడుస్తారు. అవసరాన్ని బట్టి, అననుకూల పరిస్థితులను బట్టి, ఆలోచనలో మార్పును బట్టి మార్గాలను మార్చుకుంటారు. కానీ ప్రొఫెసర్ జయశంకర్ ఒక్కరే జీవితాంతం ఒకే మార్గంలో నడిచారు. ఒకేమాట మీద నిలిచారు.మనందరినీ తన మార్గంలో నడిపించారు.

ఒక వైపు వీవీ మరో వైపు విమలక్క, మధ్యలో కేసీఆర్! వరంగల్లులో జయశంకర్ సార్ స్ఫూర్తియావూతలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు అదాలత్ దగ్గర అమర వీరుల స్మారక స్తూపం వద్ద కనిపించిన దృశ్యం. సిద్ధాంత రీత్యా భిన్న దృవాలు, ఆచరణలో తూర్పూ పడమరలు, అయినా ఆ యిద్దరి కళ్లలో వేదన మాత్రం ఒకటే. తమ చిరకాల సహచరుడు , అత్యంత ఆత్మీయుడు ఇకలేడన్న దుఖ్కం. ఒక మనిషి రెండు భిన్నమై న ఆలోచనా ధారలలో సమాన గౌరవం పొందడం అందులో మనుషులే అంచనాలకందని ఈ కాలంలో చాలా అరుదు. ప్రొఫెసర్ జయశంకర్ అలాంటి అరుదైన మనిషి. ఆ ఇద్దరినే కాదు, ఆ యిద్దరితోనూ విభేదించే మరెందరినో కలిపిన ఆశారేఖ అతను.


అందుకే తను ఎన్నో ఏళ్లు ఒంటరిగా నడిచిన వరంగల్ వీధుల్లో తన చివరి ప్రయాణంలో లక్షలాది మంది తోడయ్యారు. ఆ జన ప్రవాహంలో నాలుగడుగులైనా వేసి స్ఫూర్తి పొందాలనుకొని కోట్లాది మంది ఆశపడ్డారు. కొందరు గులాబీ పూలు చల్లారు. కొందరు లాల్‌సలాం అన్నారు. మరి కొందరు కాషాయ కండువాలు కప్పుకున్నారు. అనేక మంది నీలి రంగులో నిగనిగ మెరుస్తోన్న జయశంకర్ చిత్రపటాలు మోసుకుంటూ కనిపించారు. తెలంగాణ బీడు భూముల మీద వానచినుకులు కురిసినప్పుడు విరబూసిన సప్తవర్ణ సింగిడి కదా అతను! జీవిత సాఫల్యం కదా అది. ఎంతోమంది మనుషులు, జీవితంలో ఎన్నో మార్గాల్లో నడుస్తారు. అవసరాన్ని బట్టి, అననుకూల పరిస్థితులను బట్టి, ఆలోచనలో మార్పును బట్టి మార్గాలను మార్చుకుంటా రు. కానీ ప్రొఫెసర్ జయశంకర్ ఒక్కరే జీవితాంతం ఒంకే మార్గంలో నడిచారు. ఒకేమాట మీద నిలిచారు. మనందరినీ తన మార్గంలో నడిపించారు. 

ఒక్క వరంగల్ నగరమే కాదు, ప్రపంచవ్యాప్తం గా తెలంగాణ బిడ్డలు నివసిస్తోన్న ప్రతిపల్లే అతని మరణ వార్త విని విలపించింది. ప్రతి పట్టణమూ అతని ఆశను తలచుకుని తల్లడిల్లింది. ప్రతి ఇల్లూ అతన్ని కడసారి చూడాలని కలవర పడింది. ప్రతి గొంతూ అతని ఆశయాలను నినదించింది. ప్రతి గుండే మౌనంగా రోదించింది. నిజంగానే జయశంకర్ సార్ మన కన్నీళ్ల ను కోరుకున్నాడా..? కాదు, అతను అన్వేషించింది , ఆవిష్కరించింది మన కన్నీళ్లను శాశ్వతంగా తుడిచే మార్గాన్ని . తెలంగాణ ఒక్కటే ప్రజ ల దుఖాన్ని దూరం చేయగలదని బోధించిన బుద్ధుడు అతను. అతని ఆకాంక్ష సాకారమైతే తప్ప మనమెంత ఏడ్చినా అతని ఆత్మ శాంతించదు. ఏ ఉపాధ్యాయుడైనా తన బోధించే పాఠాలు కేవలం తన విద్యార్థులకు బతుకుదెరువు చూపుతాయని మాత్రమే అనుకుంటాడు. కానీ సార్ మాత్రం తన జీవితాన్ని ఒక పాఠంగా మలిచాడు. కోట్లాది మంది భవిష్యత్తుని తన పాఠంతో మార్చాలని కలగన్నాడు. ఆ పాఠాన్ని మనం అర్థం చేసుకోకుండా ఎంత దుఖిస్తే మాత్రం ఏం ప్రయోజనం?


సరిగ్గా ఇరవై ఐదేళ్ల కిందట 1986 లో కరీంనగర్ జీవగడ్డ దినపవూతికలో పనిచేస్తున్నప్పుడు నేను జయశంకర్ సార్‌ను కలిశాను. వెలిచాల జగపతిరావు అనే ఒక స్థానిక నాయకుడు ఎందుకో గానీ.. ఆంధ్రవూపదేశ్‌లో ప్రాంతీయ అసమానతలు అనే అంశం మీద ఒక సెమినార్ నిర్వహించాడు. చాలా మంది మేధావులని హైదరాబాద్‌నుంచి పిలిచాడు.బిపీఆర్ విఠల్ సదస్సును ప్రారంభించారు. అతనొక ఐఏఎస్ అధికారి. ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఆయన తరువాత అనేక మంది వక్తలు ప్రసంగించారు. కానీ నాకు ఎవరి మాటలూ అర్థం కాలేదు. చివరగా జయశంకర్ గారు మాట్లాడారు.

ఆయన మాట్లాడుతున్నంత సేపూ మన చరివూతను , జీవితాన్ని కొత్తగా చెపుతున్నట్లు అనిపించింది. అప్పటికి నాకు ఇరవైయేళ్లు కూడా లేవు. తెలంగాణ అంటే ఒక భూభాగమే తప్ప అదొక చరివూతని, సంస్కృతని తెలియదు. ఆ అవగాహన కానీ , అభివూపాయంకానీ నాకప్పటికి అసలే లేవు. కొంత ఉద్వేగానికి లోనయ్యాను. ఒక దశలో ఈ ప్రొఫెసర్ నిజాలే చెపుతున్నాడా అనిపించిందిపసంగాలు ముగిసాక మళ్లీ సార్‌తో మాట్లాడాను. నా అనుమానాలు వ్యక్తం చేసాను. సదస్సు జరిగిన ప్రాంగణంలోనే గంట కు పైగా మాట్లాడాను. అప్పుడు అల్లం నారాయణగారు మా న్యూస్ ఎడిటర్. జయశంకర్ గారి ఇంటర్వ్యూ రిపోర్ట్ చేసాను. ఆ తొలి పరిచయంలో నాకు తెలంగాణ పాఠం చెప్పిన తొలి గురువు జయశంకర్. నాకొక్కడికే కాదు. మా తరానికి, యావత్ తెలంగాణవాదానికే ఆయన ఆది గురువన్న సంగతి ఆ తరువాత నాకర్థమయింది.

ఆ మరుసటి ఏడాదే నేను హైదరాబాద్ వచ్చాను. ఉదయం పత్రికలో పనిచేస్తున్నప్పుడు, ఉస్మానియాలో చదువుకున్నప్పుడు తరచూ కలుస్తూ, వింటూ ఉండేవాడిని. జయశంకర్ సార్‌ది ఒక తండ్రి లాంటి మనసు. పైకి మెచ్చుకున్నట్టు కనిపించకపోయినా సరైన మార్గం ఏదో చెప్పేవారు. ఉదయంలో రసూల్ అనే మిత్రుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో చంపిన విషయంలో అప్పటి ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్థన్‌డ్డితో జర్నలిస్టులకు గొడవ జరిగింది. అందులో నేను క్రియాశీలంగా ఉన్నానని ఉదయం యాజమాన్యం నన్ను ఇబ్బంది పెట్టింది. ఆ విషయం తెలిసి మా జీవగడ్డ విజయకుమార్ సార్ నన్ను కాపాడాలనే ఉద్దేశంతో బండ ప్రకాశ్ అనే మిత్రుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయ న కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు. జయశంకర్ గారు అప్పుడు అక్కడ వీసీగా ఉన్నారు. భయపడాల్సిన పనిలేదు. నేను సార్‌తో మాట్లాడుతాను, దూరవిద్యా కేంద్రంలో సోషియాలజిలో ఒక కన్సప్టూంట్ పోస్టు ఖాళీ ఉంది, వెంటనే చేరిపో అన్నారు. నేను ఒప్పుకోలేదు.

పర్మినెంట్ లెక్చరర్ పోస్టు అయితేనే వస్తానన్నాను. అప్పటికే నేను యుజిసి నిర్వహించే లెక్చరర్ పరీక్ష పాసై ఉన్నాను. ఫెల్లోషిప్ కూడా ఉంది. ఢిల్లీ వెళ్లి జెఎన్‌టియులో పిహెచ్‌డి చెయ్యాలనుకున్నాను. తర్వాత ఒకసారి జయశంకర్ సార్ని కలిసాను. పిహెచ్‌డి చేసాక ఏం చేస్తావ్ అని అడిగాడు. నాకు సమాధానం తెలియదు. సారే అన్నారు. మనకు అవకాశాలే తక్కువ, వచ్చిన అవకాశాల్ని వదులుకోవద్దని, ఉద్యోగం చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు, పిహెచ్‌డి చేసి నా మళ్లీ ఇదే ఉద్యోగానికి రావాలి, ఆలోచించు అన్నాడు. ఈలోగా కాకతీయ యూనివర్సిటీ నోటిఫికేషన్ వచ్చింది. ఉద్యోగమూ వచ్చింది. ఒకరకంగా ఆయన నా ఆలోచనను మార్చేసారు. మార్గనిర్దేశం చేసారు. 

ఆ పరిచయం లేకపోతే నేను అధ్యాపక వృత్తిలోకి వచ్చేవాన్ని కూడా కాదేమో. దాదాపు రెండేళ్లు ఆయన విసిగా ఉండగా నేను కాకతీయలో పనిచేసాను. ఈలోగా నాకు ఓపెన్ యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చిం ది. వెళ్లి రిలీవ్ చెయ్యమని అడిగాను. నేను నిన్ను వదలుకోదలుచుకోలేదు, నువ్విక్కడే ఉండాలి, హైదరాబాద్ కంటే నీ సేవలు అవసరం ఇక్కడే అన్నాడు. అప్పటి ఓపెన్ యూనివర్సిటీ వీసీ బషీరుద్దీన్‌తో స్వయంగా మాట్లాడి మూడు నెలలు గడువు తీసుకున్నారు. ఈ లోగా ఆలోచించుకోమన్నారు. నేను వినలేదు. నాకున్న కారణాల రీత్యా నేను కాకతీయ వదలిపెట్టాను. కానీ సార్ సాహచర్యం మాత్రం వదులుకోలేదు. వచ్చే ముందు ఒక మాటన్నారు. ఇక్కడే ఉంటే తెలంగాణకు, తెలంగాణ ప్రజల కోసం పరితపిస్తున్న వాళ్ల కోసం పనికొచ్చేవాడివి కదా అని. ఎక్కడున్నా ఆ పనిలోనే ఉంటా సార్ అని వచ్చేసాను. ఇప్పటి వరకు ఆ మాట తప్పలేదు.

ఆ తర్వాత చాలా మాట్లాడుకున్నాం. బహుశా జయశంకర్ సార్‌ను ఎక్కువసార్లు ఇంటర్వ్యూ చేసింది కూడా నేనే నేమో. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత సార్ ఎంతో తృప్తిగా కనిపించారు. అప్పుడు ఏబీఎన్ ఛానల్‌లో ఇన్‌సైడర్ పేరుతో ఇంటర్వ్యూ చేసాను. దాదాపు మూడు గంటల పాటు ఆయన తన జీవిత ప్రస్థానమంతా చెప్తూ పోతుంటే అరవయేళ్లు తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర ఆవిష్కృతమైంది. ప్రొఫెసర్ జయశంకర్ జీవితం తెలంగాణ ఆత్మగౌరవ పోరాట చరిత్ర అని అర్థమయింది. ఈ మధ్యనే టి న్యూస్ ఛాన ల్ కోసం ఆయన జీవిత చరివూతను ఆ చరివూత లోంచి తెలంగాణ అస్తిత్వ పోరాట చరివూతను ఆవిష్కరించాలని ప్రయత్నించాను. మే నెల 16న ఒక గంటసేపు మాట్లాడుకున్నాం. ఆయనతో కాలేదు. గొంతు జీరవోయింది. నేను ఆ మరుసటి రోజే కెనడా వెళ్తున్నాను. 

‘నాకు చేత కావ నువ్ వెళ్లు, వచ్చేలోగా నేను బాగావుతాను. రాగానే మొదలు పెడదాం అన్నారు. అంతా ప్లాన్ చేసుకున్నాం. నేను కెనడా నుంచి అమెరికా వెళ్లాను. ఒక దశాబ్దం కిందట ఆయన అక్కడ నాటిన తెలంగాణ బీజాలు ఇప్పుడు మహావృక్షాలై విస్తరించాయి. అక్కడి మిత్రులు సార్ చెప్పిన విషయాల సారాన్ని నెమరువేసుకుంటూ తెలంగాణ కోసం కలలు కంటున్నారు. చికాగో నుంచి ఒకసారి సార్‌తో మాట్లాడాను. ఆస్పవూతికి వెళ్తున్నానని చెప్పాడు. ఇండియా రాగానే ఫోన్ చేసాను. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తున్నట్టు బ్రహ్మం చెప్పాడు. ఇంటికొచ్చి కలుస్తానని చెప్పాను. కానీ అదాలత్ ముందు అమరవీరుల స్థూపం వద్ద వేలాది మందిలో నేనొకడిని. వివి నిల్చున్న స్థూపపు వేదికపైకి పిలిచారు. కేసీఆర్ గులాబీ పూలిచ్చారు. జయశంకర్ సార్‌కు అర్పించి అందరం కలిసి నడిచాం. ఒకవైపు వీవీ, విమలక్క మరోవైపు కేసీఆర్. ముందు మైకులో గద్దర్ పాట ‘పొడుస్తు న్న పొద్దు మీద నడుస్త్తున్న కాలమా...’ ఊరు ఊరంతా పది జిల్లాల జనం. ఆ ప్రయాణం, ప్రవాహం అలాగే కొనసాగితే జయశంకర్ గారి కల నెరవేరుతుంది. తెలంగాణ వచ్చి తీరుతుంది. ఇంతకంటే సార్‌కు మనమిచ్చే నీరాజనం ఏముంటుంది?